బాలీవుడ్ నటుడు శర్మాన్ జోషి, శ్రియా శరణ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మ్యూజిక్‌ స్కూల్’. మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు బియ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు సినీ అభిమానులను అలరిస్తున్నాయి.  ఇళయ రాజా అద్భుత సంగీతానికి తోడు శ్రియా,  శర్మాన్‌ మధ్య అందమైన రొమాంటిక్ ట్రాక్స్ అందరినీ ఆట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో ఏకంగా 11 పాటలు ఉండటం విశేషం.


ఆకట్టుకుంటున్న ‘మ్యూజిక్‌ స్కూల్’ ట్రైలర్


మే 12న ‘మ్యూజిక్‌ స్కూల్’ సినిమా అట్టహాసంగా విడుదలక కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఈ ట్రైలర్ ను విడుదల చేశాడు. సమాజం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి చదువకు సంబంధించిన ఒత్తిడి ఎదుర్కొనే విద్యార్థులకు సంబంధించి, సంగీత నేపథ్య కథనంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పోటీ పరీక్షల పేరుతో విద్యార్థులను కట్టడి చేయాలి అనుకునే తల్లిదండ్రులను కాదని, వారికి మానసిక ఉల్లాసం కలిగించేలా సంగీతం నేర్పించడం, సంగీత ప్రదర్శన ఇప్పించడం కోసం మ్యూజిక్ టీచర్ శ్రియ, ఆమె భర్త శర్మాన్ కలిసి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఈ ట్రైలర్ లో చూపించారు. ఈ సినిమాలో మొత్తం పదకొండు పాటలు ఉండటం విశేషం.






సున్నితమైన కథాంశంతో తెరకెక్కిన ‘మ్యూజిక్‌ స్కూల్‌’


ఐఏఎస్ అధికారిగా పని చేసిన పాపారావు, ఫిల్మ్ మేకర్ గా మారి ‘మ్యూజిక్‌ స్కూల్‌’ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన కీలక విషయాలు వెల్లడించారు. ‘‘సున్నితమైన కథాంశంతో ‘మ్యూజిక్‌ స్కూల్‌’ తెరకెక్కిస్తున్నాం. మన విద్యా విధానంలో విద్యార్థుల మీద సమాజం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. అలా ఉండటం మూలంగా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విద్యార్థులపై ఎలా వ్యవహరించాలి అనే విషయాలను ఈ సినిమలో చూపించే ప్రయత్నం చేశాం. ఈ సినిమాలో మొత్తం 11 పాటలు ఉన్నాయి.  వాటిలో మూడు పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇళయ రాజా సంగీతం అద్భుతంగా అందించారు” అని అన్నారు.  


ఈ చిత్రానికి కిరణ్‌ డియోహాన్స్ సినిమాటోగ్రాఫర్‌ గా వ్యవహరిస్తున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, ఒజు బరువా,  గ్రేసీ గోస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెంజమిన్‌ జిలానీ, సుహాసినీ మూలే, లీలా సామ్సన్‌, బగ్స్‌ భార్గవ, వినయ్‌ వర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వఖార్‌ షేఖ్‌, ఫణి సహా పలువురు కనిపించనున్నారు. యామిని ఫిలిమ్స్‌ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని హిందీ, తెలుగులో చిత్రీకరించారు. తమిళంలో డబ్ చేసి విడుదల చేయున్నారు. మే 12న ఈ సినిమా విడుదల కానుండగా,  హిందీలో పీవీఆర్‌, తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు.


Read Also: ముంబైలో కొత్త ఇల్లు కొనుగోలు చేసిన ఆలియా భట్, ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!