చిత్రా శుక్లా (Chitra Shukla), ఆదర్శ్, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar) ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న సినిమా 'గీత సాక్షిగా' (Geeta Sakshigaa Movie). చేతన్ రాజ్ కథ అందించడంతో పాటు చేతన్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. ఆంథోని మట్టిపల్లి స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల సినిమా టీజర్ విడుదల చేశారు.


'గీత సాక్షిగా' సినిమాలో ఎవరి క్యారెక్టర్లు ఏంటి?
'గీత సాక్షిగా' సినిమాలో ఆదర్శ్ జైలులో ఖైదీగా కనిపించనున్నారు. అతని తరపున వాదించే న్యాయవాది పాత్రలో చిత్రా శుక్లా, ఆమెకు ప్రత్యర్థి న్యాయవాదిగా శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలు పోషించారు.


టీజర్‌లో ఏముంది?
'గీత సాక్షిగా' టీజర్ విషయానికి వస్తే... ఆదర్శ్‌ను అరెస్ట్ చేసి జైలుకు తీసుకు వెళ్లడం, అతని కోసం చిత్రా శుక్లా జైలుకు వెళితే... ముఖం మీద ఒకరు ఇంక్ పోయడం వంటివి టీజర్‌లో చూడవచ్చు. జైలులో కొంత మంది ఎటాక్ చేయబోతే... అందరినీ చితక్కొట్టిన ఆదర్శ్... 'పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి నేను అభిమన్యుడిని కాదు, వాడి బాబు అర్జునుడిని రా' అంటూ చెప్పిన డైలాగ్, ఆయన సిక్స్ ప్యాక్ ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాపై ఆసక్తి పెంచాయి. 



వాస్తవ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను రూపొందిస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. కంటెంట్ బేస్డ్ చిత్రమిదని వారు పేర్కొన్నారు. ఒక చిన్నారి చుట్టూ ఈ కథ తిరుగుతుందట. చిన్నారిని ఎవరో పట్టుకోవాలని ప్రయత్నించడం, ఆ పెద్దల నుంచి తప్పించుకోవడానికి చిన్నారి వేసే అడుగులు ఆసక్తిగా ఉంటాయట.
 
శ్రీ విష్ణు 'మా అబ్బాయి', రాజ్ తరుణ్ 'రంగుల రాట్నం', శ్రీ సింహా కోడూరి 'తెల్లవారితే గురువారం', 'అల్లరి' నరేష్ 'సిల్లీ ఫెలోస్' సినిమాల తర్వాత తెలుగులో చిత్రా శుక్లా నటిస్తున్న చిత్రమిది. ఇటీవల విడుదలైన గోపీచంద్ 'పక్కా కమర్షియల్' సినిమాలో ఆమె అతిథి పాత్రలో నటించారు. సినిమా ప్రారంభంలో ఆత్మహత్య చేసుకునే అమ్మాయిగా కనిపించారు. ఆమె 'ఉనికి' అని మరో సినిమా కూడా చేస్తున్నారు.



Also Read : 'బబ్లీ బౌన్సర్' రివ్యూ : తమన్నా బబ్లీగా ఉన్నారా? బౌన్సర్‌గా ఇరగదీశారా? సినిమా ఎలా ఉందంటే?



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్', 'అల్లరి' నరేష్ 'నాంది'... గత ఏడాది రెండు కోర్ట్ రూమ్ డ్రామాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ రెండూ మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు ఆ కోవలో వస్తున్న మరో సీరియస్ కోర్ట్ రూమ్ డ్రామా 'గీత సాక్షిగా' అని చెప్పవచ్చు. 


భరణి శంకర్, జయలలిత, జయశ్రీ ఎస్ రాజేష్, అనిత చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర, శ్రీనివాస్ ఐఏఎస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు గోపీసుందర్ (Gopi Sundar Music Director) స్వరాలు, నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్ హనుమ, ఎడిటర్: కిశోర్ మద్దాలి, సాహిత్యం: రెహమాన్, కళ: నాని, నృత్యం : యశ్వంత్ - అనీష్, ఫైట్స్ : పృథ్వీ.


Also Read : 'కృష్ణ వ్రింద విహారి' రివ్యూ : నాగశౌర్య నయా సినిమా ఎలా ఉందంటే?