నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి. ఆర్మూరు, బోధన్, నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాదు రూరల్‌, బాల్కొండ. ఈ ఐదు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పోటాపోటాగా తలబడుతున్నాయి. బీజేపీ కూడా ముందుకు దూసుకొచ్చింది. దీంతో నిజామాబాద్‌ జిల్లా త్రిముఖ పోరు తప్పేట్టు లేదు.


ఆర్మూరు నియోజకవర్గం... నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి ఓటర్లలో రాజకీయ చైతన్యం ఎక్కువ. పసుపు రైతులు ఇక్కడి రాజకీయాల్లో  కీలక పాత్ర పోషిస్తారు. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో ఐదు మండలాలు ఉన్నాయి. ఆర్మూర్, నందిపేట్‌, మాక్లుర్ మూడు పాత మండలాలు కాగా రెండు కొత్త మండలాలు ఆలూర్, డొంకేశ్వర్ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 2లక్షల 18వందల 47మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 94,407 మంది, స్త్రీలు లక్షా 7వేల 440. ఆర్మూరు నియోజకవర్గంలో 2014, 2018లో టీఆర్ఎస్ నుంచి ఆశన్నగారి జీవన్‌రెడ్డి గెలుపొందారు. 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి... కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ సురేష్‌రెడ్డిపై  దాదాపు 14 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. జీవన్‌రెడ్డికి 67,555 ఓట్లు రాగా, సురేష్ రెడ్డికి 53,591 ఓట్లు వచ్చాయి. 2018లో టీఆర్ఎస్‌ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డికి 73,125  ఓట్లు రాగా.. ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి.. ఆకుల లలితకు 42,311 ఓట్లు లభించాయి. 29,914 ఓట్ల మెజార్టీతో జీవన్‌రెడ్డి గెలిచారు. బీజేపీ తరపున పోటీ చేసిన  పి.వినయ్‌కుమార్‌రెడ్డి 19,599 ఓట్లు వచ్చాయి. గత రెండు ఎన్నికలను బట్టి చూస్తే... ఆర్మూరు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య ప్రధాని పోటీ ఉండేలా ఉంది. బీజేపీ  మూడో స్థానానికే పరిమితమైంది. ఈసారి కూడా ఆర్మూరు నుంచి ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. 


బోధన్ నియోజకవర్గం.. ఇది మహారాష్ట్ర, నిర్మల్ జిల్లా సరిహద్దులు కలిగి ఉంటుంది. బోధన్ నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. బోధన్, ఎడపల్లి, రెంజల్, నవీపేట్  పాత మండలాలు కాగా, సాలూర కొత్త మండలంతో పాటు బోధన్ మున్సిపాలిటీ ఉంది. బోధన్ నియోజకవర్గం మొత్తం ఓటర్లు 2లక్షల 7వేల 921 మంది. వీరిలో పురుషులు  99,782, స్త్రీలు 1,08,139. బోధన్ నియోజకవర్గంలో గత రెండు ఎన్నికల్లోనూ గులాబీ జెండానే ఎగిరింది. 2014లో టీఆర్ఎస్ (బీఆర్‌ఎస్‌) అభ్యర్థి షకీల్ అమీర్ చేతిలో కాంగ్రెస్  అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి ఓడిపోయారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి షకీల్ అమీర్  67,426 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి 51,543 ఓట్లు వచ్చాయి. దాదాపు 16వేల ఓట్ల  మెజారిటీతో గెలిచారు షకీల్‌ అమీర్‌. 2018లోనూ ఇదే పరిస్థితి. 2018లో టీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ అమీర్‌కు 74,895 ఓట్లు రాగా... కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి 66,794 ఓట్లు  వచ్చారు. షకీల్‌ అమీర్‌కు 8వేలకుపైగా మెజార్టీ వచ్చింది. ఈసారి కూడా బీఆర్‌ఎస్‌ నుంచి షకీల్ అమీర్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌తో తలపడబోతున్నారు.


నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం... ఇది 1952లో ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు పట్టుంది. నిజామాబాద్ అర్బన్  నియోజకవర్గంలో 2,74,341 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 1,32,933 మంది... స్త్రీలు 1,41,408 మంది. నిజామాబాద్ అర్బన్‌లో గత రెండు ఎన్నికల్లోనూ  బీఆర్‌ఎస్‌ గెలిచింది. 2009లో టీఆర్ఎస్ ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన బీగాల గణేష్... 2014, 2018లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి  బీగాల గణేష్‌కు 71,896 ఓట్లు రాగా... కాంగ్రెస్ అభ్యర్థికి 46,055 ఓట్లు వచ్చాయి. 25,841 ఓట్ల మెజారిటీతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గణేష్‌ గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ  బీగాల గణేష్‌కే టికెట్‌ ఇచ్చింది బీఆర్‌ఎస్‌. ఇక్కడ బీజేపీకి కూడా బలముంది... మున్సిపల్ ఎన్నికల్లో 60 డివిజన్లలో 28 డివిజన్లు గెలిచి బలం నిరూపించుకుంది బీజేపి. ఈ  పరిస్థితుల్లో నిజామాబాద్‌ అర్బన్‌లో త్రిముఖ పోటీ కనిపిస్తోంది. 


నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం... 1952లో ఏర్పడింది. నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు..  2లక్షల 41వేల 47 మంది. ఇందులో పురుషులు 1,12,518, స్త్రీలు 1,28,529. నిజామాబాద్ రూరల్‌లో మొదటి నుంచి టీడీపీకి పట్టుకుంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పిడిన  తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పట్టు సాధించింది. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలిచారు. 2014లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో  బాజిరెడ్డి గోవర్థన్‌రెడ్డి. అంతకుముందు ఆర్మూర్, బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా పేరుంది. 2014లో బీఆర్ఎస్‌లో చేరిన బాజిరెడ్డి  2014, 2018లో రూరల్ నుంచి బరిలోకి దిగి గెలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థిని ఓడించారు. 2018లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూపతిరెడ్డికి  ఓడించారు. జాబిరెడ్డికి 87,976 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూపతిరెడ్డికి 58,330 ఓట్లు లభించాయి. బాజిరెడ్డి గోవర్దన్ 29,646 మెజారిటీతో విజయం సాధించారు. 2023 ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ నుంచి బాబిరెడ్డే బరిలో ఉన్నారు.


బాల్కొండ నియోజకవర్గం... ఇది జగిత్యాల, నిర్మల్ జిల్లాల సరిహద్దు. 1952లో ఏర్పడింది. బాల్కొండ నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు ఉన్నాయి. బాల్కొండ,  మోర్తాడ్, భీంగల్, వేల్పూర్, కమ్మర్ పల్లి ఐదు పాత మండలాలు కాగా... మెండోరా, ముక్కల్, ఏర్గట్ల కొత్త మండలాలు. ఈ నియోజకవర్గ పరిధిలో భీంగల్ మున్సిపాలిటీ కూడా  ఉంది. బాల్కొండ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2లక్షల 8వేల 416 మంది. వీరిలో పురుషులు: 96,244, స్త్రీలు1,12,172 మంది. గత రెండు ఎన్నికల్లో బాల్కొండ నుంచి  బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి గెలిచారు. ఈయనకు రెండుసార్లు మంత్రి పదవి వరించింది. ప్రస్తుతం రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల మంత్రిగా  వ్యవహరిస్తున్నారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్‌పై విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి ఆలేటి మల్లికార్జునరెడ్డికి కూడా  ఓట్లు బాగానే వచ్చాయి. అయితే వేముల ప్రశాంత్‌రెడ్డి 36వేలకుపైగా మెజార్టీతో గెలిచారు. 2018 ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి-బీఎస్పీ అభ్యర్థి ముత్యాల  సునీల్‌ కుమార్‌ను ఓడించారు. వేముల ప్రశాంత్‌రెడ్డికి 73,662 ఓట్లు రాగా... బీఎస్పీ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్‌కు 41,254 ఓట్లు వచ్చాయి. ముత్యాల సునీల్‌పై 32,40  ఓట్ల మెజారిటీతో గలిచారు ప్రశాంత్‌రెడ్డి. ముత్యాల సునీల్ కాంగ్రెస్లో చేరి బాల్కొండ నుంచి 2023 అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రశాంత్ రెడ్డికే టికెట్  కేటాయించింది.