అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తెలంగాణ రాజకీయాలు మారిపోతున్నాయి. బీఆర్ఎస్‌లో ఆసక్తికర పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ జనగామ అభ్యర్థిని మార్చేస్తుందా ? సిట్టింగ్ ఎమ్మెల్యే మత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కాదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. సీటు త్యాగం చేసినందుకు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేతులు కలిపారు. పల్లా విజయం కోసం పని చేస్తానని, పార్టీ గెలుపే తన లక్ష్యమని ప్రకటించాడు. పల్లా, ముత్తిరెడ్డి చేతులు కలిపారు. ఆలింగనాలు చేసుకున్నారు. పార్టీ శ్రేణులు,కార్యకర్తలంతా సంబరాలు చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఇక ఎదురే ఉండదని భావించారు.


ఊహించని పరిణామం 
ఇంతలోనే జనగామ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రేపో మాపో పల్లా రాజేశ్వర్ రెడ్డిని కాదని, కొత్త అభ్యర్థికి టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ నుంచి హామీ రావడంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ తనను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుండేలా చేస్తానంటూ ప్రజలకు హామీ ఇస్తున్నారు. మంత్రి కేటీఆర్ నచ్చజెప్పడంతో  ముత్తిరెడ్డి వెనక్కితగ్గారు. దీంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇక తనకే టికెట్ ఖరారైందని లోలోపల సంబర పడ్డారు. నియోజకవర్గంలో గెలుపు నల్లేరు మీద నడకేనని భావించారు. 


పొన్నాలకు టికెట్ ?
ఏదో అనుకుంటే, ఇంకేదో అయినట్లు పల్లా రాజశ్వేర్ రెడ్డి పరిస్థితి తయారైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తరపున జనగామ నుంచి నాలుగు పర్యాయాలు గెలుపొందిన పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. మంత్రి కేటీఆర్ స్వయంగా పొన్నాల ఇంటికి వెళ్లి, పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత పొన్నాల లక్ష్మయ్యను జనగామ అభ్యర్థిగా నిలబెడతారన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాలుగు సార్లు గెల్చిన పొన్నాల, నీటి పారుదల, సాంకేతిక విద్యశాఖల మంత్రిగా పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక, తొలి పీసీసీ చీఫ్ పని చేశారు. 


బీసీ కార్డు
పొన్నాల లక్ష్మయ్యను పార్టీలోకి చేర్చుకోని, జనగామ టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. పొన్నాలకు టికెట్ ఇవ్వడం ద్వారా బీసీ కార్డు కూడా ప్రయోగించవచ్చన్న లక్ష్యంతో ఉంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు, కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తోందని చెప్పడం, బీఆర్ఎస్ పార్టీ బీసీలకు అండగా ఉంటుందనే చెప్పేలా ప్రణాళికలు సిద్ధం ఆ పార్టీ నేతలు. పొన్నాల లక్ష్మ్యకు టికెట్ ఇస్తే ముత్తిరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకరిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. 


కాంగ్రెస్ నాయకత్వంపై పొన్నాల విమర్శలు
పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీని వీడుతూ రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని చెబుతూ పార్టీని అమ్మకానికి పెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు పగ్గాలు అప్పగిస్తే వారు బజార్లో గొడ్లను అమ్మినట్లు టికెట్లను అమ్ముకుంటున్నారని విమర్శలు చేశారు. బీసీలకు సీట్లను ఎగ్గొట్టడానికి దొంగ సర్వేలు చేయిస్తూ,  బీసీ అభ్యర్థులు ఓడిపోయేవారు అన్నట్లు చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో లేని వ్యక్తులు గెలుస్తారంటూ వారికి టికెట్లు కేటాయించే కుట్ర జరుగుతోందని పొన్నాల మండిపడ్డారు.