కాంగ్రెస్​ పార్టీలో బీసీ నినాదం చిచ్చు రాజేసేలా కనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీ నేతలంతా తమ వాటా ఎంతో తేల్చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. జానాభా ప్రకారం సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినా సీట్ల వాటా తేల్చకపోవడంతో బీసీ నేతలు చలో గాంధీ భవన్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. నేడు గాంధీ భవన్ లో సత్యగ్రహ దీక్షకు రెడీ అయ్యారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు చొప్పున 34 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. సీట్ల విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని బీసీ నేతలంతా మూకుమ్మడి కాంగ్రెస్ హైకమాండ్ పై ఒత్తిడి తెచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే వీహెచ్, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ లాంటి నేతలు ఢిల్లీ వెళ్లి అధిష్ఠానం పెద్దలను కలిశారు. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. 


మొదటి జాబితాలో 72 మంది పేర్లు
ఎన్నికల షెడ్యూల్​ వచ్చినప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో మాత్రం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతూనే ఉంది. మొదటి జాబితాలో 72 మంది పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ రూపాల్లో తమ గళం వినిపించిన నేతలు, ఇప్పుడు గాంధీభవన్​ వేదికగా సత్యాగ్రహ దీక్షకు దిగుతామని పార్టీ హైకమాండ్​కు అల్టిమేటం జారీ చేశారు. ‘హలో బీసీ.. చలో గాంధీభవన్​’ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై శుక్రవారం ఢిల్లీలో స్క్రీనింగ్​ కమిటీ మీటింగ్​ జరగనుండగానే.. అదే టైమ్​లో ‘‘హలో బీసీ.. చలో గాంధీభవన్​’’ పేరిట సత్యాగ్రహ దీక్ష చేపట్టాలని బీసీ నేతలు నిర్ణయించారు. కొత్తగా పార్టీలో చేరుతున్న వారికి సర్వేల్లో మంచి ఫలితాలు ఎలా వస్తున్నాయని, ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న బీసీలకు అవే సర్వేల్లో నెగెటివ్​ ఎలా వస్తుందని మండిపడుతున్నారు. బీసీలకు వారి వాటా వారికి దక్కాలన్నది పార్టీ ముఖ్య నేత రాహుల్​ గాంధీ మాటేనని గుర్తుచేస్తున్నారు. 


బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న స్థానాలు డిమాండ్
ఏ యే నియోజకవర్గాల్లో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారో, ఆయా సీట్లను బీసీ వర్గాలకే కేటాయించాలని పార్టీని కోరుతున్నారు. సర్వేలు చూపించి బీసీలకు అన్యాయం చేస్తే సహించబోమని హెచ్చరిస్తున్నారు. పీసీసీ చీఫ్ చెప్పినట్లుగా బీసీలకు 34 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. హైకమాండ్​కు లాయల్​గా ఉంటూనే పోరాటం చేస్తామని, ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో లోక్​సభ పరిధిలో రెండు సీట్లను ఇవ్వాల్సిందేనని కోరుతున్నారు. బీసీల ఓట్లు లేనిదే ఏ పార్టీ గెలిచే పరిస్థితి లేదని తేల్చి చెప్తున్నారు. బీసీలు ఎక్కువున్నప్పుడు బీసీ లీడర్లకు టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. కాంగ్రెస్ సహా ఏ పార్టీలోనూ బీసీలకు న్యాయం జరగడం లేదని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. బీసీ ఓటర్లు అధికంగా ఉండి, గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలల్లో ప్రాధాన్యత కల్పించాలని పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ అంటున్నా. తెలంగాణలో మార్పు రావాలంటే బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్‌ ఏర్పాటు అవుతుందని, బహుజనుల పాత్ర ఏమిటి అని అడుగుతున్నట్లు బీసీలు చెబుతున్నారు.