తెలుగు స్టార్ కమెడియన్ బ్రహ్మానందం మద్దతు ఇచ్చిన అభ్యర్థి కర్ణాటక ఎన్నికల్లో ఓడిపోయారు. బీజేపీ నేత, ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ తరపున నాలుగు రోజులు చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో బ్రహ్మానందం ప్రచారం చేశారు. అయితే అక్కడ సుధాకర్ 11,130 ఓట్ల తేడాతో ఓడిపోయారు.


చిక్ బల్లాపూర్ నియోజకవర్గం 11,130 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ విజయం సాధించారు. ఈశ్వర్ కు 69,008 ఓట్లు రాగా, సుధాకర్ కు 57878 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇక జేడీఎస్ అభ్యర్థి కేపీ బచే గౌడ 13,300 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకి ఆనుకుని ఉన్న చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో తెలుగు ఓటర్లు అధికం. ఈ క్రమంలో గత ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థి సుధాకర్ తరపున బ్రహ్మానందం ప్రచారం చేశారు. అప్పట్లో సుధాకర్ గెలిచారు కూడా. దాంతో తాజా ఎన్నికల్లోనూ అదే సెంటిమెంట్ ను రిపీట్ చేయాలనే ఉద్దేశంతో సుధాకర్ తన ఫ్రెండ్ బ్రహ్మానందంతో ప్రచారం చేయించారు. కానీ.. చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో నాలుగు రోజులపాటు బ్రహ్మానందం ప్రచారం చేసినా ఈసారి లాభం లేకపోయింది.