Election Commission report: ఎన్నిక‌లు అన‌గానే రాజ‌కీయ నాయ‌కులు(Political leaders) లాస్ట్ బెంచ్ స్టూడెంట్‌ ప‌దో త‌ర‌గ‌తి లెక్క‌ల ప‌రీక్ష రాస్తున్నంత క‌ఠినంగా ఫీల‌వుతారు. ఎన్నిక‌ల గంట కొడుతున్నారంటే చాలు వాళ్ల గుండెల్లో గంట‌లు మోగుతాయి. ఇంత సీరియ‌స్‌గా నాయ‌కులు ఫీల‌వుతారు. అయితే.. తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం(Election Commission report) ఓ నివేదిక వెలువ‌రించింది. దీనిలో ప‌లు కీల‌క విష‌యాలు వెలువ‌రించింది.


దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో 70-80 శాతం మంది ఎలాంటి సీరియ‌స్‌నెస్ లేకుండానే ఎన్నిక‌ల్లో పాల్గొంటున్నార‌ని తెలిపింది. అది కూడా దేశానికి(India) స్వాతంత్య్రం వ‌చ్చిన నాటి నుంచి కూడా ఇలానే ఉంద‌ని పేర్కొన‌డం మ‌రో విశేషం. ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల మాట ఎలా ఉన్నా.. చోటా మోటా పార్టీలు స‌హా స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా బ‌రిలోకి దిగుతున్న‌వారు.. నాన్ సీరియ‌స్‌గానే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నార‌ని తెలిపింది. దీంతో వారికి డిపాజిట్లు కూడా ద‌క్క‌డం లేద‌ని, కేవ‌లం ఇలాంటివారు రికార్డుల కోస‌మో.. ప్ర‌చారం కోసమో, తాము కూడా ఎన్నిక‌ల్లో పోటీ చేశామ‌ని చెప్పుకొనేందుకో ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు కేంద్ర ఎన్నిక‌ల సంఘం వివ‌రించింది. 


నివేదిక‌లోని ముఖ్యాంశం ఇదీ.. 
సార్వ‌త్రిక ఎన్నికల్లో(General Elections) పోటీ చేస్తున్న‌ అభ్యర్థుల సంఖ్య నానాటి పెరుగుతున్న‌ట్టు కేంద్ర ఎన్నిక‌ల సంఘం (Election Commission)  తెలిపింది. అయితే.. ఇలా పోటీ చేస్తున్న‌వారిలో సీరియ‌స్‌గా ఉన్న‌వారు 20 శాతం మందేన‌ని వెల్ల‌డించ డం గ‌మ‌నార్హం. దీంతో మొగిలి 70-80 శాతం మంది అభ్య‌ర్థులు డిపాజిట్లు కోల్పోతున్నార‌ని ఎన్నిక‌ల సంఘం వివ‌రించింది. ఇలా దేశంలో తొలి లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు 71 వేల మందికి పైగా అభ్య‌ర్థులు ‘సెక్యూరిటీ డిపాజిట్‌’ కోల్పోయినట్లు ఎన్నిక‌ల సంఘం నివేదిక‌లో వెల్లడైంది. అయితే, జాతీయ పార్టీల విష‌యంలో ఈ ప‌రిస్థితి కొంత మెరుగ్గానే ఉన్న‌ట్టు తెలిపింది.  


డిపాజిట్ అంటే ఏంటి?  
ఎన్నిక‌ల్లో పోటీ చేయడం అంటే.. దేశ‌వ్యాప్తంగా ఉన్న అనేక పార్టీల నుంచి స్వ‌తంత్రుల(Indipendents) వ‌ర‌కు ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గానికి క‌నీసంలో క‌నీసం 10 మంది అభ్య‌ర్థులు పోటీ చేస్తారు. ప్ర‌ధాన పార్టీలు, చిన్నా చిత‌కా పార్టీలు, స్వ‌తంత్ర అభ్య‌ర్థులు ఇలా.. ఓ 10 మంది వ‌ర‌కు పోటీ చేస్తారు. గ‌త 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పోటీ చేసిన వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గంలో 241 నామిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. ఇలా వ‌చ్చిన‌ప్పుడు ఎన్నిక‌ల సంఘంపై భారం ప‌డుతుంది. అందుకే.. ముందుగానే కొంత రుసుమును వ‌సూలు చేస్తారు. దీనినే డిపాజిట్ అంటారు.


పోటీ చేసే అభ్య‌ర్థి. ``నాకు ప్ర‌జ‌ల్లో మ‌ద్ద‌తు ఉంది. కాబ‌ట్టే పోటీ చేస్తున్నాను. లేక‌పోతే ఈ డిపాజిట్‌ను ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు`` అని అఫిడ‌విట్‌లో పేర్కొంటారు. ఇలా ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థి తాను పోటీచేసే నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లలో ఆరో వంతు ఓట్లను సాధిస్తేనే డిపాజిట్ తిరిగి ల‌భిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) నివేదిక ప్రకారం.. దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటి వరకు 91,160 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో 71,246 మందికి డిపాజిట్లే రాలేదు. అంటే 78 శాతం అభ్యర్థులకు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తులేదు. లేదా వారికి సీరియ‌స్ నెస్ లేదు. 951-52లో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో 1874 మందికి గాను 745 మంది అభ్యర్థులు డిపాజిట్‌ కోల్పోయారు. 


డిపాజిట్ ఎంతెంత క‌ట్టాలి? 
ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థి డిపాజిట్(Diposite) చెల్లించే విష‌యంలో రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేస్తున్నారు. దీని ప్ర‌కారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల‌కు ప్ర‌త్యేకంగా డిపాజిట్ల సొమ్మును నిర్ణ‌యిస్తారు. 1950ల‌లో జ‌రిగిన తొలి సార్వత్రిక ఎన్నికల సమయంలో డిపాజిట్‌ కింద జనరల్‌ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.250 ఉండేది. ప్రస్తుతం అది జనరల్‌ అభ్యర్థులకు రూ.25 వేలు, ఎస్సీ/ఎస్టీలకు రూ.12,500లకు పెరిగింది.  ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. డిపాజిట్ కోల్పోతామని ముందే తెలిసినా తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు అనేక మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నార‌ని నివేదికలో తేలింది. 


డిపాజిట్ గల్లంతు అంటే ఏమిటి 
ఏదైనా నియోజకవర్గంలో చెల్లుబాటు అయిన ఓట్లలో 6వ వంతు కంటే తక్కువ ఓట్లు వస్తే.. ఆ అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్ వెనక్కి తిరిగి ఇవ్వరు. దీన్నే డిపాజిట్ కోల్పోవడం, లేక డిపాజిట్ గల్లంతైంది అంటారు. అంటే రూ. 25,000 లేదా రూ. 10,000 లేదా మరేదైనా డిపాజిట్ చేసిన అభ్యర్థికి ఈసీ తిరిగి చెల్లించదు.


ఎప్పుడెప్పుడు ఎంత‌మంది డిపాజిట్ కోల్పోయారు? 


- 1991-92లో  జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 86 శాతం మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 


- 1996లో 11వ లోక్‌సభ ఎన్నికల్లో 91 శాతం అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. మొత్తం 13,952 అభ్యర్థులు బరిలో ఉండగా.. 12,688 మందికి  క‌నీసం ఓట్లు కూడా రాలేదు. 


- 2009లో 85 శాతం, 2014లో 84 శాతం అభ్యర్థులు డిపాజిట్‌ కోల్పోయారు.
 
- 2019లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నికల్లో 86 శాతం మంది వివిధ పార్టీల అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.