AP Chief Electoral Officer Mukesh Kumar Meena: అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct) అమల్లోకి వచ్చిన తరువాత కోడ్ ఉల్లంఘించిన వారిపై 3 రోజుల్లో 385 ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. రూ.3.39 కోట్ల విలువైన నగదుతో పాటు లిక్కర్, డ్రగ్స్ ను సైతం స్వాధీనం చేసుకున్నామని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. మార్చి 16 న కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూలు ప్రకటించడంతో దేశ వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా తీసుకున్న చర్యలను బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.


గిద్దలూరు, ఆళ్లగడ్డ, మాచర్లలో కొన్ని హింసాత్మక ఘటనలు


రాష్ట్రంలో అవినీతి రహితంగా, పారదర్శకంగా, రీ పోలింగ్ కు అవకాశం లేని ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తామని ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. దురదృష్టవశాత్తూ ఇటవల గిద్దలూరు, ఆళ్లగడ్డ, మాచర్లలో కొన్ని హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఈ హింసాత్మక ఘటనకు దారితీసిన పరిస్థితులు, చట్టపరంగా తీసుకున్న చర్యలను వివరించేందుకు సంబందిత జిల్లాల ఎస్పీలు గురువారం తమ కార్యాలయానికి వస్తున్నారని ఆయన వెల్లడించారు. ఏపీలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు పరుస్తున్నామని, ఎం.సి.సి. ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


ఈ ఏడాది జనవరి 1 నుంచే విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. దాదాపు రూ.176 కోట్లు విలువైన నగదు, విలువైన లోహాలు, నార్కొటిక్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు ముఖేష్ కుమార్  మీనా తెలిపారు. మద్యం ఉత్పత్తి, విక్రయాలపై  ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ కంటే ముందు రోజులతో పోల్చితే ప్రస్తుతం మద్యం ఉత్పత్తి, పంపిణీ, నిల్వలను రెగ్యులర్ గా పర్యవేక్షిస్తున్నారు. గత ఏడాది ఉన్న సాదారణ ఉత్పత్తి, నిల్వలు కంటే ఈ ఏడాది తక్కువ స్థాయిలో ఉన్నాయని తెలిపారు.


అదే విధంగా ఆస్తుల వికృతీకరణ సంబంధించి 94 కేసులు నమోదయ్యాయి. వాహనాలు, లౌడ్ స్పీకర్లు దుర్వినియోగంతో పాటు చట్టవిరుద్దమైన సమావేశాలు, ఓటర్లను ప్రేరేపించడం సంబంధించి 37 కేసులు నమోదు చేశామన్నారు. రాజకీయ నేతల ఫొటోలు, ప్రకటనలకు సంబందించి ప్రజా ఆస్తుల పరిధిలో 1.99 లక్షలు, ప్రైవేటు ఆస్తుల పరిధిలోని 1.15 లక్షల వాల్ పెయింటిగ్స్, పోస్టర్లు, బ్యానర్లు, ఇతర వస్తువులను సిబ్బంది తొలగించారు.


కార్యక్రమాలకు అనుమతి తప్పనిసరి
రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎవరైనా కార్యక్రమాలు నిర్వహించాలంటే అనుమతులు తీసుకోవాలని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సువిధా యాప్ (Suvidha App) ద్వారా అనుమతులు తీసుకోవాలి. ఈ యాప్ ద్వారా ఇప్పటి వరకూ 392 ధరఖాస్తులు అందగా, వాటిలో 10 ఈసీ పరిధిలోనివి. మిగతా కేసులు జిల్లా ఎన్నికల అధికారుల పరిధిలో ఉన్నాయి.  ఎం.సి.సి. ఉల్లంఘనకు సంబందించిన ఫిర్యాదులను సీ విజిల్ యాప్ (cVIGIL app) ద్వారా నమోదు చేసుకున్న 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు దాదాపు 1,173 ఫ్లయింగ్ స్క్వాడ్లు పనిచేస్తున్నాయి. సీ విజిల్ యాప్ ద్వారా ఇప్పటివరకూ 1,307 ఫిర్యాదులు అందగా, వాటిలో 74 శాతం ఫిర్యాదులు పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. సి-విజిల్ పిర్యాధుల్లో 95 శాతం మేర పరిష్కరించే లక్ష్యంతో పనిచేస్తాం. ఈ యాప్ ను అందరూ వినియోగిస్తూ ఎం.సి.సి. ఉల్లంఘనలను నియంత్రించేందుకు సహకరించాలని రాష్ట్ర ప్రజలను ఆయన కోరారు.