Election Results:



డిసెంబర్ 6న సమావేశం..


ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌...ఈ మూడు రాష్ట్రాల్లోనూ (Election Results 2023) బీజేపీయే లీడ్‌లో ఉంది. ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ వెనకబడిపోయింది. ఈ క్రమంలోనే I.N.D.I.A కూటమి నేతలు (I.N.D.I.A. Bloc Meet) డిసెంబర్ 6వ తేదీన సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నారు. కూటమి భవిష్యత్‌పై చర్చించనున్నారు. ఢిల్లీ వేదికగా ఈ భేటీ జరగనుంది. సెప్టెంబర్ 13న చివరిసారి ఈ కూటమి సమావేశమైంది. విపక్ష కూటమిలోని పార్టీల మధ్య ఐక్యతపై కీలకంగా చర్చించే అవకాశాలున్నాయి. అధికార బీజేపీకి చెక్ పెట్టేందుకు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో ఈ భేటీలోనే నిర్ణయించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు జరగనున్న ఈ భేటీ చాలా కీలకంగా మారింది. ఈ కూటమిలో 14 పార్టీల ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇంట్లోనే ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశం చాలా కీలకమైందని, అందరూ తప్పక హాజరు కావాలని ఖర్గే అందరికీ ఆహ్వానం పంపారు. కూటమి అయితే ఏర్పాటైంది కానీ...ఇప్పటి వరకూ సీట్ల షేరింగ్ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ సీట్ల పంపకాల్లో స్పష్టత కోసమే కూటమి నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు మల్లికార్జున్ ఖర్గే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ కూటమి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 


వ్యూహాలపై కసరత్తు..


ఇప్పటి వరకూ కాంగ్రెస్ చేతిలో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ రాష్ట్రాలున్నాయి. ఇప్పుడవీ చేజారేలా ఉన్నాయి. I.N.D.I.A. కూటమిని లీడ్‌ చేయాలని కాంగ్రెస్‌ భావిస్తున్నా...ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి ఆ బాధ్యతలు అప్పగించేందుకు మిగతా పార్టీలు అంగీకరిస్తాయా లేదా అన్నదీ ఓ సమస్య. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ కన్వీనర్‌గా ఉంటారని ఆ మధ్య ఊహాగానాలు వినిపించాయి. ఇన్నాళ్లూ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ఇకపై పూర్తిగా కూటమి రాజకీయాలపై దృష్టి పెట్టాలని చూస్తోంది. అందుకే అత్యవసర భేటీకి పిలుపునిచ్చింది. ఈ సమావేశంలోనే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన జాయింట్ యాక్షన్ ప్లాన్‌ సిద్ధం చేసుకోనుంది. ప్రచార వ్యూహాలనూ ఖరారు చేయనుంది.