తెలంగాణలో ఎంసెట్ ఫలితాలను వచ్చే వారం విడుదల చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి దోస్త్ సీట్ల కేటాయింపు సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి డిగ్రీ తరగతులు మొదలవుతాయని ఆయన వెల్లడించారు. జోసా కౌన్సెలింగ్‌తో ముడిపడి ఉన్నందున ఈసారి నవంబరు 1 నుంచి ఇంజినీరింగ్ తరగతులను ప్రారంభిస్తామని నవీన్ మిట్టల్ తెలిపారు. ఈ ఏడాది ఎంసెట్ ఇంజినీరింగ్‌కు పరీక్షలకు 1.56 లక్షలు, అగ్రికల్చర్ పరీక్షకు 80 వేలమంది విద్యార్థులు హాజరయ్యారన్నారు.


మూడు విడతల కౌన్సెలింగ్..
ఎంసెట్ ఫలితాలు వెలువడిన నాటి నుంచి వారం పదిరోజుల్లో ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్‌ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో జేఎన్‌టీయూహెచ్, ఓయూ అధికారులు ఆయా ప్రైవేట్ కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తిచేసి సిద్ధంగా ఉండాలని నవీన్ మిత్తల్ సూచించినట్లు సమాచారం. మొదట రెండు విడతల కౌన్సెలింగ్‌ను ముగించాలని, చివరి విడతను మాత్రం ఐఐటీ, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి జోసా కౌన్సెలింగ్ పూర్తయ్యాక జరపాలని నిర్ణయించినట్లు తెలిసింది. దానివల్ల రాష్ట్ర విద్యార్థులు నష్టపోకుండా, సీట్లు మిగిలిపోకుండా ఉంటాయని కమిటీ భావిస్తోంది.


రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్ పరీక్షలు జులై 20న ముగిసిన సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 18 నుంచి 20 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహించారు. మూడు రోజుల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు సంబంధించి మొత్తం 1,72,243 మంది విద్యార్థులు ఎంసెట్ ఎగ్జామ్ కోసం దరఖాస్తు చేసుకోగా, కేవలం 1,56,812 మంది మాత్రమే హాజరయ్యారు. 9 శాతం విద్యార్థులు పరీక్ష రాయలేదు. ఇక ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షలను జులై 30, 31వ తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 94,476 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 80,575 (85.3 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు.


కాగా ఈ ఏడాది ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీని రద్దు చేసిన విషయం తెలిసిందే. పాత నిబంధనల ప్రకారం జనరల్‌ విద్యార్ధులు ఇంటర్‌లో 45 శాతం, మిగిలిన వారు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందటం తప్పనిసరిగా ఉంది. అంతేకాకుండా ఈ సారి ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ కూడా ఉండదు. అంటే ఎంసెట్‌లో వచ్చిన మార్కులతోనే ర్యాంక్‌ కేటాయిస్తారన్నమాట. 70 శాతం సిలబస్‌తోనే ఎంసెట్‌లో ప్రశ్నలను రూపొందిచాలని నిర్ణయించారు. 160 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 160 మార్కుల చొప్పున పశ్నాపత్రం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.


 


Also Read:


హైదరాబాద్ విద్యార్థికి బంపర్ ఆఫర్, ఏకంగా రూ.1.30కోట్ల స్కాలర్‌షిప్!!


బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పీఎం యశస్వీ స్కాలర్‌షిప్ దరఖాస్తులు షురూ!



పేద విద్యార్థుల జీవితాల్లో ‘పరివర్తనం’ - హెచ్‌డీఎఫ్‌సీ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌



పేద విద్యార్థులకు 'ఉపకారం' - పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేశారా?


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..