తెలంగాణ ఎంసెట్ ఫ‌లితాలు గురువారం (మే 25) విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. అయితే ఇంజినీరింగ్ విభాగంలో ఐదు, ఆరో సెషన్లలో హాజ‌రైన విద్యార్థుల‌కు మూడు మార్కుల చొప్పున క‌లిపారు. ఆ రెండు సెష‌న్లలో వ‌చ్చిన ప్రశ్నప‌త్రంలోని మ్యాథ్స్ విభాగంలో మూడు ప్రశ్నలు త‌ప్పుగా వ‌చ్చాయి. దీంతో ఆ రెండు సెష‌న్లలో హాజ‌రైన విద్యార్థులంద‌రికీ 3 మార్కుల చొప్పున క‌లిపిన‌ట్లు ఎంసెట్ క‌న్వీన‌ర్ వెల్లడించారు.

మ్యాథ్స్ ప్రశ్నప‌త్రం రూపొందించిన స‌మ‌యంలోనే మూడు ప్రశ్నల విష‌యంలో ఈ త‌ప్పిదం జ‌రిగింద‌ని తెలిపారు. స‌బ్జెక్ట్ ఎక్స్‌ప‌ర్ట్ క‌మిటీ నిర్ణయం మేర‌కు ఐదు, ఆరో సెష‌న్ల‌లో హాజ‌రైన విద్యార్థుల‌కు మూడు త‌ప్పుడు ప్రశ్నల‌కుగానూ 3 మార్కుల చొప్పున క‌లిపారు. తొలి, రెండు, మూడు, నాలుగో సెష‌న్‌కు హాజ‌రైన విద్యార్థుల‌కు ఎలాంటి మార్కులు క‌ల‌ప‌లేద‌ని కన్వీనర్ స్పష్టం చేశారు. ఈ విష‌యాన్ని విద్యార్థులు గ్రహించాల‌ని సూచించారు.

ఎంసెట్ ఫలితాల వివరాలు ఇలా..

ఎంసెట్ ఫలితాల్లో మొత్తంగా 83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో ఇంజినీరింగ్‌లో 80 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగంలో 86 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌లో బాలురు 79 శాతం, బాలికలు 82 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక అగ్రికల్చర్‌ &  ఫార్మసీ విభాగంలో 84 శాతం బాలురు, 87 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు.

ఎంసెట్‌ ఇంజినీరింగ్ పరీక్షకు 1,95,275 మంది హాజరుకాగా.. అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ పరీక్షకు 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో అగ్రికల్చర్ & ఫార్మా విభాగంలో 91,935 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 1,57,879 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగం వివరాలు...

పరీక్షలకు దరఖాస్తు చేసిన తెలంగాణ విద్యార్థులు 1,53,890
పరీక్షలకు దరఖాస్తు చేసిన ఏపీ విద్యార్థులు 51,461
పరీక్షకు హాజరైన విద్యార్థులు 1,95,275
ఉత్తీర్ణత సాధించినవారు 1,57,879
ఉత్తీర్ణత శాతం 80%
బాలురు ఉత్తీర్ణత శాతం 79%
బాలికల ఉత్తీర్ణత శాతం 82%

అగ్రికల్చర్, ఫార్మా స్ట్రీమ్ వివరాలు..

పరీక్షలకు దరఖాస్తు చేసిన తెలంగాణ విద్యార్థులు  94,589
పరీక్షలకు దరఖాస్తు చేసిన ఏపీ విద్యార్థులు  20,743
పరీక్షకు హాజరైన విద్యార్థులు  1,01,544
ఉత్తీర్ణత సాధించినవారు  91,935 
ఉత్తీర్ణత శాతం  86%
బాలుర ఉత్తీర్ణత శాతం  84%
బాలికల ఉత్తీర్ణత శాతం  87%

మే 10, 11 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ స్ట్రీమ్‌ పరీక్ష; మే 12 నుంచి 14 వరకు ఆరు విడతల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్‌లను విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు తాజాగా ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్ పరీక్షకు 1,95,275 మంది హాజరుకాగా.. అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ పరీక్షకు 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 21 జోన్లలో ఎంసెట్ పరీక్ష నిర్వహించారు. వీటిలో తెలంగాణలో 16 జోన్లు, ఏపీలో 5 జోన్లు ఏర్పాటు చేశారు. మొత్తం 137 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. వీటిలో తెలంగాణలో 104 కేంద్రాలు, ఏపీలో 33 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.

Related Articles:

వెబ్‌సైట్‌లో టీఎస్ ఎంసెట్-2023 ర్యాంకు కార్డులు, వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి - డైరెక్ట్ లింక్ ఇదే!

➥ తెలంగాణ ఎంసెట్ అగ్రిక‌ల్చర్, మెడిసిన్ టాప్-10 ర్యాంక‌ర్లు వీరే!

 తెలంగాణ ఎంసెట్ ఫలితాలు - ఇంజినీరింగ్‌లో టాప్-10 ర్యాంక‌ర్లు వీరే!

➥ తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో 83 శాతం ఉత్తీర్ణత నమోదు!

➥ తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి!