తెలంగాణ ఎంసెట్ ఫలితాలు మే 25న విడుదలైన సంగతి తెలిసిందే. కూక‌ట్‌ప‌ల్లిలోని జేఎన్‌టీయూ క్యాంప‌స్‌లోని గోల్డెన్ జూబ్లీ సెమినార్ హాల్‌లో గురువారం (మే 25) ఉదయం 9.45 గంటలకు ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంసెట్ కన్వీనర్ డా.బి డీన్ కుమార్, ప్రభుత్వ ఉన్నత విద్యా కార్యదర్శి వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, జేఎన్‌టీయూ-హైదరాబాద్‌ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


వెబ్‌సైట్‌లో ర్యాంకు కార్డులు...
ఎంసెట్ ఫలితాలను వెల్లడించిన నేపథ్యంలో.. విద్యార్థులకు సంబంధించిన ఫలితాలతో పాటు, ఎంసెట్ ర్యాంకు కార్డులను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఎంసెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఎంసెట్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


ఎంసెట్ ర్యాంకు కార్డుల కోసం క్లిక్ చేయండి..


ఎంసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 


ఎంసెట్ ఫలితాల్లో మొత్తంగా 83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో ఇంజినీరింగ్‌లో 80 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగంలో 86 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌లో బాలురు 79 శాతం, బాలికలు 82 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక అగ్రికల్చర్‌ &  ఫార్మసీ విభాగంలో 84 శాతం బాలురు, 87 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్ పరీక్షకు 1,95,275 మంది హాజరుకాగా.. అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ పరీక్షకు 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో అగ్రికల్చర్ & ఫార్మా విభాగంలో 91,935 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 1,57,879 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 


సత్తాచాటిన ఏపీ విద్యార్థులు..
తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ రెండు విభాగాల్లోనూ ఏపీకి చెందిన విద్యార్థులే టాప్‌-5 ర్యాంకుల్లో సత్తా చాటడం గమనార్హం. ఇంజినీరింగ్‌ విభాగంలో విశాఖపట్నానికి చెందిన అనిరుధ్‌ అనే విద్యార్థికి మొదటి ర్యాంకు కైవసం చేసుకోగా.. మరో ముగ్గురు విద్యార్థులు టాప్-5లో నిలిచారు. ఇక అగ్రికల్చర్‌ & మెడిసిన్‌ కేటగిరీలోనూ టాప్‌-5 ర్యాంకుల్లో నలుగురు ఏపీకి చెందిన వాళ్లే ఉండటం గమనార్హం. ఈ విభాగంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బూరుగుపల్లి సత్య రాజ జశ్వంత్‌ ఇందులో టాపర్‌గా నిలిచాడు.


మే 10, 11 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ స్ట్రీమ్‌ పరీక్ష; మే 12 నుంచి 14 వరకు ఆరు విడతల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్‌లను విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు తాజాగా ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్ పరీక్షకు 1,95,275 మంది హాజరుకాగా.. అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ పరీక్షకు 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 21 జోన్లలో ఎంసెట్ పరీక్ష నిర్వహించారు. వీటిలో తెలంగాణలో 16 జోన్లు, ఏపీలో 5 జోన్లు ఏర్పాటు చేశారు. మొత్తం 137 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. వీటిలో తెలంగాణలో 104 కేంద్రాలు, ఏపీలో 33 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.


Related Articles:


➥ తెలంగాణ ఎంసెట్ అగ్రిక‌ల్చర్, మెడిసిన్ టాప్-10 ర్యాంక‌ర్లు వీరే!


 తెలంగాణ ఎంసెట్ ఫలితాలు - ఇంజినీరింగ్‌లో టాప్-10 ర్యాంక‌ర్లు వీరే!


➥ తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో 83 శాతం ఉత్తీర్ణత నమోదు!


➥ తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి!