తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన బోధన రుసుములు, ఉపకారవేతనాల మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమచేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ ఉపకారవేతనాల చెల్లింపునకు కేంద్ర ప్రభుత్వం నూతన విధివిధానాలు ప్రతిపాదించిన నేపథ్యంలో ఆ మేరకు తొలుత ఎస్సీ విద్యార్థులకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకం అమలుచేయాలని భావిస్తోంది. తరువాత మిగతా సంక్షేమ విద్యార్థులకు అమలు చేయనుంది. ఈ నిర్ణయంతో రెండేళ్లుగా కేంద్రం నుంచి రాకుండా నిలిచిపోయిన రూ.500 కోట్లకు పైగా నిధులు రానున్నాయి.


దేశవ్యాప్తంగా ఎస్సీ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ కింద 60 శాతం చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరంలోనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మిగతా 40 శాతం సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని సూచించింది. కేంద్రం 60 శాతం వాటా ఇస్తుండటంతో చెల్లింపు నిబంధనల్లో మార్పులు చేసింది. విద్యార్థుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నేరుగా నిధులు జమచేయాలని షరతు విధించింది. రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో ఆ షరతును అంగీకరించలేదు. 


కేంద్రం తన వాటా నిధులు రాష్ట్రానికి ఇస్తే.. మిగతా వాటా నిధులు సమకూర్చి రాష్ట్ర ప్రభుత్వమే విద్యార్థులకు చెల్లిస్తుందని స్పష్టంచేసింది. దీనికి కేంద్ర సామాజిక న్యాయశాఖ ఒప్పుకోలేదు.  విద్యార్థుల ఖాతాల్లో నేరుగా సొమ్ములు జమచేసేలా నిబంధనలు సవరించే వరకూ 60 శాతం వాటా ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. దీంతో 2021-22, 2022-23 విద్యాసంవత్సరాలకు కలిపి కేంద్ర వాటాగా ఎస్సీ విద్యార్థులకు రావాల్సిన రూ.500 కోట్లకుపైగా నిధులు నిలిచిపోయాయి. 2023-24 ఏడాదిని కూడా పరిగణనలోకి తీసుకుంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు దాదాపు రూ.800 కోట్లకు చేరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం సూచించిన నిబంధనలు అమలుచేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం ఇటీవల శాసనమండలిలో ప్రకటించింది.


కేంద్ర మార్గదర్శకాలు అమలైతే విద్యార్థులు కోర్సుల్లో చేరడానికి ముందే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి, ఫ్రీషిప్ కార్డులు మంజూరుచేస్తారు. ఈ కార్డులతో విద్యార్థులు ఎలాంటి చెల్లింపులు లేకుండానే ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తనవంతు వాటా 40 శాతం నిధులు మంజూరుచేసిన తరువాత కేంద్ర వాటా 60 శాతం నిధులు కలిసి ఒకేసారి విద్యార్థుల ఖాతాల్లో జమచేస్తారు. ఆ సమాచారాన్ని సంబంధిత విద్యా సంస్థలకు పంపుతారు. దరఖాస్తు గడువు ముగిసిన 15 నుంచి నెలరోజుల్లోపే ఈ ప్రక్రియ పూర్తవుతుందని, ఈ విధానం అమల్లోకి వస్తే విద్యార్థులకు సౌలభ్యంగా ఉంటుందనేది అధికారుల అభిప్రాయం. 


ALSO READ:


బీసీ గురుకులాల్లో బీఎస్సీ అగ్రికల్చర్‌ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని మహాత్మా జోతిబా ఫులే బీసీ గురుకులాల్లో బీఎస్సీ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు జులై 31తోనే ముగియగా.. ఆగస్టు 16 వరకు పొడిగించారు. తెలంగాణకు చెందిన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వనపర్తి, కరీంనగర్‌‌లోని అగ్రికల్చరల్‌ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఎంసెట్‌, అగ్రిసెట్‌ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 16న సాయంత్రం 5 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


కాళోజీ వర్సిటీలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కోర్సు, డిగ్రీ అర్హత చాలు
తెలంగాణలో మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఎంపీహెచ్‌) కోర్సులో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 13 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్‌ ఆధారిత ప్రవేశపరీక్షను ఆగస్టు 27న నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 2న ఫలితాలు వెల్లడించనున్నారు. 
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..