కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ) రెండో విడత దరఖాస్తు గడువు ఆగ‌స్టు 26తో ముగియనుంది. రెండో విడతకు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం 4,930 పాఠశాలలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఎంపికైన పాఠశాలలను జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేస్తారు.


ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ పాఠశాలల) పథకంలో భాగంగా తొలి విడతలో దేశవ్యాప్తంగా మొత్తం 6,448 పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 1205 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ఏపీ నుంచి 623 పాఠశాలలు ఎంపిక కాగా, తెలంగాణ నుంచి 543 పాఠశాలలు ఉన్నాయి. ఏపీ నుంచి ఎంపికైన వాటిలో 33 ఎలిమెంటరీ పాఠశాలలు ఉండగా, 629 సెకండరీ/సీనియర్ సెకండరీ పాఠశాలలు ఉన్నాయి. ఇక తెలంగాణ నుంచి ఎంపికైన వాటిలో 56 ఎలిమెంటరీ పాఠశాలలు కాగా, 487 సెకండరీ/సీనియర్ సెకండరీ పాఠశాలలు ఉన్నాయి. సమానత, అందుబాటు, నాణ్యత, ఇన్‌క్లూజన్‌తో సహా అన్నిస్థాయిల్లో విద్యార్థులు సంపూర్ణమైన అభివృద్ధి సాధించేందుకు ఈ స్కూళ్లు తోడ్పాటునందించనున్నాయి.


14,500 స్కూళ్లను అభివృద్ధే లక్ష్యం..
ఈ పథకాన్ని కేంద్రప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్‌ 7న ఆమోదించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 14,500 స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు కొన్ని మార్గదర్శకాలను నిర్దేశిస్తూ వాటి ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని అన్ని రాష్ట్రాల పాఠశాలలకు అవకాశమిచ్చింది. కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆన్‌లైన్‌ చాలెంజ్‌ పోర్టల్‌ ద్వారా స్కూళ్లు స్వయంగా వీటికి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ దరఖాస్తులను మూడుదశల్లో పరిశీలించి తుది ఎంపికను ఖరారు చేశారు.


విద్యార్థులకు గుణాత్మక విద్య..
వీటిద్వారా నూతన విద్యావిధానంలో నిర్దేశించుకున్న ప్రమాణాలకు అనుగుణంగా పాఠశాల విద్యను బలోపేతం చేయనున్నారు. విద్యార్థులు గుణాత్మక విద్యతో నిర్దేశిత సామర్థ్యాలను పెంపొందించుకోగలుగుతారు. చదువులను భారంగా కాకుండా ఇష్టంగా కొనసాగిస్తారు. కేంద్రం నిధులు అందించే ఈ పాఠశాలలన్నీ నూతన విద్యావిధానాన్ని అనుసరించి కొనసాగుతాయి. మొత్తం నిధుల్లో  కేంద్ర ప్రభుత్వం 60 శాతం ఇస్తే మిగతా నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. ఎంపికైన స్కూళ్ల జాబితాను కేంద్రం ఏర్పాటుచేసిన పోర్టల్‌లో ఉంచడంతోపాటు ఆయా రాష్ట్రాల విద్యాశాఖ కార్యాలయాలకు పంపింది.


దేశవ్యాప్తంగా పీఎంశ్రీ (స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా) పథకం కింద 9 వేల పాఠశాలలను ఎంపిక చేసినట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి, అధునాతన స్కూల్స్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలవిద్యను తీర్చి దిద్దడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 2.5 లక్షల పాఠశాలల నుంచి దరఖాస్తులు రాగా.. వీటిలో నుంచి 9 వేలను ఎంపిక చేసింది. ఆహ్లాదకర వాతావరణం, ఆధునికపద్ధతుల్లో బోధన ఉంటే పాఠశాలల్లో మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చనేది కేంద్రం యోచన. 


కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత..
ఈ పథకానికి ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రత్యేక కరిక్యులమ్‌తో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. వీటికి అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ప్రయోగశాలలు, క్రీడా సామగ్రి, సిలబస్‌కు అనుగుణంగా డిజిటల్ తరగతి గదులు, ఆర్ట్ స్టూడియోలను ఏర్పాటు చేస్తుంది. పోటీ ప్రపంచానికి తగినట్లు విద్యార్థులను తీర్చిదిద్దుతారు. ఏపీ నుంచి 662 పాఠశాలలు ఎంపికయ్యాయి. త్వరలోనే పథాకానికి ఎంపికైన పాఠశాలల జాబితాలను కేంద్రం వెల్లడించనుంది. గ్రామస్థాయి విద్యార్థులకు కూడా జాతీయ స్థాయి విద్యాప్రమాణాలను అందుబాటులోకి తేవచ్చని, విద్యార్థుల ప్రతిభకు మరింత పదును పెట్టి, ఉపాధి మార్గాలకు పాఠశాల దశలోనే పునాదులు వేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ పథకం కింద ఎంపికైన పాఠశాలలకు మూడేళ్లలో రూ.46 లక్షలు అందిస్తారు.


పీఎంశ్రీ కింద ఎంపికైన బడుల్లో సొంత భవనాలు, మరుగుదొడ్లు, గ్రంథాలయాలు, సౌరవిద్యుత్‌ ఏర్పాటు, కాయగూరల తోట ఏర్పాటు, ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దడం, శుద్ధజలం, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ(ఐసీటీ) ల్యాబ్, డిజిటల్‌ గ్రంథాలయం, క్రీడలకు ప్రోత్సాహం, నాణ్యమైన విద్యతోపాటు ఇంట‌ర్‌నెట్ సదుపాయం, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ, వృత్తివిద్యా కోర్సులు, నైపుణ్యాభివృద్ధి వంటివాటికి నిధులను వాడుకోవచ్చని కేంద్రం పేర్కొంది. స్కూల్‌ దశ నుంచే ఒకేషనల్‌ కోర్సులను ప్రోత్సహిస్తారు. విద్యార్థి డిగ్రీకి వచ్చేసరికి ఏదో ఒక రంగంలో ఉపాధి పొందేలా తీర్చిదిద్దాలన్న జాతీయ విద్యావిధానం–2020కి అనుగుణంగా ఈ పథకాన్ని తెచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. 


ప్రతీ పాఠశాల సమాచారాన్ని డ్రిస్టిక్ట్‌ ఇన్‌ఫర్మేషన్ సిస్టం ఫర్‌ ఎడ్యుకేషన్‌(యూడైస్‌ ప్లస్‌)లో నమోదు చేస్తున్నారు. దీని ఆధారంగానే పీఎంశ్రీ పథకానికి ఎంపిక చేస్తారు. యూడైస్‌లో ఆయా పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, బోధన విధానాలు, కొన్నేళ్లుగా టెన్త్‌లో వస్తున్న గ్రేడ్లు, ఇతర క్లాసుల్లో వస్తున్న విద్యార్థుల మార్కుల వివరాలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ, సహకారం, అందుతున్న నిధులతోపాటు ఆ స్కూల్‌కు కావాల్సిన అదనపు గదులు, చేయాల్సిన మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయాల సమాచారాన్ని పొందుపరుస్తారు. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..