Jawahar Navodaya Vidyalayas Class VI Admissions: దేశవ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2025 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. వచ్చే ఏడాది జనవరి 18న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్‌ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది.


ఎనిమిదో తరగతి వరకు మాతృ భాష లేదా ప్రాంతీయ భాషలో విద్య అభ్యసించవచ్చు. 9వ తగరతి నుంచి ఇంగ్లిష్ మీడియం ఉంటుంది. సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధిస్తారు. ఇక్కడ రెగ్యులర్‌ చదువతోపాటు నీట్‌, జేఈఈ వంటి జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలకు కూడా శిక్షణ ఇస్తున్నారు. ప్రవేశ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 17న ప్రారంభంకాగా.. సెప్టెంబరు 16 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దేశంలో మొత్తం 653 జవహర్‌ నవోదయ విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో ఏపీలో 15, తెలంగాణలో 9 ఉన్నాయి. వీటన్నింటిలో దాదాపు 50 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో నవోదయ విద్యాలయంలో గరిష్ఠంగా 80 మంది విద్యార్థులకు ఆరోతరగతిలో ప్రవేశం కల్పిస్తారు. జేఎన్‌వీ ప్రవేశ పరీక్షను హిందీ, ఇంగ్లిష్‌‌తోపాటు ఆయా రాష్ట్రాల ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. 


వివరాలు..


* జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష - 2025


సీట్ల సంఖ్య: 50 వేలకుపైగా


అర్హతలు..


➥ 2024-2025 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్నవారు జవహర్‌ నవోదయ విద్యాలయ సెలక్షన్‌ టెస్టు (JNVST) రాయడానికి అర్హులు. అభ్యర్థులు ప్రవేశం కోరే జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదువుతున్నవారై ఉండాలి. విద్యార్థులు ఒకసారి మాత్రమే పరీక్ష రాయడానికి అర్హులు. విద్యార్థులు తప్పనిసరిగా సంబంధిత నవోదయ విద్యాలయం ఉన్న జిల్లాలో నివసిస్తూ ఉండాలి.


➥ ప్రవేశాల్లో 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంతంలో చదివిన విద్యార్థులతో భర్తీ చేస్తారు. గ్రామీణ ప్రాంత కోటాలో సీటు ఆశించే విద్యార్థులు 3,4,5 తరగతులను పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో లేదా గుర్తింపు పొందిన ఇతర స్కూళ్లలో చదవి ఉండాలి. మిగిలిన 25 శాతం ఇతర ప్రాంతాలవారికి అవకాశం కల్పిస్తారు. మొత్తం సీట్లలో మూడో వంతు బాలికలకు కేటాయించారు. ఎస్సీలకు 15, ఎస్టీలకు 7.5, ఓబీసీలకు 27 శాతం సీట్లు ఉంటాయి. దివ్యాంగులకు కొన్ని సీట్లు కేటాయిస్తారు.


వయోపరిమితి: ప్రవేశాలు కోరే విద్యార్థుల వయసు 01.05.2013 - 31.07.2014 మధ్య జన్మించి ఉండాలి.,


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ఆధారంగా.


పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మూడు సెక్షన్ల నుంచి 80 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌తో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాయొచ్చు పరీక్ష సమయం 2 గంటలు. నెగిటివ్‌ మార్కులు లేవు.
➥ సెక్షన్‌-1లో మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్ (MAT) నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 50 మార్కులు ఉంటాయి. దీనికి ఒక గంట (60 నిమిషాలు) సమయం కేటాయించారు. ఈ సెక్షన్‌లో మొత్తం 10 విభాగాలుంటాయి. ఒక్కో దాంట్లో నాలుగేసి చొప్పున ప్రశ్నలు అడుగుతారు. 
➥ సెక్షన్‌-2లో అరిథ్‌మెటిక్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం మార్కులు 25 ఉంటాయి. విద్యార్థులు 30 నిమిషాల్లో ఈ సెక్షన్ పూర్తిచేయాల్సి ఉంటుంది. 
➥ సెక్షన్‌-3 అనేది లాంగ్వేజ్‌ టెస్ట్‌. ఇందులో 20 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు 25 ఉంటాయి. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. లాంగ్వేజ్‌ టెస్టులో పాసేజ్‌ ఇచ్చి, ప్రశ్నలకు సమాధానాలు రాయమంటారు. విద్యార్థులు పాసేజ్‌ అర్థం చేసుకున్నారో లేదో తెలుసుకునేలా ఈ ప్రశ్నలు వస్తాయి. ప్రతి పాసేజ్‌ కింద అయిదేసి ప్రశ్నల చొప్పున నాలుగు పాసేజ్‌లు ఉంటాయి.


ప్రవేశ సమయంలో కావాల్సిన డాక్యుమెంట్లు..
➥ పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం బర్త్ సర్టిఫికేట్
➥ గ్రామీణ కోటాలో ప్రవేశాలు కోరువారు ఆ గ్రామంలో 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు సంబంధిత హెడ్‌మాస్టర్లు జారీచేసిన స్టడీ సర్టిఫికేట్లు
➥ రెసిడెన్స్ సర్టిఫికేట్
➥ ఆధార్ కార్డు కాపీ
➥ మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్
➥ మైగ్రేషన్ సర్టిఫికేట్
➥ డిజెబిలిటీ సర్టిఫికేట్ (అవసరమైనవారికి)
➥ కేటగిరీ/కమ్యూనిటీ సర్టిఫికేట్ (SC/ST/OBC)


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.07.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.09.2024.


➥ ప్రవేశ పరీక్షతేది: 18.01.2025 (ఏపీ, తెలంగాణ) (11.30 AM). కొన్ని రాష్ట్రాల్లో 12.04.2025.  


Notification


Online registration


Website