దేశంలో అత్యున్నత విద్యా సంస్థలైన ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)‌, ఐఐటీల్లో ఎమ్మెస్సీ కోర్సులు చేయ‌డానికి ప్రవేశాలు క‌ల్పించే జాయింట్ అడ్మిషన్‌ టెస్ట్ ఫ‌ర్ మాస్టర్స్‌ (జామ్‌)-2023 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. జామ్‌ను ఈ ఏడాది ఐఐటీ గువహటి నిర్వహించ‌నుంది. ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్రక్రియ సెప్టెంబరు 7న ప్రారంభ‌ం కానుంది. ఆక్టోబ‌ర్ 11 వ‌ర‌కు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. వ‌చ్చే ఏడాది ఫిబ్రవ‌రి 12న జామ్-2023 ప‌రీక్ష నిర్వహించనున్నారు.


జాతీయ స్థాయి ప్రవేశ‌ప‌రీక్ష అయిన జామ్ ద్వారా ఐఐటీల్లో ఎమ్మెస్సీ (రెండేళ్లు), జాయింట్‌ ఎమ్మెస్సీ- పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ పీహెచ్‌డీ డ్యూయ‌ల్ డిగ్రీ, ఇత‌ర పోస్ట్ బ్యాచిల‌ర్ డిగ్రీ ప్రోగ్రాముల్లో, ఐఐఎస్సీలో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలు క‌ల్పిస్తారు. దేశంలోని ఎనిమిది జోన్లలో జామ్‌ను నిర్వహిస్తారు. 


మొత్తం ఏడు పేపర్లు..:


మ్యాథ్స్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, బ‌యోటెక్నాల‌జీ, జియాల‌జీ, మ్యాథ‌మెటిక‌ల్ స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్‌ మొత్తం ఏడు పేపర్లలో జామ్‌ పరీక్షను నిర్వహిస్తారు. అభ్యర్థులు గరిష్టంగా రెండు పేపర్లలో పరీక్షకు హాజరుకావ్వొచ్చు. ఈ విషయాన్ని అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే పేర్కొనాల్సి ఉంటుంది. 


ఐఐటీ జామ్‌ స్కోర్‌ ఆధారంగా 21 ఐఐటీల్లో ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ(టెక్‌), జాయింట్‌ ఎమ్మెస్సీ పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ పీహెచ్‌డీ (డ్యూయల్‌ డిగ్రీ), ఎమ్మెస్సీ ఎంటెక్‌ (డ్యూయల్‌ డిగ్రీ),ఎంఎస్‌(రీసెర్చ్‌) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం మూడు వందల సీట్లు ఐఐటీల్లో అందుబాటులో ఉన్నాయి. 

ఐఐటీలతోపాటు ఎన్‌ఐటీ, ఐఐఎస్సీ బెంగళూరు, డీఐఏటీ, ఐఐఈఎస్‌టీ, ఐఐపీఈ, ఐఐఎస్‌ఈఆర్‌, జేఎన్‌సీఏఎస్‌ఆర్, ఎస్‌ఎల్‌ఐఈటీ, 30 సీఎఫ్‌టీఐలు లాంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్‌లో కూడా ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీపీహెచ్‌డీ తదితర మాస్టర్స్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. వీటిల్లో మొత్తం 2,300 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Also Read: మేనేజ్‌మెంట్ కోర్సులకు సరైన మార్గం ‘మ్యాట్’


మూడు విభాగాల్లో జామ్‌ పరీక్ష..


మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మూడు విభాగాల నుంచి 60 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 3 గంటలు.


సెక్షన్‌-ఎ: ఈ విభాగంలో  30 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 10 ఒక మార్కు ప్రశ్నలు, 20 రెండు మార్కుల ప్రశ్నలు అడుగుతారు. 


సెక్షన్‌-బి: ఈ విభాగంలో 10 మల్టిపుల్‌ సెలక్ట్‌ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. వీటిలో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉంటాయి. 


సెక్షన్‌-సి: ఈ విభాగంలో 20 న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌ ప్రశ్నలు అడుగుతారు. వీటిలో 1 మార్కు ప్రశ్నలు 10, అలాగే 2 మార్కుల ప్రశ్నలు 10 ఉన్నాయి.


Note: సెక్షన్-ఎ కు మాత్రమే నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన అమలవుతోంది. 1 మార్కు ప్రశ్నల్లో ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు, 2 మార్కుల ప్రశ్నల్లో ప్రతి తప్పు సమాధానానికి 2/3 వంతు మార్కులు  కోత విధిస్తారు. 


ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ ప్రక్రియ
ఐఐటీలు అడ్మిషన్‌ ప్రక్రియను జామ్‌ స్కోర్‌ ఆధారంగా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తాయి. అభ్యర్థులు ఐఐటీల్లో సీట్ల కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం.. జామ్‌ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ సిస్టమ్‌ (జేఓఏపీఎస్‌) అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు ఈ పోర్టల్‌లో తమ లాగిన్‌ ఐడీ క్రియేట్‌ చేసుకున్న తర్వాత ఆన్‌లైన్‌ దరఖాస్తును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు సమయంలోనే తమకు ఆసక్తి ఉన్న కోర్సులు, ఇన్‌స్టిట్యూట్‌ల ప్రియారిటీస్‌ను పేర్కొనాలి. ఆ తర్వాత అభ్యర్థులు సాధించిన స్కోర్, వారు పేర్కొన్న ప్రియారిటీస్‌ను పరిగణనలోకి తీసుకొని ఆన్‌లైన్‌లోనే సీట్‌ అలాట్‌మెంట్‌ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం నాలుగు రౌండ్లలో జరుగుతుంది. 


ఐఐటీజామ్‌లో విజయం సాధించాలంటే.. అభ్యర్థులు తమ అకడమిక్‌ సబ్జెక్ట్‌లకు సంబంధించి బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలోని పుస్తకాలను లోతుగా అధ్యయనం చేయాలి. ఆ క్రమంలో సబ్జెక్ట్‌/పేపర్‌ వారీగా ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాలు..


కెమిస్ట్రీ
ఫిజికల్‌ కెమిస్ట్రీ: బేసిక్‌ మ్యాథమెటికల్‌ కాన్సెప్టులు, అటామిక్‌ అండ్‌ మాలిక్యులర్‌ స్ట్రక్చర్, థియరీ ఆఫ్‌ గ్యాసెస్, సాలిడ్‌ స్టేట్, కెమికల్‌ థర్మోడైనమిక్స్, కెమికల్‌ అండ్‌ ఫేజ్‌ ఈక్విలిబ్రియా, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్‌ కైనటిక్స్, అబ్సార్పషన్, స్పెక్ట్రోమెట్రి; ఆర్గానిక్‌ కెమిస్ట్రీ అండ్‌ స్పెక్ట్రోమెట్రి బేసిక్‌ కాన్సెప్టులు, ఆర్గానిక్‌ రియాక్షన్‌ మెకానిజం, సింథటిక్‌ అప్లికేషన్స్, క్వాలిటేటివ్‌ ఆర్గానిక్‌ అనాలసిస్, ఆరోమాటిక్‌ అండ్‌ హెటిరోసైక్లిక్‌ కెమిస్ట్రీ. ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో పిరియాడిక్‌ టేబుల్, కెమికల్‌ బాండింగ్, షేప్స్‌ ఆఫ్‌ కాంపౌండ్స్, మెయిన్‌ గ్రూప్‌ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్‌ మెటల్స్, బయో ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ, అనలిటికల్‌ కెమిస్ట్రీ.


బయోటెక్నాలజీ
బయాలజీ విభాగానికి సంబంధించి పదో తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు అకడమిక్స్‌ను అధ్యయనం చేయాలి. జనరల్‌ బయాలజీ, బయోకెమిస్ట్రీ అండ్‌ ఫిజియాలజీ, బేసిక్‌ బయోటెక్నాలజీ, మాలిక్యులర్‌ బయాలజీ, సెల్‌ బయాలజీ, మైక్రోబయాలజీ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. కెమిస్ట్రీకి సంబంధించి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ పాఠ్యాంశాలను చదవాలి. మ్యాథ్స్, ఫిజిక్స్‌లను ఇంటర్‌ స్థాయిలో చదివితే సరిపోతుంది.


ఎకనామిక్స్‌
మైక్రో ఎకనామిక్స్, మాక్రో ఎకనామిక్స్,స్టాటిస్టిక్స్‌ ఫర్‌ ఎకనామిక్స్,ఇండియన్‌ ఎకానమీ,మ్యాథమెటిక్స్‌ ఫర్‌ ఎకనామిక్స్‌లను అధ్యయనం చేయాలి.


జియాలజీ
ప్లానెట్‌ ఎర్త్, జియో మార్ఫాలజీ, స్ట్రక్చరల్‌ జియాలజీ, పాలియోంటాలజీ, స్టాటిగ్రఫీ, మినరాలజీ, పెట్రోలజీ, ఎకనామిక్‌ జియాలజీ, అప్లయిడ్‌ జియాలజీలపై దృష్టి పెట్టాలి.


మ్యాథమెటిక్స్‌
సీక్వెన్సెస్‌ అండ్‌ సిరీస్‌ ఆఫ్‌ రియల్‌ నంబర్స్, ఫంక్షన్స్‌ ఆఫ్‌ వన్‌/టూ/త్రీ రియల్‌ వేరియబుల్, ఇంటెగ్రల్‌ క్యాల్కులస్, డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్, వెక్టార్‌ క్యాల్కులస్, గ్రూప్‌ థియరీ, లీనియర్‌ ఆల్‌జీబ్రా, రియల్‌ అనాలసిస్‌ పాఠ్యాంశాలను ప్రిపేరవ్వాలి.


మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్
మ్యాథ్స్‌కు 40 శాతం, స్టాటిస్టిక్స్‌కు 60 శాతం వెయిటేజీ ఉండే ఈ పేపర్‌లో.. మ్యాథ్స్‌కు సంబంధించి సీక్వెన్సెస్‌ అండ్‌ సిరీస్, డిఫరెన్షియల్‌ క్యాల్కులస్, ఇంటెగ్రల్‌ క్యాల్కులస్, మాట్రిసెస్‌ చాప్టర్లను అధ్యయనం చేయాలి. స్టాటిస్టిక్స్‌లో ప్రాబబిలిటీ, ర్యాండమ్‌ వేరియబుల్స్, స్టాండర్డ్‌ డిస్ట్రిబ్యూషన్, జాయింట్‌ డిస్ట్రిబ్యూషన్, సాంప్లింగ్‌ డిస్ట్రిబ్యూషన్, లిమిట్‌ థీరమ్స్, ఎస్టిమేషన్, టెస్టింగ్‌ ఆఫ్‌ హైపో థీసిస్‌లను అధ్యయనం చేయాలి.


ఫిజిక్స్‌
మ్యాథమెటికల్‌ మెథడ్స్, మెకానిక్స్‌ అండ్‌ జనరల్‌ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ మేటర్, ఆసిలేషన్స్, వేవ్స్‌ అండ్‌ ఆప్టిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్‌ మ్యాగ్నటిజం, కైనటిక్‌ థియరీ, థర్మోడైనమిక్స్, మోడ్రన్‌ ఫిజిక్స్, సాలిడ్‌ స్టేట్‌ ఫిజిక్స్, డివైజెస్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ పాఠ్యాంశాలను అభ్యసనం చేయాలి.

Also Read: ఆగస్టు 3 నుంచి క్యాట్-2022 దరఖాస్తులు - అర్హతలు, ముఖ్యతేదీలివే!


అభ్యర్థులు జామ్‌లో ఆయా సబ్జెక్ట్‌లలో పట్టు సాధించాలి అంటే బ్యాచిలర్‌ స్థాయి పాఠ్యపుస్తకాలను చదవాల్సి ఉంటుంది. ఇంకా జామ్‌ పాత ప్రశ్న పత్రాలు, గేట్‌ సైన్స్‌ సబ్జెక్ట్‌లకు సంబంధించి ప్రీవియస్‌ పేపర్లు ప్రాక్టీస్‌ చేయాలి. కాన్సెప్ట్స్, అప్లికేషన్‌ అప్రోచ్‌లపై పట్టు సాధించాల్సి ఉంటుంది. అప్పుడే ఎగ్జామ్ హాలులో అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం వ్రాయడానికి సన్నద్ధులు అవుతారు.


ముఖ్య సమాచారం:


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.1800, రెండు పేపర్లకు రూ.2500, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్యర్థుల‌కు రూ.900, రెండు పేర్లు అయితే రూ.1250.


ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: సెప్టెంబ‌ర్ 07, 2022.


ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: అక్టోబ‌ర్ 11, 2022.


ప్రవేశ‌ప‌రీక్ష: ఫిబ్రవ‌రి 12, 2023.


ఫలితాలు విడుదల తేది: మార్చి 22, 2023.


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి.


website


  మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..