దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) లలో ప్రవేశాలకు వీలు కల్పించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) 2021 నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు, ఫెల్లో ప్రోగ్రాముల కోసం (ఎఫ్‌పీఎం) ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరించనున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఆగస్టు 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. గడువు సెప్టెంబర్ 15తో ముగియనుంది.


అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ ప్రక్రియ అక్టోబర్ 27వ తేదీ నుంచి నవంబర్ 28 వరకు ఉంటుంది. నవంబర్ 28వ తేదీన క్యాట్ పరీక్షను మూడు సెషన్లలో నిర్వహించనున్నారు. 2022 జనవరి రెండో వారంలో పరీక్ష ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. 


విద్యార్హత వివరాలు..
కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు కనీసం 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. డిగ్రీ ఫైనలియర్ పరీక్షలకు హాజరవుతోన్న విద్యార్థులు కూడా దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులేనని పేర్కొంది. 
దరఖాస్తు ఫీజు.. 
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.1100, మిగతా వారు రూ.2200 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా క్యాట్ పరీక్ష కోసం 158 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)లో అర్హత, రిటన్ ఎబులిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాల కోసం www.iimcat.ac.in వెబ్‌సైట్‌ను లేదా 18002101088 హెల్ప్ లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు. 
క్యాంపస్‌లు ఇవే.. 
క్యాట్ 2021 పరీక్ష ద్వారా విశాఖపట్నం, అహ్మాదాబాద్, బెంగళూరు, కలకతా, జమ్మూ, బోద్ గయ, ఉదయపూర్, తిరుచిరాపల్లి, కోజికాడ్, అమృత్‌సర్, రాయ్‌పూర్, నాగ్‌పూర్, కాశీపూర్, లక్‌నవూ, రాంచీ, రోహ్‌తక్, షిల్లాంగ్, ఇండోర్, సంబాల్‌పూర్, సిర్‌మౌర్ ఐఐఎం క్యాంపస్‌లలో ప్రవేశాలు పొందవచ్చు. 


Also read: వ్యవసాయ వర్సిటీల్లో ప్రవేశాలు.. అగ్రిసెట్ నోటిఫికేషన్ విడుదల..


బాసర ఆర్జీయూకేటీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌..
తెలంగాణలోని నిర్మల్‌ జిల్లాలో ఉన్న బాసర రాజీవ్‌ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయంలో (ఆర్జీయూకేటీ) ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలకు దరఖాస్తులను వర్సిటీ స్వీకరిస్తోంది. ఈ ఏడాది టీఎస్ పాలిసెట్‌ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనుంది. దీని ద్వారా ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తుంది. దీనికి సంబంధించిన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తుల స్వీకరణ గడువు ఆగస్టు 12తో ముగియనుంది. మరిన్ని వివరాల కోసం https://www.admissions.rgukt.ac.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.


మరింత చదవండి: బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌