ఏపీలోని ట్రిపుల్ ఐటీల్లో భారీగా సీట్లు మిగిలిపోయాయి. వర్సిటీ చరిత్రలో ఏనాడు సీట్లు మిగల్లేదు. అయితే ఈసారి మాత్రం ఏకంగా 119 సీట్లు మిగిలిపోయాయి. మూడు విడతల కౌన్సెలింగ్ తర్వాత కూడా ఇన్నేసి సీట్లు మిగిలిపోడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సాధారణంగా అయితే జులైలో ఒకటి, రెండు కౌన్సెలింగుల్లోనే సీట్లన్నీ నిండిపోయే రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ట్రిపుల్ ఐటీల్లో... ఈ ఏడాది నవంబరు వచ్చినా, 3 కౌన్సెలింగులు నిర్వహించినా ఇంకా 119 సీట్లు మిగిలిపోయాయి. ఆర్జీయూకేటీ చరిత్రలో ఈ పరిస్థితి రావడం ఇదే తొలిసారి. 


ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలులో ట్రిపుల్ ఐటీ కళాశాలలున్నాయి. ఈ నాలుగింటికీ నాలుగోసారి కౌన్సెలింగ్ నిర్వహించినా సీట్లు భర్తీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఏడాది ప్రవేశాలకు పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలనూ పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడంతో.. ఫలితాల వెల్లడి ఆలస్యమైంది. దీనికితోడు సంబంధిత అధికారుల కమిటీ 1:1 నిష్పత్తిలో విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలవాలని నిర్ణయించింది. ఫలితంగా తీవ్ర జాప్యం జరిగింది. ఆలస్యాన్ని గ్రహించిన విద్యార్థులు ప్రైవేటు కళాశాలల్లో చేరిపోయారు. దీంతో మూడో విడత కౌన్సెలింగ్ చేపట్టినా సీట్లు భర్తీ కాలేదు.


స్పెషల్ 'ఫేజ్' నిర్వహించినా ఇంతేనా?
ప్రస్తుతం మరో విడత కౌన్సెలింగ్ నిర్వహించినా.. సీట్లు భర్తీ అయ్యే అవకావం కనిపించడంలేదు. ఇప్పటికే ఫీజులు కట్టి ప్రైవేటు కళాశాలల్లో చేరిన విద్యార్థులు తిరిగి వస్తారనే నమ్మకమూ లేదు. గతంలో పదోతరగతి ఫలితాలు వెలువడగానే మార్కుల జాబితా ఆర్జీయూకేటీకి చేరేది. అనంతరం విద్యార్థుల మెరిట్ ఆధారంగా 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను కౌన్సెలింగ్‌కు పిలిచేవారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే చాలా వరకు సీట్లు భర్తీ అయ్యేవి. కొన్ని సీట్లు మిగిలినా రెండో విడతలో సీట్లన్నీ భర్తీ అయ్యేవి. కాని ఈసారి పదోతరగతి ఫలితాల వెల్లడిలో ఆలస్యం నేపథ్యంలో సీట్లు మిగిలిపోయే పరిస్థితి నెలకొంది.


Also Read:


ప్రతి స్కూల్‌లో ఆటలు తప్పనిసరి, కనీసం రెండు క్రీడల్లో శిక్షణ! 
ఏపీలోని అన్ని పాఠశాలల్లో ఇకపై క్రీడలు తప్పనిసరి కానున్నాయి. విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్య రక్షణకు, వారిని క్రీడల్లో ప్రావీణ్యులను చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు కనీసం రెండు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా వారిని తీర్చిదిద్దాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఈ మేరకు అధికారులను ఆదేశించారు. సమగ్ర శిక్ష కార్యాలయంలో జరిగిన అండర్-14, 17, 19 పాఠశాల క్రీడల కార్యదర్శుల కార్యనిర్వాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఏపీలో త్వరలో 176 స్కిల్ హబ్‌లు అందుబాటులోకి! 10 వేల మంది యువతకు లబ్ధి!
ఏపీలోని విద్యార్థులకు ప్రభుత్వ గుడ్ న్యూస్ తెలిపింది. ఉన్నత చదువులు అభ్యసించి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువకులకు మరిన్ని నైపుణ్యాలు అభివృద్ధి చేసుకునేందుకు వీలుగా స్కిల్ హబ్‌లను ఏర్పాటుచేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని స్కిల్ హబ్‌లు ప్రారంభం కాగా.. మిగిలిన వాటిని కూడా ఈ సంక్రాంతి కల్లా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు విజయవాడలోని రాష్ట్ర ఆర్థిక సంస్థ కార్యాలయంలో స్కిల్ హబ్‌లు, కాలేజీల పురోగతిపై ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, నైపుణ్య, శిక్షణ శాఖ మంత్రి రాజేంద్రనాథ్‌ రెడ్డి నవంబరు 17న సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి కల్లా 176 స్కిల్ హబ్‌ల ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..