ఏపీలోని విద్యార్థులకు ప్రభుత్వ గుడ్ న్యూస్ తెలిపింది. ఉన్నత చదువులు అభ్యసించి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువకులకు మరిన్ని నైపుణ్యాలు అభివృద్ధి చేసుకునేందుకు వీలుగా స్కిల్ హబ్‌లను ఏర్పాటుచేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని స్కిల్ హబ్‌లు ప్రారంభం కాగా.. మిగిలిన వాటిని కూడా ఈ సంక్రాంతి కల్లా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.


ఈ మేరకు విజయవాడలోని రాష్ట్ర ఆర్థిక సంస్థ కార్యాలయంలో స్కిల్ హబ్‌లు, కాలేజీల పురోగతిపై ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, నైపుణ్య, శిక్షణ శాఖ మంత్రి రాజేంద్రనాథ్‌ రెడ్డి నవంబరు 17న సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి కల్లా 176 స్కిల్ హబ్‌ల ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 
రాష్ట్రంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన 66 స్కిల్ హబ్‌ల ద్వారా ప్రస్తుతం 2,400 మందికి శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి హబ్‌లో 2 కోర్సుల చొప్పున మొత్తం 222 కోర్సుల్లో 10 వేల మందికి పైగా యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు. నైపుణ్య కళాశాలలు ఎలా ఉండాలి, తరగతి గదులు, ల్యాబ్ శిక్షణ ఇవ్వాల్సిన అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు. మిగతా 111 స్కిల్ హబ్‌ల ఏర్పాటు దిశగా మంత్రి దిశానిర్దేశం చేశారు.


కాగా 176 స్కిల్ హబ్ లు అందుబాటులోకి తీసుకువచ్చి 10 వేల మందికిపైగా యువతకు నైపుణ్య, శిక్షణ అందించేలా అడుగులు వేయాలని మంత్రి కోరారు. శిక్షణ కేంద్రాలలో యువతకు ఆహారం, పరిశుభ్ర, ప్రశాంత వాతావరణం వంటి మౌలిక సదుపాయాలు తీర్చిదిద్దడంలో రాజీపడొద్దని ఆదేశించారు. స్కిల్ కాలేజీలు ఎలా ఉండాలి, క్లాస్ రూమ్ లు, ల్యాబ్, ట్రైనర్ వంటి అంశాలపై ఇవాళ ఆయన సమీక్షించారు. సాంకేతిక విద్య, ఉపాధి, శిక్షణ డైరెక్టర్ లతో ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలపైనా ఆరా తీశారు.


రాష్ట్రంలోని విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతోపాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) పనిచేస్తోంది. పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ వరకు అనేక నైపుణ్య శిక్షణా కార్యక్రమాలతోపాటు, మార్కెట్ లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది. శిక్షణ పొందిన వారు ఉద్యోగాలు పొందడంలో అవసరమైన సహకారం అందిస్తోంది.


కోవిడ్ మమమ్మారి సృష్టించిన అలజడి కారణంగా జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. ఎపిఎస్‌ఎస్‌డిసి అమలు చేస్తున్న శిక్షణా కార్యక్రమాలు కూడా ఆగిపోయాయి. అయితే విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఆన్‌లైన్, వర్చువల్ విధానం ద్వారా శిక్షణా కార్యక్రమాలను కొనసాగించడం జరిగింది. ఇప్పటి వరకు నిర్వహించిన ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాల ద్వారా సుమారు 1.7 లక్షల మంది లబ్ధి పొందారు. పరిశ్రమల్లో పనిచేయడానికి అవసరమైన విధంగా స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్న ముఖ్యమంత్రిగారి లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో బలమైన నైపుణ్య వ్యవస్థను (స్కిల్ ఎకోసిస్టమ్) ఏర్పాటు చేయడం కోసం ఎపిఎస్‌ఎస్‌డిసి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది.


ఏపీ ప్రభుత్వ లక్ష్యాలు...

• స్కిల్ యూనివర్సిటీతోపాటు 30 స్కిల్ కాలేజీలు ఏర్పాటు చేయడం


• వివిధ ఇండస్ట్రీ క్లస్టర్ల సహకారంతో మరిన్ని పరిశ్రమల ఆధారిత నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి కార్యక్రమాలను ప్రారంభించడం


• ఇండస్ట్రీ 4.0, 21వ శతాబ్ధపు శిక్షణలను వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఎపిఎస్‌ఎస్‌డిసి ద్వారా అందించడం.


• లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్.ఎం.ఎస్) ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు రూపొందించిన మాడ్యూల్స్, నాణ్యమైన కంటెంట్ రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అందుబాటులో ఉంచడం.


• జీవో నెంబర్ 50 ప్రకారం రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న నైపుణ్య శిక్షణా కార్యక్రమాలన్నింటినీ ఎపిఎస్‌ఎస్‌డిసి ఒక నోడల్ ఏజెన్సీగా ఉంటూ పర్యవేక్షించడం.


• స్కిల్ ఇండియా పోర్టల్ తరహాలోనే రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్య శిక్షణా కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని అంతా ఒక్కచోట ఉంచేలా స్కిల్ ఏపీ పోర్టల్ ను రూపొందించడం.


• అప్రెంటీస్ షిప్ ద్వారా ఉపాధి అవకాశాలు యువత పొందేలా న్యాప్స్ కార్యక్రమాన్ని అమలు చేయడం


ప్రాథమిక రంగంలో శిక్షణ: వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ప్రత్యేక శ్రద్ధ ఉంచి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అమలు చేయడం. ముఖ్యంగా ప్రగతిశీల రైతులకు వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం. ఆక్వా రంగంలో సీవీడ్, సోలార్ డ్రైయింగ్ లాంటి విభాగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడం.


• మ్యానుఫ్యాశ్చరింగ్ రంగంలో ఉన్న డిమాండ్ కు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం కోసం జేబీఎం లాంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని శిక్షణ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగింది.


• ఇంటర్మీడియ్ బోర్డు సహకారంతో ఇంటర్ చదవుతున్న విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇంగ్లీష్ ప్రావీణ్యం అంశాలపై శిక్షణను త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది.


• గ్రామ, వార్డు సచివాలయం విభాగంలోని గ్రామ వాలంటీర్లకు ప్రాథమిక నైపుణ్యాలపై శిక్షణ అందించబడుతుంది. తద్వారా ప్రభుత్వం పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి నైపుణ్యాలు ఉపయోగపడతాయి. ఇక వ్యవసాయ శాఖతో కలిసి రైతు భరోసా కేంద్రం వంటి కార్యక్రమాలు ఆఫర్ చేస్తారు.


• రహదారులు మరియు సంబంధిత సౌలభ్యాలను మెరుగుపరచడానికి పర్యాటక అభివృద్ధిశాఖ, హైవే అథారిటీస్ తో కలిసి నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయడం.


• మైనారిటీ యువతకు కూడా నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ ఆఫైర్స్ శాఖకు ప్రతిపాదనలు పంపడం జరిగింది.


• మహిళలు స్వయం ఉపాధి పొందడం, వారి జీవనానికి ఎలాంటి ఇబ్బంద కలకుండా ఉపాధి పొందేలా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అమలు చేయడం.


• విదేశాల్లో ఉద్యోగాలు: గ్లోబల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి యుకెలో ఉద్యోగాలు పొందేలా చేయడం. అంతేకాకుండా విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి అవసరమైన సహకారాన్ని గ్లోబల్ స్కిల్ ట్రైనింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది.


• ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా విదేశాల్లో మంచి ఉద్యోగాలు పొందేలా చేయడం. అనేక ఉద్యోగాలున్నా కోవిడ్ కారణంగా నిలిచిపోయాయి.


• ఎంట్రప్రెన్యూర్షిప్ ను మరింత ప్రమోట్ చేయడంలో భాగంగా వస్తువు ఉత్పత్తి అయినప్పటి నుంచి అమ్మకం వరకు అవసరమైన సహకారం అదించడం


• గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో ఆధునిక సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించడం కోసం ‘స్కిల్స్ ఆన్ వీల్స్’ అమలు చేస్తున్నాము.


• పనిచేస్తున్న వారికి అదనపు నైపుణ్యాలు కల్పించడం కోసం ఆర్పీఎల్ పేరుతో నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతోంది.


• మ్యాసివ్ ఓపెన్ ఆన్ లైన్ క్లాసెస్ (మూక్స్) టూల్స్ ను ఉపయోగించి గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు కూడా లబ్ధి కలిగేలా ఎపిఎస్‌ఎస్‌డిసి శిక్షణా కార్యక్రమాల ప్రణాళి


• ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ అఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీ ఉన్నత విద్యామండలి) తో కలిసి రెగ్యులర్ అకడమిక్ విభాగంలో నైపుణ్య విభాగాన్ని చేర్చడంతోపాటు డిమాండ్ ఉన్న రంగాల్లో నైపుణ్య కోర్సులను అమలు చేయడానికి ప్రణాళిక.