Woman Killed In Bapatla: బాపట్ల (Bapatla) జిల్లాలో దారుణం జరిగింది. చీరాల మండలం ఈపురుపాలెంలో ఓ యువతిని దుండగులు అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు. ఉదయం బహిర్భూమికి వెళ్లిన కుమార్తె ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు. చివరకు రైల్వే ట్రాక్ సమీపంలో ముళ్ల చెట్లలో యువతి మృతదేహం కనిపించడంతో షాక్‌కు గురై కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అత్యాచారం, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరించారని.. 5 ప్రత్యేక పోలీస్ బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. 


ఘటనపై సీఎం తీవ్ర ఆగ్రహం


మరోవైపు, ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని.. బాధిత కుటుంబాన్ని కలవాలని హోంమంత్రిని ఆదేశించారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా ఉండాలని నిర్దేశించారు. కేసు దర్యాప్తులో అలసత్వం లేకుండా.. వేగంగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని అన్నారు. సీఎం ఆదేశాలతో హోంమంత్రి వంగలపూడి అనిత ఘటనా స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.