Fake Currency Printing : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యూట్యూబ్ సాయంతో నకిలీ నోట్లను ముద్రించి వివిధ ప్రాంతాల్లో చెలామణి చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రెండు వేల రూపాయల నోట్లు మూడు వందలు (ఆరు లక్షలు), కలర్ ప్రింటర్, ఏడు మొబైల్స్, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు నకిలీ నోట్ల తయారీ అవసరమైన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో  సయ్యద్ యాకుబ్ ఆలియాస్ షకీల్ (ప్రధాన నిందితుడు), యం.డి సమీర్(30), పేరాల అవినాష్ (28), కత్తి రమేష్ (24), యం.డి అక్రం ఆలీ (27), గడ్డం ప్రవీణ్ (33), గుండ్ల రజనీ (33), కత్తి సునిత (23), సోహెల్ (22) నిందితులని పోలీసులు తెలిపారు.  


జైలులో దొంగ ముఠాతో పరిచయం 


వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి ఈ కేసు వివరాలను వెల్లడిస్తూ.. పోలీసుల అరెస్ట్ చేసిన సయ్యద్ యాకుబ్ అలియాస్ షకీల్, గడ్డం ప్రవీణ్, గుండా రజనీ గతంలో కిడ్నాప్ కేసులో రామగుండం సబ్ జైలులో శిక్ష అనుభవించే సమయంలో వీరికి దొంగ నోట్లు ముద్రించే ముఠా సభ్యులతో పరిచయం ఏర్పడింది. వారి ద్వారా దొంగ నోట్ల ముద్రించి తీరును తెలుసుకున్న నిందితులు జైలు నుంచి విడుదలైన తర్వాత నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. దీంతో నిందితులు నేర చరిత్ర కలిగిన నిందితులతో కలిసి నోట్ల తయారీకి శ్రీకారం చుట్టారు.  యూట్యూబ్ ద్వారా ఓరిజినల్ రెండు వేల రూపాయలు పోలిఉండే కాగితాల గురించి తెలుసుకున్న ఈ ముఠా వాటిని కొనుగోలు చేసి నకిలీ నోట్లను ముద్రించింది.  



రద్దీ ఉండే ప్రాంతాల్లో నోట్ల చెలామణి


నిందితులు ముద్రించిన నకిలీ నోట్లను రద్దీగా ఉండే వ్యాపార ప్రాంతాలతో పాటు కిరాణం, బట్టలషాపు, మద్యం బెల్ట్ షాపుల వద్ద నకిలీ నోట్లను చెలామణి చేసేవారు. గత సంవత్సర కాలంగా నిందితులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ తో పాటు చుట్టు పక్కల జిల్లాల్లో  నకిలీ నోట్లను చెలామణి చేశారు. వచ్చిన డబ్బుతో నిందితులు మద్యం సేవిస్తూ, జల్సాలు చేసేవారు. శుక్రవారం ఉదయం ప్రధాన నిందితుడు మరో నిందితుడు అవినాష్ తో దొంగనోట్లను చెలామణి చేసేందుకు ద్విచక్ర వాహనంపై సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుమల్ బార్ వద్దకు వచ్చినట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో పథకం ప్రకారం నిందితులను పట్టుకున్నారు.  నిందితులను అరెస్ట్ చేసి వారిని విచారించగా మిగతా నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి నకిలీ నోట్లు స్వాధీనం చేసుకోసుకున్నారు.  


 సిబ్బందికి అభినందనలు


ఈ దొంగ నోట్ల ముఠాను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి, ఇన్సెస్పెక్టర్లు వెంకటేశ్వర్లు, నరేష్ కుమార్, ఎస్.ఐలు నిస్సారాషా, సుబేదారి ఎస్.ఐ రవికిరణ్, ఏఏఓ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుళ్లు మాధవరెడ్డి, స్వర్ణలత, కానిస్టేబులు రాజేష్, బిక్షపతి, శ్రీను, శ్రవణ్ కుమార్, రాజు, గౌతంలను పోలీస్ కమిషనర్ అభినందించారు.