Bhima Koregaon Case: భీమా కోరెగావ్ కేసులో ప్రొఫెసర్ ఆనంద్ తేల్ తుంబ్డేకు బాంబే హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుపై ఆనంద్‌కు బెయిల్ ఇచ్చింది కోర్టు






కానీ


అయితే ప్రొఫెసర్ ఆనంద్‌కు బెయిల్ ఇవ్వడంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అభ్యంతరం తెలిపింది. కోర్టు తీర్పుపై సుప్రీంలో అప్పీల్‌ చేస్తామని, కాబట్టి బెయిల్‌ ఆర్డర్‌పై వారం రోజులు స్టే విధించాలని ఎన్‌ఐఏ.. బాంబై హైకోర్టును అభ్యర్థించింది. దీంతో ఎన్‌ఐఏ అభ్యర్థన మేరకు బెయిల్‌ ఆర్డర్‌పై వారం రోజులు స్టే విధిస్తున్నట్లు బాంబే హైకోర్టు పేర్కొంది.


ఈ కేసులో ఆనంద్‌ను ఎన్​ఐఏ 2020లో అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. బెయిల్​ కోసం ప్రత్యేక కోర్టును ఆనంద్​ ఆశ్రయించగా కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది. దీంతో గతేడాది హైకోర్టులో ఆయన పిల్ వేశారు. 


ఇదీ కేసు


మహారాష్ట్ర పుణె జిల్లాలోని భీమా కోరెగావ్‌లో 2018 జనవరి 1న హింసాత్మక ఘటనలు జరిగాయి. 200 ఏళ్ల కింద జరిగిన భీమా కోరెగావ్‌ యుద్ధాన్ని స్మరించుకునేందుకు ఎల్గార్‌ పరిషత్‌ నేతృత్వంలో చేసిన ప్రయత్నం చివరకి అల్లర్లకు దారితీసింది. ఆ అల్లర్లలో ఒకరు మృతి చెందగా, పోలీసులతో సహా పలువురు గాయపడ్డారు.


భీమా-కోరేగావ్‌లో అల్లర్ల తర్వాత పోలీసులు 162 మందిపై 58 ఫిర్యాదులను నమోదు చేశారు. వీటితో పాటు నక్సల్స్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో వరవరరావుతో సహా ఐదుగురిని 2018లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో కొందరు మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నారని పోలీసులు చెప్పారు. వీరంతా ప్రధాని మోదీని హత్య చేయడానికి కుట్ర చేశారని, వీరికి వరవరరావు ఆర్థికంగా సహకరిస్తున్నారని మహారాష్ట్ర పోలీసులు అభియోగం మోపారు.


ఈ కేసులో రోనా విల్సన్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. రోనా విల్సన్ వద్ద దొరికిన లేఖలో వరవరరావు పేరు ఉందని పోలీసులు అప్పట్లో చెప్పారు. ఆ ఆధారాలతో 2018 ఆగస్టు 28న హైదరాబాద్‌లో పెండ్యాల వరవరరావును మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసి పుణె తరలించారు. అయితే, పోలీసుల ఆరోపణలను హక్కుల సంఘాలు, వామపక్ష ప్రజాసంఘాలు మాత్రం ఇదంతా కుట్ర అని, ప్రశ్నించే గొంతు నొక్కడమే తప్ప మరేమీ కాదని వారించాయి. అనంతరం 2020లో ఈ కేసును ఎన్‌ఐఏ చేపట్టింది.


ఇటీవల బెయిల్


బెయిల్ కావాలని 82 ఏళ్ల వరవరరావు బాంబే హైకోర్టును ఆశ్రయించగా అది తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అప్పటికే రెండున్నరేళ్లు పోలీసుల కస్టడీలో ఉండడం.. వృద్ధాప్యంలో ఉండడంతో వైద్య కారణాల రీత్యా ఆయన‌కు బెయిల్ సాధారణ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. అయితే, ముంబయి దాటి పోకూడదని షరతు విధించింది.


Also Read: Bharat Jodo Yatra: జోడో యాత్రలో పాల్గొన్న గాంధీ ముని మనవడు- రాహుల్‌తో కలిసి అడుగులు