ముక్కోణపు ప్రేమ వ్యవహారంలో ఒక యువతి, యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖపట్నంలోని గోపాలపట్నంలో జరిగింది. గత మూడు రోజుల క్రితం జరిగిన యువతి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేయగా ఈ కీలక విషయాలు తెలిశాయి. జీవీఎంసీ 89వ వార్డు నాగేంద్రకాలనీకి చెందిన షేక్ కరిస్మా(16) కుటుంబ సభ్యులతో నివాసముంటూ బుల్లయ్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఒకరిని ప్రేమించి.. మరొకరిని వివాహం చేసుకున్న బాలిక.. తను చనిపోయి.. మరొకరి ప్రాణాలను బలిగొంది. వివాహం చేసుకున్న యువకుడి జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది. 


గోపాలపట్నం పోలీసులు తెలిపిన వివరాలివీ.. నాగేంద్ర కాలనీకి చెందిన బాలిక (16) ఇటీవల గురువారం (ఆగస్టు 10) ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దీనిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా పలు ఆసక్తికర విషయాలు బయట పడ్డాయి. నగరంలోని ఓ కళాశాలలో ఇం టర్ చదువుతున్న బాలికకు పలువురు యువకులతో పరిచయాలు ఉన్నాయి. ఆదర్శ నగర్ కు చెందిన సీపాన సూర్యప్ర కాష్ రావుతో ప్రేమ వ్యవహారం నడిపిస్తూ.. ఇందిరానగర్ కు చెందిన లెంకా సాయి కుమార్ ను రహస్యంగా వివాహం చేసుకుంది. ఆమె, సూర్యప్రకాష్ చనువుగా ఉండడంతో అది సాయి కుమార్ కు నచ్చలేదు. అలాగే సాయికుమార్ తో చనువుగా వ్యవహరించడం సూర్య ప్రకాశ్ కు నచ్చలేదు. దీనితో ముగ్గురి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. 


బాలిక ఆత్మహత్యకు రెండు రోజుల ముందు ఆమె ఇంటికి ఇద్దరూ వేర్వేరు సమయాల్లో వచ్చారు. ఇద్దరిలో ఎవరితో ఉంటావో తేల్చుకోవాలని స్పష్టం చేశారు. దీంతో ఒత్తిడికి గురైన ఆమె.. ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి.. సూర్య ప్రకాష్, సాయికుమార్లపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. బాలికను ఒత్తిడికి గురి చేయడం వల్లే మరణించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయం తెలిసి ఆందోళన చెందిన సూర్య ప్రకాష్ గోపాల పట్నం ఆర్డర్ క్యాబిన్ వద్ద శుక్రవారం రైలు కింద పడి మృతి చెందాడు. శనివారం మృతదేహాన్ని చూసిన అతని తల్లిదండ్రులు సూర్యప్రకాష్ గా గుర్తించారు. లంకా సాయి కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.


మృతురాలి తండ్రి గపూర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ ఇ.నరసింహారావు ఆధ్వర్యంలో ఎస్సై అప్పలనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని |శవపంచనామా కోసం కేజీహెచ్ కు తరలించారు.