Kakinada Road Accident: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. ఇంకా తొమ్మిది మంది గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 


లారీని ఢీకొన్న బొలెరో 
కాకినాడ జిల్లా తుని మండలం వెలమ కొత్తూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఓ బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో 9 మంది కూడా గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే విషయం గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన ఓ వ్యక్తిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందతూ చనిపోయిన మరిద్దరి మృతదేహాలను కూడా పోస్టు మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అయితే విశాఖ నుంచి కోరుకొండ మండలం శ్రీరంగం పట్నం వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. 


మృతులు, క్షతగాత్రులంతా శ్రీరంగ పట్నం వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా కళాకారులని... ఒకే బృందానికి చెందిన వాళ్లని తెలిపారు. అయితే వీరు విశాఖ మార్కాపురం వద్ద నిన్న రాత్రి నాటకం ప్రదర్శించారు. నాటక ప్రదర్శన అనంతరం సొంత గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.  


మూడ్రోజుల క్రితమే మేడ్చల్ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి


మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూప్రాన్ నుంచి నగరానికి బైక్ పై వెళ్తున్న ఓ జంటకు ఓ వ్యక్తి అనుకోకుండా అడ్డుగా వచ్చాడు. అతడిని తప్పించబోయిన బైకర్ డివైడర్ ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు కింద పడిపోయారు. వీరితో పాటే రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తి కూడా పడిపోయారు. అయితే వెనుక నుండి వస్తున్న లారీ వారిని గమనించకుండా.. వారి పైనుంచి దూసుకెళ్లింది. దీంతో ఈ ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ, డివైడర్ దాటి వచ్చిన ఓ వ్యక్తి, బైకర్ ఉన్నాడు. అయితే విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


వర్షాకాలం కావడం ఆపై డివైడర్ పై చెట్లు పెరగడంతో రోడ్డు దాటుతున్న వ్యక్తిని గమనించలేకపోయాడు బైకర్. అతడిని తప్పించబోయే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతన్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.


 Also Read: Software Engineer Dies: పెళ్ళైన 24 గంటల్లోనే వరుడు మృతి, శోభనం గదిలో చనిపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్


Also Read: సంచలనం సృష్టిస్తున్న రాధిక లేఖ- కావాలనే మావోయిస్టు పార్టీలో చేరినట్టు వివరణ