Chittoor Software Engineer Dies: వివాహం అంటే నిండు నూరేళ్ల పంట అంటారు. అందులోనూ ప్రేమించి వివాహం చేసుకుంటే జీవితం అంతా సాఫీగా సాగుతుందని ఎన్నో కలలు కంటారు. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్న యువతి, యువకుడికి సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడంతో ఎలాగోలాగ పెద్దలకు చెప్పి ఒప్పించి బంధుమిత్రుల సమక్షంలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ కావడంతో సంతోషంలో పెళ్లి కుమారుడు సైతం డ్యాన్స్ లు వేస్తూ ఆనందంగా గడిపాడు. ఏం జరిగిందో తెలియదు గానీ శోభనం గదిలోనే పెళ్లి కుమారుడు విగతజీవిగా కనిపించాడు. చిత్తూరు జిల్లాలో ఈ విషాదం జరిగింది. 
ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం, ఫేస్‌బుక్‌లో ప్రేమ
చిత్తూరు జిల్లా పాకాల మండలం పత్తిపాటివారిపల్లెకు చెందిన తులసీ ప్రసాద్ హైదరాబాదులోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన శిరీష సైతం నగరంలోనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తోంది. కొంతకాలం కిందట ఫేస్ బుక్ ద్వారా వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీలున్నప్పుడు కలిసి మాట్లాడుకోవడంతో వీరి మనసులు మరింత దగ్గరయ్యాయి. ఇద్దరూ జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకుని తమ ప్రేమ విషయం పెద్దల దృష్టికి తీసుకెళ్ళారు. మొదట్లో ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోకపోయినా ఆ తరువాత వారిని ఒప్పించారు. మదనపల్లెలోని ఓ కళ్యాణ మండపంలో బంధు, మిత్రుల సమక్షంలో వివాహ వేడుకను సోమవారం నాడు ఎంతో గ్రాండ్ ను నిర్వహించారు.
రాత్రి సంతోషంగా స్టెప్పులు..
తాను ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు తన జీవిత భాగస్వామి కావడంతో పట్టలేని సంతోషంతో వివాహ వేడుకల్లో అందరితో కలిసి పెళ్లి కుమారుడు తులసీ ప్రసాద్ డ్యాన్స్ చేస్తూ సంతోసంగా వేడుకల్లో పాల్గొన్నాడు.  ఇక వివాహ వేడుక ముగిసిన మరుసటి రోజు బంధుమిత్రులకు విందు ఏర్పాటు చేసి అందరితో సంతోషంగా గడిపారు. వేడుక అనంతరం సాంప్రదాయబద్ధంగా నిర్వహించే శోభనం తంతునూ తులసీప్రసాద్ పిన్ని నివాసం ఉండే మదనపల్లెలోని చంద్ర కాలనీలో నిన్న రాత్రి నిర్వహించారు. వరుడు తులసీ ప్రసాద్ శోభనం రోజు రాత్రి తన భాగస్వామి శిరీషతో తమ భవిష్యత్తు గురించి చర్చించాడు.  
తెల్లవారేలోగా విషాదం..
తెల్లవారుజాము మూడు గంటల సమయం కావస్తోంది. ఇంతలో నవ వధువు శిరీషకు మెలుకువ వచ్చింది. తన పక్కనే నిద్రిస్తున్న భర్త తులసీ ప్రసాద్ ను నిద్రలేపింది. ఎంత పిలిచినా ఉలుకు పలుకు లేకుండా పడి ఉండడంతో ఒక్కసారిగా ఆందోళన చెందిన శిరీష సహాయం కోసం గట్టిగా కేకలు వేసింది. వీరి గదికి వచ్చిన బంధువులు పెళ్లి కొడుకును చికిత్స నిమిత్తం హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. తులసీ ప్రసాద్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఇరుకుటుంబాలు శోకసంద్రంలో మునిగి పోయాయి. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని కోసం సొంత గ్రామంమైన పత్తిపాటివారిపల్లెకు తరలించారు. మరోవైపు వరుడి బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.