Satya Sai District News :  శ్రీ సత్య సాయి జిల్లాలో దారుణం జరిగింది. లేపాక్షి మండలం మైదు గోళం గ్రామంలో కుటుంబ కలహాలతో హసీనా(50) అనే మహిళను ఆమె భర్త వాజిద్ గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఇంట్లో నిద్రపోతున్న హసీనా తలపై గొడ్డలితో నరకడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది.  పట్టపగలే భార్యను భర్త హత్య చేసిన సంఘటన గ్రామంలో సంచలనం సృష్టించింది. భార్యను హత్య చేసిన తర్వాత నిందితుడు పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 


అసలేం జరిగింది? 


శ్రీ సత్య సాయి జిల్లా లేపాక్షి మండలం మైదుగోళం గ్రామానికి చెందిన వాజిద్, హసీనా భార్యభర్తలు. ఇరువురు కుటుంబ కలహాలతో తరచూ గొడవపడేవారు. వాజిద్ మద్యానికి బానిసై భార్యను నిత్యం వేధించే వాడు. సోమవారం సాయంత్రం  మద్యం సేవించి వచ్చిన వాజిద్ భార్య హసీనా నిద్రపోతున్న సమయంలో తలపై గొడ్డలితో బలంగా కొట్టాడు. దీంతో తీవ్రగాయమైన హసీనా అక్కడికక్కడే మరణించింది. హత్యకు ఉపయోగించిన గొడ్డలి అక్కడే వదలి నిందితుడు పరారయ్యాడు. నిందితుని కోసం లేపాక్షి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 


అదనపు కట్నం కోసం భార్యకు ఉరి వేసిన భర్త 


జగిత్యాల జిల్లా మల్యాలలో పల్లెపు మహేందర్ అనే వ్యక్తి భార్యను అదనపు కట్నం కోసం వేధించేవాడు. తాగిన మైకంలో భార్య నవ్యను ఉరి వేసి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. వీరికి 4 నెలల పాప ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


పెళ్లైన మూడు రోజులకే 


కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈనెల 9వ తేదీన మాధవరం గ్రామానికి చెందిన యువతిని రచ్చమర్రి గ్రామానికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం జరిపించారు. అయితే యువతి అంతకుముందే శివాజీ అనే మరో వ్యక్తిని ప్రేమించింది. పెళ్లైన మూడో రోజే ఆమె శివాజీతో వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన బంధువులు శివాజీ ఇంటికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ఇంట్లో దుస్తులు, బియ్యం కాలిపోయాయి. ఎస్‌ఐ రాజకుళ్లాయప్ప సిబ్బందితో వెళ్లి చుట్టుపక్కల వారి సాయంతో మంటలు ఆర్పేశారు. ఆ సమయానికి శివాజీ కుటుంబ సభ్యులు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం రచ్చమర్రి, మాధవరం గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.


Also Read : Road Accident In Alluri District: అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం - ప్రైవేట్ బస్సు బోల్తా, ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి


Also Read : Chittoor Crime : ప్రేమ పెళ్లికి డబ్బులు ఇవ్వలేదని యువకుడు ఆత్మహత్య!