ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మీడియాలలో వస్తోన్న కథనాలతో పెగాసస్ స్పైవేర్ పేరు మారుమోగిపోతోంది. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా సహా దాదాపు 300 మంది ప్రముఖులపై ఇజ్రాయెల్‌లోని ఎస్ఎస్‌వో (NSO) గ్రూప్‌నకు చెందిన పెగాసస్ స్పైవేర్ నిఘా వేసిందనే కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై చర్చ జరపాలంటూ విపక్షాలు చేస్తోన్న ఆందోళనలతో పార్లమెంట్ దద్దరిల్లుతోంది. దీనిపై చర్చ జరగాల్సిందేనని విపక్ష నేతలు గగ్గోలు పెడుతున్నా.. ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలన్నీ అవాస్తవం అని కొట్టిపారేస్తోంది. అసలేంటి పెగాసస్.. ఇందులో చిక్కుకుంటే తప్పించుకోలేమా? 
ఎన్‌ఎస్‌ఓ నిఘా కంపెనీ.. 
ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ అనే నిఘా కంపెనీ పెగాసస్ స్పైవేర్ టూల్‌ను అభివృద్ధి చేసింది. నేరస్థులు, ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఉపయోగపడేలా దీనిని రూపొందించింది. కిడ్నాప్‌నకు గురైన వారిని గుర్తించడానికి, కూలిపోయిన భవనాల కింద చిక్కుకున్న వారికి కాపాడటానికి, సెక్స్, మాదక ద్రవ్యాల మాఫియాలను కనిపెట్టడానికి దీనిని ఉపయోగిస్తుంటామని ఎన్‌ఎస్‌ఓ తెలిపింది. నిఘా కార్యకలాపాలు నిర్వహించేందుకు దీనిని ప్రభుత్వ సంస్థలకు అమ్ముతుంది. 
ఎలా హ్యాక్ చేస్తారు?  
యూజర్లకు ఏ మాత్రం అనుమానం రాకుండా ఫోన్లను హ్యాక్ చేయడమే పెగాసస్ ప్రత్యేకత. మొదట హ్యాక్ చేయాలనుకున్న వ్యక్తి ఫోనుకు ఓ మిస్డ్ కాల్ వస్తుంది. దానిని లిఫ్ట్ చేసినా.. చేయకపోయినా పర్వాలేదు. మిస్ట్ కాల్ వచ్చిందంటే సదరు వ్యక్తి ఫోనులో పెగాసస్ వచ్చి చేరినట్లే. గేమ్స్, సినిమా యాప్స్, వైఫైల ద్వారా కూడా ఇది ఫోన్లలోకి చొరబడుతుంది. 
గుర్తించేలోపే అంతా అయిపోతుంది.. 
గతంలో మెసేజ్‌లు, మెయిల్స్ ద్వారా లింకులను పంపేది. వీటిని క్లిక్ చేసిన వ్యక్తి ఫోన్‌లో పెగాస‌స్ ఇన్‌స్టాల్ అయిపోతుంది. దీనిని నిరోధించే పద్ధతులను ఫోన్ల కంపెనీలు కనిపెట్టగలగడంతో ఒక అడుగు ముందుకేసి ఈ మిస్డ్ కాల్ టెక్నిక్‌ను వాడుతోంది. స్పైవేర్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత మిస్డ్ కాల్‌ను కూడా ఇది డిలీట్ చేస్తుంది. దీంతో యూజర్లు కూడా దీనిని కనిపెట్టలేరు. 
తర్వాత ఏం అవుతుంది?
ఒక్కసారి పెగాసస్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన తర్వాత యూజర్ల కాల్స్, మెసేజ్‌లతో పాటు ఫోన్‌ను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకుంటుంది. యూజర్లకు తెలియకుండా కాల్స్ రికార్డ్ చేయడం, లొకేషన్ తెలుసుకోవడం, మెసేజ్‌లు, ఈమెయిల్స్ చదవడం, డివైస్ సెట్టింగ్స్, మైక్రోఫోన్‌ను ఆన్ చేయడం వంటివి చేస్తుంది. 
2016 నుంచే ఆరోపణలు.. 
2016లో యునైటెడ్ అరడ్ ఎమిరేట్స్ లోని మానవ హక్కుల కార్యకర్త అహ్మద్ మన్సూర్ ఈ పెగాసస్ స్పైవేర్ ను గుర్తించారు. తన ఐఫోన్ హ్యాక్ అయినట్లు యాపిల్ కంపెనీకి ఫిర్యాదు చేశారు. అప్పుడు మొదటి సారిగా ఈ పెగాసస్ వెలుగులోకి వచ్చింది. ఐఫోన్‌ యూజర్లే లక్ష్యంగా ఈ స్పైవేర్‌ హ్యాకింగ్‌‌కు పాల్పడుతున్నట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. దీంతో యాపిల్‌ సంస్థ ఐఓఎస్‌ అప్‌డేట్‌ వెర్షన్‌ను విడుదల చేసింది. 


ఎన్‌ఎస్‌ఓపై ఫేస్‌బుక్ కేసు
2019లో తమ యూజర్ల గోపత్యకు పెగాసస్ వల్ల భంగం వాటిల్లుతోందని ఫేస్‌బుక్ సంస్థ ఆరోపించింది. దీనికి సంబంధించి ఎన్‌ఎస్‌ఓ కంపెనీపై కేసు కూడా నమోదు వేసింది. అదే ఏడాది భారతదేశంలో కూడా కొంద‌రు కేంద్ర మంత్రులు, జ‌ర్న‌లిస్టులు, ప్ర‌తిప‌క్ష నేత‌ల ఫోన్లు హ్యాకింగ్‌కు గుర‌య్యాయ‌న్న వార్తలు వెల్లువెత్తాయి. 2019లో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. అధికార ప్రభుత్వమే తమ ఫోన్లను హ్యాక్ చేయిస్తోందని ఆరోపించారు.  
ఇప్పుడెందుకు వచ్చింది?
పెగాసస్ వినియోగానికి సంబంధించి ది వైర్, ది గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్ సహా పలు అంతర్జాతీయ మీడియాలలో కథనాలు వెల్లువెత్తాయి. పెగాసస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారనేది ఈ కథనాల్లో ప్రధాన అంశంగా ఉంది. ఈ కథనాల ప్రకారం.. భారతదేశంలోనూ 300 మంది ప్రముఖుల ఫోన్ నంబర్లు హ్యాక్ అయ్యాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు అంటే 2018-19 మధ్య ఇది జరిగిందని పేర్కొన్నాయి.
అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ (Amnesty International’s technical lab) పరిశీలన ద్వారా ఫోన్లు హ్యాక్ అయ్యాయనే సంగతి నిర్ధారణ అయింది. అనుమానం వచ్చిన ఫోన్లను ల్యాబ్‌లో అధునాతన పద్ధతిలో పరిశీలిస్తే అవి హ్యాక్ అయ్యాయనే తేలింది. 
వల పెద్దదే.. 
ఈ జాబితాలో భారతదేశంతో పాటు బహ్రెయిన్, మెక్సికో, సౌదీ అరేబియా, హంగేరి వంటి ఇతర దేశాల ప్రముఖులు పేర్లు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 వేల మంది ఫోన్‌ నంబర్లపై పెగాసస్ ద్వారా ఎన్‌ఎస్‌ఓ నిఘా పెట్టిందని మీడియా కథనాలు వెల్లడించాయి. వీటిలో 1000 నంబర్లను గుర్తించారు. వీరంతా 50 దేశాలకు చెందినవారి నంబర్లు ఇందులో ఉన్నాయి. 2016 నుంచి పెగాసస్ నిఘా కొనసాగుతోన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లీక్ అయిన జాబితాలో ఎక్కువ నంబర్లను 2018 - 2019 మధ్య కాలంలో హ్యాక్ చేసినట్లుగా తెలిసింది.  
రాహుల్, ప్రశాంత్.. 
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా సహా ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్న ప్రహ్లాద్ పటేల్, అశ్వినీ వైష్ణవ్ మాజీ సీజేఐ రంజన్ గొగొయిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ ఫోనుతో పాటు ఆమె సమీప బంధువులకు చెందిన 11 నంబర్లు సైతం ఈ జాబితాలో ఉన్నాయి. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోన్ నంబరు కూడా పెగాసస్ హ్యాకింగ్ జాబితాలో ఉన్నట్లు డాన్ పత్రిక పేర్కొంది. 
ప్రభుత్వంపై ఆరోపణల వెల్లువ.. 
ఎన్ఎస్‌వో గ్రూప్ ఈ స్పైవేర్‌ను నిఘా కార్యకలాపాల కోసం విక్రయిస్తుండటంతో ఈ హ్యాకింగ్‌లో ప్రభుత్వ పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమపై వస్తోన్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. భారతదేశ ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి వార్తలు రాస్తున్నారని ఆరోపించింది. ఇక పెగానస్ స్పైవేర్ టూల్‌ను రూపొందించిన ఎన్‌ఎస్‌ఓ సైతం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఇవన్నీ అవాస్తవాలని తెలిపింది. దీనిపై కోర్టులో పరువునష్టం దావా వేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సంస్థ వెల్లడించింది. 
వలయంలో చిక్కితే అంతే..
ఒక్కసారి పెగాసస్ మన ఫోన్లో చేరిందంటే దానిని ఏం చేసినా తొలగించలేమని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ మార్చుకోవడం తప్ప ఏం చేయలేమని అంటున్నారు. పెగాసస్ ఓ పెద్ద వలయమని అందులో చిక్కుకుంటే తప్పించుకోవడం అంత సులభం కాదని అభిప్రాయపడ్డారు.