Palnadu Crime : పల్నాడు జిల్లాలో యువతి గొంతు కోసి హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. ప్రియురాలి గొంతు కోసి పరారైన నిందితుడు తులసీరామ్‌ను సత్తెనపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ రవిశంకర్ రెడ్డి సత్తెనపల్లి పోలీసుస్టేషన్‌లో ఈ కేసుపై మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 


పెళ్లి చేసుకోమన్నందుకే 


దాచేపల్లికి చెందిన షేక్‌ ఫాతిమా భర్తతో విడిపోయి గత 6 నెలల నుంచి సత్తెనపల్లిలోని పాత బస్టాండ్ జనసేన కార్యాలయం ఎదురుగా అద్దె ఇంట్లో నివాశిస్తుంది. గురజాలకు చెందిన తులసీరామ్‌ ఫాతిమాతో పరిచయం పెంచుకుని సహజీవనం చేస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఫాతిమా తులసీరామ్‌ను కోరింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఫాతిమా ఎంత చెప్పినా వినడంలేదని ఆవేశంతో తులసీరామ్‌ ఆమె గొంతు కోశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటన జరిగిన రోజు అంబేడ్కర్‌ జయంతి కావడంతో జనసేన నాయకులు పార్టీ కార్యాలయానికి వస్తుండగా రోడ్డుపై రక్తపు మడుగులో ఉన్న ఫాతిమాను చూసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 


36 గంటల్లో కేసు ఛేదన 


జనసేన నాయకులు ఫాతిమాను సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.  ఫాతిమా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తులసీరామ్‌ కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. సత్తెనపల్లె పట్టణంలోని చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో తులసీరామ్ ను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఎస్పీ అన్నారు. హత్యాయత్నం జరిగిన 36 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసిన సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి నేతృత్వంలోని బృందాన్ని ఎస్పీ రవిశంకర్ రెడ్డి అభినందించారు.


భార్య గొంతులో స్క్రూ డైవర్ పొడిచిన భర్త


కరీంనగర్‌లోని ఎన్టీపీసీలో మూడ్రోజుల క్రితం దారుణం చోటుచేసుకుంది. తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి విడిపించి తీసుకురావాలంటూ భర్తను కోరిన ఓ భార్యను హతమార్చాడో దుర్మార్గుడు. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయి వాటి నుంచి బయట పడలేక చివరికి జీవితాన్నే నాశనం చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే ఎన్టీపీపీలోని సంజయ్ గాంధీ నగర్ కి చెందిన సుందరగిరి రాజేష్ ఎలిగేడుకి చెందిన రక్షితను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లికి ముందే భూపాలపల్లిలో పనిచేసిన అతనికి ఆర్థికంగా తీవ్రమైన కష్టాలు ఎదురయ్యాయి. అప్పులు ఎక్కువ కావడంతో అక్కడి నుండి తిరిగి గోదావరిఖనిలోని అడ్డగుంట పల్లిలో కుల వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వరుసగా వచ్చిన ఆర్థిక కష్టాలతో అప్పులు క్రమక్రమంగా పెరిగి ఇంట్లో గొడవలకు దారి తీశాయి. దీంతో తాత్కాలికంగా వాటి నుండి బయట పడడానికి తన భార్య రక్షిత (25) అలియాస్ కల్పన వద్ద ఉన్న 5 తులాల బంగారాన్ని కుదువపెట్టి తనకు డబ్బు ఇచ్చిన వారికి చెల్లించాడు. 


అయితే తమ పుట్టింట్లో ఫంక్షన్ ఉండడంతో తనకు బంగారం అవసరం ఉందంటూ రక్షిత పదేపదే రాజేష్ ని కోరింది. తన ఇంట్లో వాళ్ళు ప్రశ్నిస్తే సమాధానం ఏమని చెప్పాలి అంటూ రాజేష్ ను నిలదీసేది. ఈ క్రమంలో మళ్ళీ గట్టిగా అడగడంతో ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. విచక్షణ కోల్పోయిన రాజేష్ రక్షితను పక్కనే ఉన్న స్క్రూ డ్రైవర్ తో గొంతులో దారుణంగా పొడిచాడు. రక్తం మడుగులో రక్షిత అక్కడికక్కడే మృతి చెందింది. అయితే, విషయం బయటపడుతుందనే భయంతో ఇంటికి తాళం వేసి రాజేష్ పరారయ్యాడు. తిరిగి ఎవరిని కాంటాక్ట్ కాలేదు.  మంగళవారం ఉదయం ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు తాళం బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా హత్య చేసిన విషయం బయటపడింది. వీరిద్దరికీ రెండేళ్ల కుమారుడు ఉండగా తల్లికి ఏమైందో తెలియక ఆ బాలుడి రోదన చూసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ గిరిప్రసాద్, రామగుండం సీఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐలు స్వరూప్ రాజ్, కుమార్, శరణ్య, లక్ష్మీ ప్రసన్న పరిశీలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.