Palnadu Accident : ఏపీలోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాపరాళ్లతో వెళ్తోన్న లారీ బోల్తా పడి ముగ్గురు కూలీలు అక్కడిక్కడే మృతి  చెందారు. జిల్లాలోని నకరికల్లు మండలం శాంతి నగర్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నాపరాళ్లతో వెళ్తో్న్న లారీ శాంతినగర్ వద్ద బోల్తా పడింది. లారీలో ఉన్న నాపరాళ్లు కూలీలపై పడడంతో ముగ్గురు మృతి చెందారు. మాచర్ల నుంచి ఇతర రాష్ట్రాలకు నాపరాళ్లు తరలిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కూలీల మృతదేహాలను పోస్టుమార్టం కోసం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన కూలీలు మాచర్లలోని పసర్లపాడుకు చెందిన అమారేసు శ్రీను, దొడ్డ భాస్కరరావు, రమావత్ మునినాయక్‌గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


దైవ దర్శనానికి వెళ్లి వస్తూ 


ఎన్నో కష్టాలు అనుభవించి జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకున్నారు. బిడ్డ పెళ్లి చూడకుండానే మృత్యువు కబలించింది. అనుకోని ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో శనివారం జరిగింది.  పైడిభీమవరం సమీపంలోని జాతీయ రహదారిపై ఓ వంతెన వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులు అక్కడికక్కడే చనిపోయారు. విశాఖ కొమ్మాదిలో ఉంటున్న బగాది షణ్ముఖరావు, విజయలక్ష్మి కుమారుడు సంతోష్‌తో కలిసి గార మండలం వత్సవలసలో రాజమ్మతల్లి ఆలయానికి మొక్కు చెల్లించుకోడానికి శనివారం ఉదయం బయలుదేరారు. మొక్కు తీర్చుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో షణ్ముఖరావు, విజయలక్ష్మి అక్కడికక్కడే మృతిచెందారు. కుమారుడు సంతోష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో సంతోష్ కారు నడుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో సంతోష్ తీవ్రంగా గాయపడిన తల్లిదండ్రుల వద్ద రోదించడం స్థానికులను కలచివేసింది. ఈ ప్రమాదం జేఆర్‌పురం పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. 


ములుగు జిల్లాలో దంపతులు మృతి 


ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీ కొని దంపతులు మృతి చెందారు. జిల్లాలోని వాజేడు మండలం సుందరయ్య కాలనీ వద్ద 163 జాతీయ రహదారిపై లారీ ఢీకొని ఆర్లగూడెం గ్రామానికి చెందిన రమేష్, స్వరూప దంపతులు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. రమేష్, స్వరూప దంపతులు ద్విచక్ర వాహనంపై స్వగ్రామం నుంచి వేరే ఊరు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Also Read : ABP Desam Impact: ఏబీపీ దేశం ప్రయత్నం, టీఎస్‌ఆర్టీసీ కొత్త బస్ సర్వీస్‌లు - వెంటనే స్పందించిన సజ్జనార్


Also Read : AP Cyber Crime: ఓటీపీ చెప్పిన వెంటనే ఫోన్ కట్ - మూడు లక్షలు డెబిట్ అని రైతుకు మెస్సేజ్