Narasapuram Crime : యువతి ఫొటో చూపించి పక్కా ప్లాన్ తో యువకుడ్ని ట్రాప్ చేశారు. యువతి, యువకుడు గదిలో ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియో తీశారు. అనంతరం ఆ వీడియో సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు దిగారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో యువతి యువకుడి నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేసిన ఇద్దరు యువకుల్ని నర్సాపురం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక యువతి ఫొటో చూపించి పక్కా ప్లాన్ తో యువకుడ్ని ఆమె గదిలోనికి పంపి వారిద్దరూ కలిసి ఉన్న సన్నివేశాలను వీడియో తీశారు. ఆ వీడియో చూపించి యువకుడ్ని రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. ఈ విషయం యువకుడి సోదరుడికి తెలియడంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. బ్లాక్ మెయిల్ చేసిన దినేష్, హరీష్ లను పోలీసులు అరెస్టు చేశారు. 


"ఈ రోజు ఓ యువకుడు పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. ఓ యువతితో ప్రైవేట్ ఉన్నప్పుడు ఇద్దరు యువకులు వీడియోలు తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టకుండా ఉండాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో యువకుడు కొంత డబ్బులు ఇచ్చాడు. మిగతా డబ్బుల కోసం ఆ ఇద్దరు యువకుడ్ని వేధిస్తున్నారు. దీంతో బాధితుడు నర్సాపురం రూరల్ పోలీస్ స్టేషన్ రిపోర్టు ఇచ్చాడు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నాం." - వి.సురేష్ బాబు, నరసాపురం రూరల్ సీఐ



న్యూడ్ కాల్స్ తో బెదిరింపులు 


 సోషల్‌ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్టులు.. యాక్సెప్ట్ చేస్తే... పరిచయం, ఆపై ఫోన్ నంబర్లు మార్పు, ఆతర్వాత వాట్సాప్ చాట్‌, వాట్సాప్ కాల్‌ ఆ వెనువెంటనే నీతో గడపాలని ఉందంటూ న్యూడ్ గా ఉండి అమ్మాయిలు వీడియో కాల్స్ చేస్తారు. వీడియో కాల్‌లో రెచ్చగొట్టే శృంగారపు సంభాషణ జరిపి పిచ్చెక్కిస్తారు. రెండు మూడు రోజుల్లోనే అబ్బాయిలే తరచుగా వారికి న్యూడ్‌కాల్స్ చేసుకునే విధంగా ట్రాప్‌ చేస్తారు. ఆ తర్వాత అసలు రూపం బయటపెడుతూ బ్లాక్‌మెయిల్‌కు దిగుతారు. అడిగినంత డబ్బులు ఇచ్చారా.. సరేసరి. లేదంటే.. నీ పరువు మొత్తం తీస్తామంటూ బెదిరింపులకు పాల్పడతారు. బాధితుల కుటుంబ సభ్యులకు, బంధువులకు, ఈ న్యూడ్ కాల్స్ వీడియోలను పంపిస్తామంటూ సైబర్‌ నేరగాళ్లు విపరీతంగా భయపెడతారు. కొద్ది నెలలుగా ఈ తరహా న్యూడ్ కాల్స్ బెదిరింపులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. పరువు పోతుందని, ప్రతిష్ఠ దెబ్బతింటుందని, ఎలా ఫిర్యాదు చేయాలో తెలియక బాధితులు డబ్బులు పొగోట్టుకోవడంతో పాటు మానసికంగా చితికిపోతున్నారు. జరుగుతున్న అనేక ఘటనల్లో పోలీస్‌స్టేషన్ వరకు చేరుతున్న కేసులు మాత్రం ఒకటి, రెండే కావడం గమనార్హం. 


బ్లాక్ మెయిలింగ్ తో డబ్బులు డిమాండ్ 


ముందు వాట్సాప్ చాటింగ్‌తో మొదలు పెట్టి.. వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకుని మాట్లాడుకునేలా ప్రేరేపిస్తున్నారు. రోజుల వ్యవధిలోనే బాధితులకు నమ్మకం కుదిరేలా చేసి అమ్మాయిలచే న్యూడ్‌ కాల్స్ చేయించి మత్తెక్కిస్తారు. బాధితుడి చేత కూడా బట్టలిప్పేలా ప్రేరిపిస్తారు. దీంతో కొంతమంది వారు చెప్పినట్లుగా చేస్తుండటంతో సైబర్‌ నేరగాళ్లకు అడ్డంగా బుక్కవుతున్నారు. బాధితుల వీడియో చాటింగ్ దృశ్యాలను సీక్రెట్‌గా చిత్రికరించడం, వీడియో స్క్రీన్‌షాట్లను చేయడం చేస్తున్నారు. తాము అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే సదరు న్యూడ్ కాల్స్‌ వీడియోలను, చిత్రాలను మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు చేరుస్తామని, సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బ్లాక్ మెయిలింగ్‌కు దిగుతున్నారు. దీంతో సైబర్‌గాళ్లు అడిగినంత డబ్బులను అందజేస్తున్నారు.