Kota Student Suicides: 


వరుస ఆత్మహత్యలు..


రాజస్థాన్‌లోని కోటాలో ఆత్మహత్యలు ఆగడం లేదు. ఇంజనీర్లు, డాక్టర్లు కావాలనుకుని కోచింగ్‌కి వెళ్లిన విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఒకరి తరవాత మరొకరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఈ నెల 27న కేవలం నాలుగు గంటల్లోనే ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారంటే...అక్కడి పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 23 మంది ఇలా ప్రాణాలు తీసుకున్నారు. ఓ 17 ఏళ్ల విద్యార్థి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ బిల్డింగ్‌లోని ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మరో విద్యార్థి తన రూమ్‌లోనే ఉరి వేసుకున్నాడు. గతేడాది మొత్తంగా కోటాలో 15 మంది ఆత్మహత్య చేసుకోగా...ఈ సారి ఆ సంఖ్య పెరిగింది. 2022 డిసెంబర్‌లో ఒకే రోజు ముగ్గురు చనిపోయారు. అయితే...కొవిడ్ తరవాత పరిస్థితులు మరీ దిగజారిపోయాయి. ఈ రెండేళ్లలోనే ఆత్మహత్యలు 60% మేర పెరిగాయి. 2019,2020 సంవత్సరాల్లో కోటాలో చేరిన విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. 2017లో 10 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకోగా...2018లో 12 మంది 2021లో 9 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కోటా మెడికల్ కాలేజ్ ఫిజియాట్రీ డిపార్ట్‌మెంట్ ఈ ఆత్మహత్యలపై స్పందించింది. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌ తమ వైఖరి మార్చుకోవాల్సిన అవసరముందని తేల్చి చెప్పింది. అటు తల్లిదండ్రులు కూడా పిల్లలపై ఒత్తిడి చేయొద్దని సూచించింది. 


"ఈ ఏడాది కోటాలో అత్యధిక ఆత్మహత్యలు నమోదయ్యాయి. దాదాపు 20 ఏళ్లుగా ఇక్కడి సమస్యలపై మేం ప్రభుత్వాలకు పలు సూచనలు చేస్తూనే ఉన్నాం. ఎలా పరిష్కరించాలో కూడా సూచిస్తున్నాం. కానీ ఏ ప్రభుత్వమూ లెక్క చేయలేదు. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో విద్యార్థులంతా ఇంట్లోనే ఉన్నారు. తల్లిదండ్రులతో కలిసి ఉన్నారు. అప్పుడు పెద్దగా ఒత్తిడికి గురి కాలేదు. లాక్‌డౌన్‌ పూర్తై అందరూ హాస్టల్స్‌కి వచ్చినప్పటి నుంచి వాళ్లలో ఒత్తిడి పెరిగింది. కొంత మంది 15,16 ఏళ్లకే ఈ కోచింగ్ సెంటర్లలో జాయిన్ అవుతున్నారు. ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపే సమయం ఉండట్లేదు. కోచింగ్ షెడ్యూల్ కారణంగా చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. ఏజ్ క్రైటేరియా ఆధారంగా ఇక్కడ అడ్మిషన్‌లు ఇస్తే మంచిది. లేదంటే విద్యార్థులు చిన్న వయసులోనే ప్రాణాలు తీసుకుంటారు. "


- డాక్టర్ షెకావత్, కోటా మెడికల్ కాలేజ్ 


 ప్రభుత్వ యంత్రాంగంపై తీవ్ర విమర్శలు వస్తున్న క్రమంలోనే అధికారులు రంగంలోకి దిగారు. హాస్టల్స్‌లో చాలా మంది ఫ్యాన్‌కి ఉరి వేసుకుని చనిపోతున్నారని గమనించారు. అందుకే...పాత ఫ్యాన్‌లు తీసేసి స్ప్రింగ్‌ లోడెడ్ ఫ్యాన్స్‌ని ఫిట్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఈ ఫ్యాన్‌కి ఉరి వేసుకోవాలని చూసినా వెంటనే స్ప్రింగ్‌తో సహా కిందకు వస్తుందే తప్ప ఉరి బిగుసుకోదు. అందుకే...ఇక్కడి పీజీలు, హాస్టల్స్‌లో ఈ మెకానిజంతోనే ఫ్యాన్‌లు ఫిట్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఈ ఆదేశాలిచ్చారు. మానసికంగా విద్యార్థులకు ధైర్యం చెప్పడం హాస్టల్స్ విధి అని, వారి భద్రతపైనా బాధ్యత ఉంటుందని తేల్చి చెప్పారు. ఒకవేళ ఈ ఆదేశాలు పాటించకుండా నిర్లక్ష్యం చేస్తే...ఆయా హాస్టల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేకంగా ఓ టీమ్‌ని ఏర్పాటు చేసింది. వీళ్లే ఈ ఫ్యాన్‌లు ఫిట్ చేసే పనులను దగ్గరుండి సమీక్షించనున్నారు. 


Also Read: లివిన్ పార్ట్‌నర్‌ని కుక్కర్‌తో కొట్టి చంపిన ప్రియుడు, వేరే వ్యక్తితో చనువుగా ఉంటోందని హత్య