Korutla Crime News: అమ్మా, నాన్నలు ఇద్దరూ ఓ ఫంక్షన్ కు వెళ్లారు. అక్కా చెల్లెల్లు ఇద్దరే ఇంట్లో ఉన్నారు. రాత్రి ఏం జరిగిందో తెలియదు కాని పెద్ద కూతురు ఇంట్లోనే చనిపోయి ఉంది. అలాగే చిన్న కూతురు తన ప్రియుడితో కలిసి పరార్ అయింది. విషయం గుర్తించిన స్థానికు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బంక దీప్తి ఇంట్లో చనిపోయి ఉంది. ఆమె మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీకి చెందిన బంక శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులు. వీరు 25 ఏళ్ల క్రితమే కోరుట్లకు వచ్చి భీముని దుబ్బలో స్థిరపడ్డారు. ఇటుక బట్టీ వ్యాపారం చేసుకునే శ్రీనివాసరెడ్డి కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమారుడు బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. పెద్ద కూతురు 24 ఏళ్ల దీప్తి పుణెలోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. అలాగే చిన్న కూతురు చందన ఇటీవలే బీటెక్ పూర్తి చేసింది.


సోమవారం రోజు ఉదయం శ్రీనివాస్ రెడ్డి, మాధవి హైదరాబాద్ లోని బంధువుల గృహ ప్రవేశం కార్యక్రమానికి వెళ్లగా... దీప్తి, చందన మాత్రమే ఇంట్లో ఉన్నారు. రాత్రి 10 గంటల వరకు అక్కాచెల్లెల్లు ఇద్దరూ ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. మంగళవారం ఉదయం శ్రీనివాస్ రెడ్డి తన కూతుర్లతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. పెద్ద కూతురు దీప్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో చిన్న కూతురు చందన ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. రెండు మూడు సార్లు ఫోన్ చేసిన ఆయన.. ఎవరూ స్పందించకపోవడంతో భయపడిపోయారు. 


వంటగదిలో బ్రీజర్, వోడ్కా, వెనిగర్


దీంతో పక్కింటి వాళ్లకు ఫోన్ చేసి తమ ఇంట్లోకి వెళ్లి చూడాలని చెప్పారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పక్కింటి మహిళ.. శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లింది. తపులు బయట నుంచి గొళ్లెం పెట్టి ఉండగా.. పిలిస్తే ఎవరూ పలకలేదు. దీంతో తలుపు గొళ్లెం తీసి లోపలికి వెళ్లి చూడగా... పెద్ద కూతురు దీప్తి సోఫాలో పడిపోయి ఉంది. అది చూసి భయపడిన మహిళ స్థానికులందరినీ పిలిచింది. వారంతూ దీప్తిని చూడగా.. అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని మృతురాలి తండ్రి శ్రీనివాస్ తోపాటు పోలీసులకు తెలిపారు. మెట్ పల్లి డీఎస్పీ వంగ రవీందర్ రెడ్డి, సీఐ లక్ష్మీ నారాయణ, ఎస్సై కిరణ్, చిరంజీవి హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈక్రమంలోనే పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వంటగదిలో వోడ్కా, బ్రీజర్, వెనిగర్, నిమ్మకాయలు ఉన్నట్లు తెలిపారు. అయితే అక్కాచెల్లెల్లు అర్ధరాత్రి మద్యం సేవించి ఉంటారేమో అని పోలీసులు భావిస్తున్నారు. 


యువకుడితో వెళ్లిపోయిన చందన


అయితే దీప్తి ఇంట్లో చనిపోయి ఉంటే.. చందన ఎక్కడకు వెళ్లిందనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈక్రమంలోనే ఆమె ఓ యువకుడితో కలిసి లగేజీతో సహా ఉదయం 5 గంటలకు బస్టాండులోని సీసీ టీవీ కెమెరాల్లో కనిపించింది. వీరిద్దరూ కలిసి నిజామాబాద్ వైపు వెళ్లే బస్సు ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ కలిసి పారిపోయేందుకు ప్లాన్ వేసుకొనే దీప్తిని హత్య చేశారా అనే అనుమానిస్తున్నారు. చందన దీప్తి లొకేషన్ ఆధారంగా ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తించారు. దర్యాప్తును కొనసాగిస్తున్నారు.