Rain Deficit In August: దేశంలో వర్షపాతం తగ్గిపోతోంది. దేశవ్యాప్తంగా అత్యంత దయనీయమైన, వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. 1901 నాటి పరిస్థితిని తలపిస్తోంది. 122 ఏళ్లలో ఆగస్టులో వర్షాలు లేక భూములు పొడిబారుతూ అంత్యంత దయనీయ పరిస్థితిని తలపిస్తోంది. ఆగస్టులో దేశవ్యాప్తంగా 33శాతం కంటే ఎక్కువ వర్షపాతం లోటు నమోదు అయ్యే అవకాశం ఉంది. రుతుపవనాల సమయం ఇంకా 20 రోజులు మిగిలి ఉండడంతో వర్షాలు కురిస్తేనే దేశం వర్షాభావ పరిస్థితులను తట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే జూన్-సెప్టెంబర్ వర్షాభావ ముప్పును తీవ్రంగా పెంచే అవకాశం ఉంది. సాధారణంగా ఆగస్టులో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం 241 మి.మీ కురవాల్సి ఉండగా నిన్నటి వరకు 160.3 మి.మీ నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం కంటే 33శాతం తక్కువ.


2005లో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. అప్పుడు సాధారణం కంటే 25% తక్కువగా 191.2మి.మీ వర్షం నమోదైంది. రుతుపవనాలు కొంత కాలం మాత్రమే ఉడడడంతో వర్షపాతం 170-175 మి.మీ కంటే ఎక్కువగా ఉండే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత 120 ఏళ్లలో ఆగస్టులో 30% లేదా అంత కంటే ఎక్కువ వర్షపాతం లోటు నమోదు కావడం ఇదే మొదటిసారి. రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు 9%కి పెరిగింది, జూన్-సెప్టెంబర్ కాలంలో 10% కంటే ఎక్కువ కొరత ఉంటే దానికి కరువు సంవత్సరంగా లెక్కిస్తారు. దీంతో సెప్టెంబరులో రుతుపవనాలపైనే ఆసక్తి నెలకొంది. ఈ రుతుపవనాల ద్వారా కనీసం భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం పెరుగుతుందని వాతావరణ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


వాతావరణ నిపుణులు మాట్లాడుతూ.. ఉత్తర బంగాళాఖాతంలో తుఫాను సర్క్యులేషన్ ఏర్పడే అవకాశం ఉందని, సెప్టెంబర్ 2 నుంచి అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు. దీని ఫలితంగా తూర్పు, మధ్య, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో వర్షపాతం సరిగా లేకపోవడంతో, జూలై లేదా ఆగస్టులో రుతుపవనాలు సాధారణం కంటే 30%, అంతకంటే ఎక్కువ లోటు ఉండటం 105 ఏళ్లలో ఇది రెండోసారి అన్నారు. 2002లో జూలైలో 50.6శాతం లోటు నమోదు అయిందని, జూలై, ఆగస్టు నెలలు వ్యవసాయానికి అత్యంత కీలకమైనవని చెప్పారు.


ఇక్కడో ఆసక్తికర విషయం ఏంటంటే జూలైలో 315.9 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది, సాధారణం కంటే 13శాతం అధికం, గత 18 ఏళ్లలో జులై నెలలో రెండోసారి అత్యధిక వర్షపాతం నమోదైంది. ఆగస్టులో హిందూ మహాసముద్ర ద్విధ్రువం (IOD) ఆశించిన విధంగా సానుకూలంగా లేకపోవడంతో ఎల్ నినో ప్రారంభమైంది. మాడెన్-జూలియన్ ఆసిలేషన్ (MJO) కూడా ఆగస్టులో అనుకూలంగా లేకపోవడంతో వర్షాలు కురవలేదు. ఈ మధ్య కాలంలో దక్షిణ చైనా సాధారణ నాలుగు-ఐదు తుపానులకు రాగా మనకు కేవలం రెండు తుఫానులు వచ్చాయి. ఇవి బంగాళాఖాతంలో ప్రభావం చూపడం ద్వారా భారతదేశంలో వర్షపాతాన్ని పెంచుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు.  


సెప్టెంబరులో వర్షపాతం ఆగస్టులో కంటే మెరుగ్గా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో అల్పపీడన వ్యవస్థ ఏర్పడవచ్చని వాతావరణ శాఖ అంచానా వేస్తున్నా.. ఇది కేవలం మధ్య భారతదేశంలోనే ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో రుతుపవనాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉందని, ఎల్‌నినో పాత్రను కొనసాగిస్తుందని అంచనా వేస్తున్నారు. 5 శాతం- 8 శాతం మధ్యస్థ లోటుతో నెల ముగిస్తే, ఈ సీజన్ లోటు వర్షపాతం లేకుండా ముగుస్తుందని భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆగస్ట్‌లో 20 విరామ రోజులు ఉన్నాయని తెలిపారు.