క్లాసులో బాలికల పట్ల వెకిలి చేష్టలకు పాల్పడుతున్న ఓ ప్రైవేటు స్కూ్ల్ టీచర్ అడ్డంగా దొరికిపోయాడు. దీంతో పోలీసులు అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఓ మైనర్‌ బాలికకు అసభ్యకరంగా మెసేజ్‌లు పంపించినట్లుగా అతనిపై ఫిర్యాదు నమోదైంది. రాచకొండ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జగిత్యాల్‌కు చెందిన రేగొండ వెంకట సాయి అనే 31 ఏళ్ల  ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. విద్యార్థినుల ఫోన్‌ నంబర్లను సేకరించి ప్రతి రోజూ వాళ్లతో చాటింగ్‌ చేసేవాడు. అతని అసభ్య ప్రవర్తన స్కూలు మేనేజ్ మెంట్ దృష్టికి రావటంతో అతన్ని ఉద్యోగంలో నుంచి కూడా తొలగించారు.  


దీంతో వెంకట సాయి తన ఫోన్‌లో సాంకేతికత సాయంతో ఓ గుర్తు తెలియని వ్యక్తిగా మైనర్‌ బాలికకు మెసేజ్‌లు చేయడం మొదలు ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా ప్రేమిస్తున్నాని చెప్పడంతో అప్పటి నుంచి సదరు బాలిక సమాధానం ఇవ్వటం మానేసింది. దీంతో కక్ష గట్టిన వెంకటసాయి సదరు బాలికతో పాటు ఆమె తల్లికి నగ్న ఫొటోలు, వీడియోలను పంపించాడు. దీంతో వెంటనే బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళవారం వెంకటసాయిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.


బాలిక శరీరంపై పంటి గాట్లు.. ఆరా తీస్తే..
మరో ఘటనలో మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం అతణ్ని పోలీసులకు అప్పగించారు. పంజాగుట్ట పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. జహీరాబాద్‌కు చెందిన మహ్మద్‌ మోహిజ్‌ అనే 20 ఏళ్ల వ్యక్తి ఎమ్‌ఎస్‌ మక్తాలో నివాసం ఉండే తన సోదరి ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అక్కడే ఉంటూ వెల్డింగ్ పని చేస్తున్నాడు. అయితే, ఇతను అద్దెకు ఉండే పోర్షన్ పక్కనే మరో కుటుంబం కూడా అద్దెకు ఉంటోంది.


ఆ కుటుంబంలో 13 ఏళ్ల బాలికను ఇతను రోజూ రాత్రి పూట బిల్డింగ్ పైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. మంగళవారం బాలిక ఒంటిపై పంటిగాట్లు ఉన్న విషయం కుటుంబసభ్యులు గమనించారు. ఆమెను నిలదీయగా.. మహ్మద్‌ మోహిజ్‌ రోజూ తనపై అత్యాచారం చేస్తున్నాడని చెప్పింది. దీంతో కుటుంబసభ్యులు మోహిజ్‌ను పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.