Cyber Crime : అమెరికాలోని తెలుగు వారికి సైబర్ కష్టాలు తప్పట్లేదు. అమెరికాలో ఉంటున్న హైదరాబాద్ వాసులను టార్గెట్ చేస్తూ వారి నుంచి రూ. లక్షలు కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. రకరకాల ప్రయత్నాలు చేసి డబ్బులు గుంజుతున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో చొరబడి పర్సనల్ సమాచారాన్ని సేకరించి దిల్లీలో ఉన్న నేరగాళ్లకు ఇస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. వాట్సాప్ గ్రూప్ లో ఉన్న వ్యక్తులకు  నేరగాళ్లు కాల్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. అమెరికాలో విద్య, ఉద్యోగం చేస్తున్న తెలుగు వారు వాట్సాప్ గ్రూపులు నిర్వహిస్తుంటారు. తెలిసిన వారి ద్వారా ఆయా గ్రూపుల్లో యాడ్ అవుతున్న కొందరు వ్యక్తులు గ్రూపులోని యువతుల ఫోన్ నంబర్లను సేకరిస్తారు. ట్రూకాలర్ ద్వారా వారి పేరును గుర్తించి దాని ద్వారా ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఐడీలను సేకరిస్తున్నారు. వీటితో పాటు వారి ఫొటోలు, ప్రొఫైల్ లో ఉన్న మరికొందరి ఫొటోలు, పేర్లను తెలుసుకుంటున్నారు. ఈ సమాచారాన్ని దిల్లీకి చెందిన సైబర్ నేరగాళ్లకు అందజేస్తున్నారు. 


రుణం పేరిట వేధింపులు 


ప్రముఖ బ్యాంకుల పేర్లు చెబుతూ, లీగల్, రికవరీ టీం సభ్యులుగా పరిచయం చేసుకుంటారు. తమ బ్యాంకులో రుణం తీసుకుని దాన్ని కట్టకుండా పారిపోయారని, ఒక్క రోజులో రుణాన్ని చెల్లించకపోతే తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ హెచ్చరిస్తారు. ఒకవేళ డబ్బు చెల్లించకపోతే పూర్తి బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని భయపెడుతున్నారు. ఇదే క్రమంలో వారి స్నేహితులకు ఫోన్ చేసి ఫలానా వ్యక్తి రుణం తీసుకున్నారు. రిఫరెన్స్ కింద మీ పేరు ఇచ్చారు. ఆమె కడుతుందా? లేక మీరు చెల్లిస్తారా? అంటూ వేధిస్తారు. వారి ఒత్తిడి తట్టుకోలేక కొందరు డబ్బు కట్టేస్తే సరిపోతుందిలే కదా అంటూ నేరగాళ్లకు పంపినట్లు కూడా పోలీసులు గుర్తించారు. మరికొన్ని సందర్భాల్లో  డబ్బు కట్టాలని అడిగితే తాము నేరుగా దిల్లీలోని హెడ్ ఆఫీస్ కి రావాలంటూ చెబుతారు. ఒక లక్ష కట్టడానికి రూ.3 లక్షలు ఎయిర్ టికెట్ తీసుకుని దిల్లీకి రావడం సాధ్యమైన పనికాదని అమెరికా నుంచి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తామని అంటారు. ఈ విధంగా మోడస్ ఓపెరండి చేస్తూ డబ్బులు దోచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.


అప్రమత్తంగా ఉండండి


అమీర్ పేట చెందిన ఓ యువతి అమెరికాలో ఉద్యోగం చేస్తుంది. ఆమెకు ఇటీవల దిల్లీ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి రుణం కట్టాలని తీవ్ర ఒత్తిడి చేశాడు. ఆమె ఈ తతంగాన్ని మెయిల్ ద్వారా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ ప్రసాద్ తెలిపారు. ఈ మధ్య కాలంలో చోటుచేసుకుంటున్న ఇటువంటి సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని యూఎస్ లో నివాసం ఉంటున్న పిల్లలు, స్నేహితులు, బంధువులు ఇటువంటి ఫోన్ కాల్స్, మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. 


వాట్సాప్ అడ్మిన్లు జర జాగ్రత్త


వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. ఏమాత్రం అలసత్వం వహించిన గ్రూప్ మెంబెర్స్ డేటా అంతా నేరస్థులకు చేరుతుందని తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసుల సూచించారు. అమెరికాలోని ఎన్ఆర్ఐలకు కూడా సైబర్ మోసాలు తప్పడం లేదని వివరించారు. అమెరికాకి చెందిన వాట్సప్ గ్రూప్స్ నుంచి సైబర్ నేరస్థులు డేటాను సేకరిస్తున్నారని చెప్పారు. అలా సేకరించిన డేటా ఆధారంగా ఓ ఎన్ఆర్ఐ మహిళను బెదిరించినట్లు తెలిపారు. లక్ష రూపాయల లోన్ కట్టాలని తీవ్ర వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఆమె స్నేహితులను కూడా వేధించినట్లు వివరించారు. నేరుగా ఇండియా నోయిడాలోని బ్యాంక్ కి వచ్చి సెటిల్ చేసుకోవాలంటూ.. వేదించినట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే చాలామంది ఎన్ఆర్ఐలు లక్షల రూపాయలు చీటర్స్ చేతిలో మోసపోయినట్లు గుర్తించారు. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.