Hyderabad Crime News: ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలకు విలువ తగ్గిపోతుంది. ముఖ్యంగా అమ్మాయిలు, మహిళలపై వేధింపులు మరింత పెరిగిపోయాయి. కనిపించిన అమ్మాయి వెంటపడడం, కోరిక తీర్చమనడం లేదంటే బెదిరింపులకు పాల్పడడం షరా మామూలు అయింది. అయితే ఇలాంటి బెదిరింపులే ఓ టీవీ యాంకర్ కు ఎదురయ్యాయి. తన కోరిక తీర్చాలని లేకపోతే మార్ఫింగ్ చేసిన అమ్మాయి నగ్న ఫొటోలను సామాజిక మాద్యమాల్లో పెడతానంటూ ఓ యువకుడు వేధింపులకు గురి చేశాడు. గతంలో కూడా ఓసారి ఇదే అబ్బాయి సదరు యాంకర్ పై అత్యాచారయత్నం చేశాడు. గతంలో భయంతో యువతి ఏమీ చేయలేకపోయినా ఈసారి ధైర్యంగా పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


గతంలో అత్యాచారం చేయబోయిన సామ్రాట్..


అయితే పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని మధురానగర్ లోని ఓ హాస్టల్ లో ఉంటున్న 27 ఏళ్ల యువతి యాంకర్ గా పని చేస్తోంది. అయితే కూకట్ పల్లికి చెందిన 30 ఏళ్ల సామ్రాట్ తో స్నేహం ఉంది. గతంలో కళాశాలలో చదివే రోజుల్లో వీరిద్దరూ సహ విద్యార్థులు. మొదటి నుంచి సామ్రాట్ తనను ప్రేమిస్తున్నానని చెబుతున్నాడు. అమె మాత్రం అందుకు నిరాకరించింది. ఈ క్రమంలోనే స్నేహితుల్లా కలిసుందామని చెప్పడంతో యువతి ఓకే చెప్పింది. ఇలాగే మాయమాటలు చెప్పిన సామ్రాట్ గతంలో ఓసారి కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అత్యాచారం చేయబోయాడు. ఎలాగోలా యువతి అతడి బారి నుంచి తప్పించుకుంది. 


అప్పటి నుంచి సామ్రాట్ సదరు యాంకర్ పై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలుగా మార్చాడు. తన కోరిక తీర్చకపోతే వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టి పరువు తీస్తానని బెరిదిస్తున్నాడు. ఇవన్నీ భరించలేని యువతి ధైర్యం చేసి ఎస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


చిన్నారిపై బాబాయ్ లు అత్యాచారం, చివరకు హత్య!


మృగాళ్ల చేతిలో నిత్యం ఆడబిడ్డల బతుకులు తెల్లారిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మృగం వరసకు కూతురు అయ్యే చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. మరో ఇద్దరు కూడా బాలికపై దారుణానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అత్యంత దారుణంగా హత్యచేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగి ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని ఓ గ్రామంలో పదో తరగతి బాలికపై సొంత బాబాయ్ మరో ఇద్దరితో కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలికను హత్య చేశారు. బాలిక తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్‌ కు వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. దీంతో బాలికపై కన్నేసిన బాబాయ్ శ్రీనివాస్ తన స్నేహితులతో కలిసి బాలికపై దారుణానికి పాల్పడ్డాడు. బాలిక ప్రతిఘటించడంతో హత్య చేసి పరారయ్యారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  


గ్రామంలో ఉద్రిక్తత 


వారంతా వరుసకు బాబాయ్‌లు, అయినా ఆ చిన్నారిని వదల్లేదు. చిన్నారిపై దారుణానికి పాల్పడేందుకు సమయం కోసం ఎదురు చూశారు. బాబాయ్‌ అంటూ వచ్చిన ఆ చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. తమ కోరిక తీర్చుకుని అతి కిరాతకంగా హత్య చేశారు. వరుసకు బాబాయ్‌ లు అయినా ఇంత కిరాతకానికి ఒడిగట్టడం, ఆ తర్వాత విషయం బయటచెబుతుందని చిన్నారిని హత్య చేశారు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని గ్రామస్థులను నమ్మించేందుకు ప్రయత్నించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రహంతో గ్రామస్తులు నిందితుల ఇంటిపై దాడి చేశారు. వారి వాహనాలు, ఇంట్లో సామాగ్రికి నిప్పుపెట్టారు.