Honey-trapped DRDL Employee Arrested : హాయ్... నేను నటాషా అంటూ మాట కలిపింది. తెలివిగా కీలక సమాచారం రాబట్టింది. హానీ ట్రాపింగ్‌తో రక్షణ రహస్యాలు కొల్లగొడుతున్న శుత్రుదేశాలకు హైదరాబాద్ నుంచి మరో టార్గెట్ దొరికింది. 


రక్షణ రహస్యాలు రాబట్టడానికి శత్రుదేశాలు కొత్త పద్దతులు అవలంబిస్తున్నాయి. హనీ ట్రాపింగ్‌ (Honey trapping)తో ఈ మధ్య కొంతమంది ఉద్యోగులను లోబరుచుకోవడం చూస్తున్నాం. తాజాగా హైదరాబాద్ డీఆర్‌డీఎల్ (Defence Research and Development Laboratory) ఉద్యోగి ఒకరు ఈ వలపు వలకు చిక్కారు. కీలక సమాచారాన్ని బయట వ్యక్తులకు చేరవేసిన ఆరోపణలపై బాలాపూర్‌లోని DRDL- RCI కాంప్లెక్సుకు చెందిన ఒప్పంద ఉద్యోగి మల్లిఖార్జున రెడ్డిని రాచకొండ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ పోలీసులు అరెస్టు చేశారు. 
ఫేస్‌బుక్ లో పలకరింపు 
రెండు రోజుల కిందట జరిగిన ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు తెలిపారు. రక్షణ రంగానికి చెందిన కీలక సమాచారం లీక్ అవుతోందన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో... DRDL ఉద్యోగులు జరిగిన తప్పిదాన్ని గుర్తించారు. వారి ఫిర్యాదుపై అక్కడ ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్న దుక్కా మల్లిఖార్జున రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై IPC 409, అధికార రహస్యాల చట్టంలోని సెక్షన్ ౩(1)c, 5(3), 5(1)A కింద కేసులు నమోదు చేశారు. విశాఖ నగరంలోని సుజాత నగర్‌కు చెందిన మల్లిఖార్జునరెడ్డికి  ఇంజనీరింగ్ పూర్తి చేశారు.


రిక్వెస్ట్ చేసి జాబ్‌ కొనసాగింపు.. కానీ !
కొన్నాళ్లు విశాఖలో పనిచేసిన అతను .. ఆ తర్వాత పటాన్‌చెరులోని ది క్వెస్ట్ అనే సంస్థలో పనిచేశాడు. ఆ సంస్థ డీఆర్‌డీఎల్ లోని ఓ ప్రాజెక్టును ఔట్ సోర్సింగ్ విధానంలో చేపట్టింది. 2020 జనవరిలో ఆ ప్రాజెక్టు పూర్తవడంతో అప్పటి వరకూ ఆ సంస్థ తరపున పనిచేసిన మల్లిఖార్జున రెడ్డి DRDL ఉద్యోగులను అభ్యర్థించి...ఔట్ సోర్సింగ్ ఇంజనీర్ గా చేరాడు. ప్రాజెక్టులో మొదటి నుంచి పనిచేస్తుండటంతో చాలా ప్రాంతాలకు అతనికి అనుమతి ఉండేది. అయితే మల్లిఖార్జున్ తన Facebook  అకౌంట్‌లో డీఆర్‌డీఎల్‌లో పనిచేస్తున్నట్లు రాసుకోవడంతో అతనిపై ట్రాపింగ్ మొదలైంది. 
కీలక సమాచారం లీక్
నటాషారావు అనే ఫేక్ ప్రొఫైల్ తో ముందుగా పలకరింపు ప్రారంభమైంది. తనను తాను U.K కేంద్రంగా పనిచేసే ఒక డిఫెన్స్ జర్నల్ జర్నలిస్టుగా పరిచయం చేసుకున్న నటాషా... మల్లిఖార్జున్ నుంచి సమాచారాన్ని ఏడాది పాటు రాబట్టింది. DRDL లో ముఖ్యమైన ప్రాజెక్టులలో పనిచేస్తుండటంతో మల్లిఖార్జున్ వద్ద కాస్త కీలకమైన సమాచారమే ఉంది. దేశానికి సంబంధించిన ముఖ్యమైన క్షిపణి సాంకేతికక బయటకు పొక్కినట్లుగా సమాచారం ఉంది. ప్రాజెక్టు ఇంజనీర్ గా కీలకమైన సైట్ లను సందర్శంచే వీలుండటంతో కొన్ని ముఖ్యమైన అంశాలపై మల్లిఖార్జునకు అవగాహన ఉంది. నటాషా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి... మెల్లిగా సమాచారం మొత్తం లాగేసింది. అమ్మాయి మత్తులో మల్లిఖార్జున్ కీలక సమాచారం చేరవేశాడు.  నటాషారావు అనే ఫేక్ ప్రొఫైల్ పాకిస్థాన్  ఆపరేటివ్‌గా గుర్తించారు. 


గడచిన 10 ఏళ్లలో.. డిఫెన్స్ రహస్యాలను చేధించడానికి  పెద్ద సంఖ్యలో హానీట్రాపింగ్ ప్రయత్నాలు జరిగాయి. పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. 2020లో హనీ ట్రాపింగ్ లో చిక్కుకున్న 11మంది నౌకాదళ ఉద్యోగులను గుర్తించింది. 
Also Read: Secunderabad Protest : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసు, ప్రధాన సూత్రధారి అతడే


Also Read: Fake Gold: తక్కువ ధరకే బంగారం, మత్తులోకి జారుకున్నాక కిలాడీ దంపతులు జంప్ - చివరికి ఏమైందంటే !