Warangal Accident Video: వరంగల్‌లో ఓ పోలీస్ కొడుకు అతివేగంతో కారు నడుపుతూ ఓ మహిళ చనిపోయేందుకు కారణం అయ్యాడు. నిందితుడు వంశీ అని పోలీసులు గుర్తించారు. ఇతను ఎక్సైజ్ సీఐ కుమారుడు. హన్మకొండ జిల్లాలోని కాజీపేట కేంద్రంలో ఈ ప్రమాద ఘటన జరిగింది. స్థానిక  సెయింట్‌ గ్యాబ్రియల్‌ స్కూల్‌ దగ్గర కవిత అనే మహిళ బైక్ ఎక్కబోతుండగా, స్విఫ్ట్ డిజైర్ కారు అతి వేగంతో దూసుకొచ్చి కవితను గుద్దేసింది. కారు నెంబరు TS 03 FA 9881 అని పోలీసులు తెలిపారు.


ఓటు వేయడం కోసం దంపతులు ఆ ప్రాంతానికి వచ్చి తిరిగి బైక్ పై వెళ్లాలని ప్రయత్నించగా  ఈ ప్రమాదం జరిగింది. నిందితుడు తన కారును రాంగ్‌ సైడ్‌లో ఓ బైక్‌ను ఓవర్‌ టేక్‌ చేయబోయినట్లుగా సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన వీడియోను బట్టి తెలుస్తుంది. అదే సమయంలో రోడ్డు పక్కనే తన భర్త బైక్ ఎక్కబోతున్న కవితను కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది.