CEO Vikas Raj Comments on Telangana Assembly Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. గురువారం జరిగిన పోలింగ్ కు సంబంధించి శుక్రవారం హైదరాబాద్ లోని మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 70.74 శాతం పోలింగ్ నమోదైందని, 2018 (73.37%)తో పోలిస్తే ఇది 3 శాతం తక్కువని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.03 శాతం, హైదరాబాద్ లో అత్యల్పంగా 46.56 శాతం పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. నియోజకవర్గాల వారీగా చూస్తే మునుగోడులో అత్యధికంగా 91.5 శాతం, యాకుత్ పురాలో 39.6 శాతం పోలింగ్ నమోదైందని వివరించారు. చాలా చోట్ల రాత్రి 9:30 వరకూ ఓటింగ్ ప్రక్రియ సాగినట్లు వివరించారు. 


'49 కౌంటింగ్ కేంద్రాలు'


డిసెంబర్ 3న జరగబోయే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం జిల్లా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని వికాస్ రాజ్ వెల్లడించారు. మొత్తం 49  కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని వివరించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారని, ఉదయం 8:30 గంటల నుంచి ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని చెప్పారు. 


'రీపోలింగ్ కు నో ఛాన్స్'


'రాష్ట్రంలోని 79 నియోజకవర్గాల్లో 75 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. ఓట్ ఫ్రం హోం మంచి ఫలితాన్ని ఇచ్చింది. తెలంగాణలో ఎక్కడా రీపోలింగ్ కు అవకాశమే లేదు.' అని సీఈవో వికాస్ రాజ్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో 1.80 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని, 80 ఏళ్లు పైబడిన వారికి ఓట్ ఫ్రం హోం అవకాశం ఇచ్చామని వివరించారు. ఎన్నికల కోసం 2 లక్షల కంటే ఎక్కువ మంది సిబ్బంది కష్టపడ్డారని చెప్పారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. 18 - 19 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఓటర్లు 3.06 శాతం ఉన్నట్లు పేర్కొన్నారు. థర్డ్ జెండర్స్ కూడా ఎక్కువ సంఖ్యలో ఓటు వేశారని చెప్పారు. 27,094 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, 7,591 కేంద్రాల వెలుపల సీసీ టీవీ సదుపాయం కల్పించినట్లు వివరించారు. 


స్ట్రాంగ్ రూంల వద్ద భారీ భద్రత


స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ టీవీ కెమెరాలతో పాటు భారీ భద్రత కల్పించినట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఆయా ప్రాంతాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని, ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే వరకూ ఆయా గదుల వద్ద ఆంక్షలు విధించినట్లు చెప్పారు. 40 కంపెనీల కేంద్ర బలగాలు భద్రత విధుల్లో ఉన్నట్లు వివరించారు. లెక్కింపు కేంద్రాల్లో 1,766 లెక్కింపు టేబుళ్లు, 131 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి టేబుల్‌పై మైక్రో అబ్జర్వర్, ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారని చెప్పారు. ప్రలోభాలు, ఉల్లంఘనలకు సంబంధించి గతం కంటే ఈసారి ఎక్కువ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. 2018లో 2,400 కేసులు ఉంటే.. ఇప్పుడు 13,000 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. కొందరు మంత్రులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసినట్లు వికాస్‌రాజ్‌ తెలిపారు.


Also Read: KTR Tweet: 'చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్రపోయా' - అసలైన ఫలితాలు శుభవార్త ఇస్తాయంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్