రోజు కూలి పనులు చేసుకుని జీవనం సాగించే కూలీలపై మాయలేడి కన్నుపడింది. తన వద్ద ఉన్న డాలర్లు మారితే రూ.10 వేల పెట్టుబడికి రూ.లక్ష ఇస్తానంటూ మాయమాటలు చెప్పింది. అలా 60 లక్షల వరకు వసూలు చేసింది.‌ అత్యాశకు పోయి అప్పులు చేసి మరీ ఇచ్చి మోసపోయామని తెలియడంతో బాధితులు లబోదిబో అంటున్నారు. గుంటూరు జిల్లాలో ఈ మోసం వెలుగు చూసింది. 


పిడుగురాళ్ల పట్టణంలోని లెనిన్ నగర్ చెందిన మరియమ్మ అనే మహిళకు పేరేచర్ల గ్రామానికి చెందిన షేక్ నబి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఇదే అదునుగా భావించిన షేక్ నబి తన వద్ద డాలర్లు ఉన్నాయని అది మార్చడానికి కొంత నగదు కావాలని మరియమ్మకు చెప్పింది. డాలర్లు మారిన వెంటనే రూ.10 వేలు ఇచ్చిన వారికి రూ.లక్ష రూపాయలు చెల్లిస్తాను అంటూ నమ్మపలికింది.‌‌‌ నిజమని భావించిన మరియమ్మ ఆశతో తన వద్ద ఉన్న నగదు, వడ్డీకి మరికొంత‌సొమ్ము మొత్తం రూ.పది లక్షలు మాయాలేడి నబికి ఇచ్చింది. మరికొంత నగదు కూడా సర్దుబాటు చేస్తే తన వద్ద ఉన్న మొత్తం డాలర్లు మార్చవచ్చని మరియమ్మకు చెప్పి నమ్మించింది. 


మరియమ్మ తనకు తెలిసిన బంధువులు, తుమ్మలచెరువు, బ్రాహ్మణపల్లి, పిల్లుట్ల గ్రామాలలో‌ తనకు పరిచయం ఉన్న వారికి విషయం తెలిపింది. అత్యాశకుపోయి వారు కూడా మాయలేడి నబి ఉచ్చులో పడ్డారు. ఇలా 300 మందికి పైగా నబికి సుమారు రూ.60 లక్షల వరకు అప్పగించినట్లు బాధితులు తెలిపారు. డబ్బులు తీసుకున్న తర్వాత‌ ఇవాళ రేపు అంటూ నెలలు గడపడంతో బాధితులు మోసపోయామని గ్రహించారు. మాయలేడి మకాం మార్చి ఎక్కడకో వెళ్ళిపోవడంతో బాధితులు లబోదిబోమన్నారు. మూడు రోజుల క్రితం నబి పిడుగురాళ్ళ పట్టణానికి వచ్చింది. 


ఈ సంగతి తెలిసి మరియమ్మతోపాటు బాధితులంతా నబిని నిలదీశాడు. డాలర్ల విషయం అందరికీ చెప్పారని అందువల్ల డాలర్లు ఎక్స్‌ఛేంజ్ చేసుకొనే‌ వారు తీసుకోవడం లేదని అందుకు కారణం మీరే అంటూ మాయలేడి నబి బాధితులపై రివర్స్‌ ఎటాక్ చేసింది. మీకు నేను నయాపైసా కూడా ఇవ్వను మీకు చేతనైనది చేసుకోండని బాధితులను బెదిరించింది. దిక్కుతోచని స్థితిలో బాధితులు పట్టణ పోలీసులను ఆశ్రయించారు. పట్టణ సీఐ మధుసూదన్ రావు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.