Vizag Crime News :   విశాఖలో  మత్తు వ్యసనాలకు అలవాటు పడిన వారు చేస్తున్న నేరాలకూ అంతే ఉండటం లేదు. నిన్నా మొన్నటి వరకూ మద్యం , గంజాయి మత్తులో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేవారు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్లే అమాయకులైన వృద్ధులనూ వదిలి పెట్టడం లేదు. చచ్చేదాకా కొడుతున్నారు. తాజాగా ఓ వృద్ధుడ్ని గంజాయి, మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి  కొొట్టి చంపేశాడు. 74 ఏళ్ల వయసున్న ఆయనకు ఆ తాగుబోతుతో ఎలాంటి శత్రుత్వం లేదు. కనీసం పరిచయం కూడా ఉండదు. కానీ  బయం లేని తనం.. తాము మనుషుల్ని నడిరోడ్డుపై చంపినా ఎవరూ ఏమీ చే్యలేరనే అభిప్రాయంతో లెక్కలేని తనం వారిలో పెరిగిపోవడం కారణంగా ఆ సమయంలో ఎదురుగా కనిపించిన వృద్ధుడ్ని కొట్టి చంపేశాడు. 


వ్యక్తిగత పనులపై బయటకు వచ్చిన వృద్ధుడు 
 
వైజాగ్ లోని కైలాసపురం సమీపంలోగల లక్ష్మీ నారాయణ పురం లో ఉండే నారాయణ రావు అనే వృద్ధుడి ఇల్లు ఉంది. 74ఏళ్లు వచ్చినా ఆయన  తన పనులు తాను చేసుకోవడమే కాదు .. కుటుంబ అవసరాలూ చూస్తూంటారు. ఈ క్రమంలో  ఓ పని మీద ఇంటి నుంచి బయటకు వచ్చిన నారాయణరావుకు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఎవరో తాగబోతు ఎదురొచ్చాడు.  అకారణంగా ఆయనపై దాడికి దిగి పిడిగుద్దులు కురిపించాడు . అకస్మాత్తుగా ఎదురైన ఈ ఘటన తో షాక్ కు గురైన నారాయణ రావు అక్కడికక్కడే కూలిపోయి గుండెపోటుతో మృతి చెందాడు . 


నిస్సహాయంగా కనిపించాడని దాడి చేసి కొట్టిన రౌడీషీటర్ అనుచరుడు 


స్థానికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే వృద్ధుడు చనిపోయాడు. ఆ సైకో తానేదో గొప్ప పని చేసినట్లుగా వ్యవహరించడం ప్రారంభించాడు. కాసేపటికి తేరుకున్న స్థానికులు ఆ దుండగుడ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు . మృతి చెందిన వ్యక్తి విశాఖకు చెందిన సీనియర్ పాత్రికేయులు ఎన్ . నాగేశ్వర రావు తండ్రి . కాగా ఆయనపై దాడి చేసిన వ్యక్తిని ఒక రౌడీ షీటర్ కు అనుచరుడు గా గుర్తించారు . అతనిపై గతంలో రెండు కేసులు ఉన్నట్టు తెలుస్తోంది.  చనిపోయిన వృద్ధుడు సీనియర్ జర్నలిస్టు తండ్రి కావడంతో  ఉద్దేశపూర్వకంగా ఏమైనా చే్శారా అన్న అంశంపైనా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.  


వైజాగ్‌లో పెరిగిపోతున్న గంజాయి, మద్యం మత్తులో సైకోల  నేరాలు
 


ఇటీవలి కాలం లో నగరం లో మత్తు పదార్దాల కారణం గా నేరాలు పెరిగిపోతున్నాయన్న విమర్శలు వైజాగ్ లో  ఎక్కువగా వినిపిస్తున్నాయి. వరుస ఘటనలు జరుగుతూండటమే దీని కి కారణం. విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు, రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నా పోలీసులు వారిని కంట్రోల్ చేయడానికి శ్రద్ధ చూపకపోతూండటం వంటి కారణాలతో నేరాలు పెరిగిపోతున్నాయి. తాము కఠినమైన చర్యలుతీసుకుంటున్నామని పోలీసులు  చెబుతున్నా ఇలాంటి నేరాల  సంఖ్య మాత్రం తగ్గడం లేదు . దీనితో పోలీస్ శాఖపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఉక్కుపాదం తో గంజాయి ,మద్యం మత్తులో జరుగుతున్న నేరాలను అణిచివేయాలని ప్రజల నుండి డిమాండ్ వస్తోంది.