పార్ట్‌టైమ్‌ జాబ్‌ కోసం సోషల్‌ మీడియాలో వెతుకుతున్నారా..? అయితే బీకేర్‌ ఫుల్‌. సైబర్‌ నేరగాళ్లు పొంచే ఉంటారు. యూట్యూబ్‌ వీడియోలకు లైక్‌, సబ్‌స్క్రైబ్‌ చేస్తే చాలు కమిషన్‌ ఇస్తామంటారు. రివ్యూలు రాస్తే డబ్బు జమ చేస్తామంటారు. లింకులు పంపుతారు. నిజమని నమ్మి.. ఆ లింకులు క్లిక్‌ చేశారో... వారి వలలో పడినట్టే. జాబ్‌ సంగతి ఏమో గానీ... ఆ సాకుతో... నిలువునా దోచేస్తారు. అప్రమత్తంగా లేకపోతే.. అంతే సంగతలు అంటున్నారు విశాఖ పోలీసులు. ఇష్టం వచ్చినట్టు ఏ లింకునంటే ఆ లింకులు క్లిక్‌ చేయొద్దని సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల మోసాలకు విశాఖ పోలీసులు అడ్డుకట్ట వేశారు. టాస్క్ గేమ్స్ పేరిట ప్రలోభాలకు గురిచేసి మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు. వారు నేరం చేసిన తీరును ప్రజలకు వివరించారు. 


ఇటీవల ఉద్యోగ అవకాశాలు కల్పించే ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో పేర్లు రిజిస్టర్ చేసుకొని పార్టాా టైం జాబ్స్‌ కోసం చాలా మంది వెతుకుతున్నారు. అలాంటి వారినే ఎక్కువగా టార్గెట్‌ చేసింది సైబర్‌ గ్యాంగ్‌. పార్ట్ టైమ్‌ జాబ్ పేరుతో లింకులు పంపి మోసం చేసింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు గూగుల్‌లో పార్ట్ టైం జాబ్ పేరుతో ఒక లింక్‌ని వుంచుతారు. లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత.... అది నేరుగా వాట్సప్ అకౌంటుకి కనెక్టయ్యి ఒక మెసేజ్‌ వస్తుంది. అందులో అమెజాన్‌లో అమ్మకానికి పెట్టే వస్తువుల లిస్ట్‌ ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఆర్డర్స్ పెంచడమే ఈ జాబ్ ఉద్దేశమని ఉంటుంది. చిన్న టాస్క్‌లని పూర్తి చేసినా మంచి కమిషన్ పొందవచ్చనని చెప్తారు. అందుకు మొబైల్‌ గానీ కంప్యూటర్ గానీ ఉంటే చాలంటారు.


నిజమని నమ్మి మొబైల్ నెంబర్‌ రిజిస్టర్‌ ఇచ్చారో... ఇక వారి గేమ్‌ మొదలైనట్టే. జాబ్ ప్రాసెస్ కోసం టెలీగ్రామ్‌ అకౌంటు లింకుని పంపి రిజిస్టర్ చేసుకోమని చెప్తారు. ఆ తర్వాత కొన్ని టాస్క్‌ ఇచ్చి.. వాటి కోసం కొంత రీచార్జ్‌ అమౌంట్‌ కట్టమంటారు. టాస్క్‌ పూర్తి చేస్తే... కమిషన్‌తో కలిసి రీఛార్జ్‌ అమౌంట్‌ కూడా కలిపి వేస్తామంటారు. ఆశ పడి రీఛార్జ్‌ చేయించుకున్నాక ఫస్ట, సెకండ్‌ లెవెల్‌లో డబ్బును కమీషన్‌తోపాటుగా విత్ డ్రా చేసుకునే సౌకర్యం కలిపిస్తారు. ఆ తర్వాత నుంచి వారి గేమ్‌ మొదలవుతుంది. రీఛార్జ్‌ చేసుకున్న మొత్తంతో పాటు కమిషన్‌ని కలిపి టోటల్ అమౌంట్‌ ఫ్రీజ్‌లో ఉన్నట్టు చూపిస్తారు. అది విత్‌డ్రా చేసుకోవాలంటే.. మళ్లీ మళ్లీ రీఛార్జ్‌ చేసేలా చేస్తాలా ప్రేరేపిస్తారు. బాధితుడ్ని నిండా ముంచేస్తారు. 



సైబర్ నేరగాళ్లు ముందుగా... సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ అయిన వాట్సాప్‌, టెలిగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ పేరుతో మెసేజ్‌లు, ప్రకటనలు పెడుతూ అమాయక ప్రజలకు వల విసురుతున్నారని పోలీసులు తెలిపారు. మెసేజ్‌లు చూసి ఎవరైనా స్పందించారో... వారి కబంధ హస్తాల్లో చిక్కినట్టే అని చెప్తున్నారు. కమీషన్ బేస్డ్ టాస్క్ గేమ్స్ కింద వారిని రిక్రూట్‌  చేసుకునేలా ఫేక్ వెబ్‌సైట్‌ డిజైన్ చేస్తున్నారు. మొదటిగా యూట్యూబ్‌లో వీడియోలకు లైక్, షేర్. సబ్‌స్రైబ్‌ చేయమని చెప్తారు. ప్రతి లైక్‌కి 100 రూపాయాల నుంచి 130 వరకు ఇస్తామంటారు. మొదటి రోజు నాలుగు వీడియోలు పంపి... లైక్ చేయమని చెప్తారు. లైక్ చేసినందుకు 400 రూపాయాలు అకౌంట్లో జమ చేస్తారు. 5వ టాస్క్ కోసం టెలిగ్రాం యాప్‌కి రీడైరెక్ట్‌ చేసి గైడెన్స్‌ కోసం ఒక ట్యూటర్‌ని ఇస్తునట్లు చెప్పారు. మొదట 54వేల రూపాయలు పెట్టి టాస్క్‌ కొనాలని... దానికి 30శాతం కమీషన్‌ కలిపి 70వేల 200 రూపాయలు వస్తుందని చెప్తారు. 


విశాఖకు చెందిన ఓ మహిళ... ఈ సైబర్‌ గ్యాంగ్‌ వలలో పడింది. వారి మాటలు నిజమని నమ్మి... 54వేల రూపాయలు పెట్టి టాస్క్‌ కొనింది. టాస్క్‌ పూర్తిచేసిన తర్వాత వారు చూపించిన వెల్ఫేర్ టాస్క్ బటన్ నొక్కింది. కమీషన్‌తోపాటు మొత్తం డబ్బు ఇస్తున్నట్లు చూపించారు. కానీ, విత్ డ్రా చేసుకోవడానికి వీలు లేకుండా చేశారు. డబ్బులు విత్‌డ్రా చేయాలంటే మరికొన్ని టాస్కులని కచ్చితంగా పూర్తి చేయాలని సైబర్ నేరగాళ్లు చూసించారు. ఇలా.. బాధితురాలి నుంచి వివిధ టాస్క్‌ల పేరుతో 8లక్షల 82వేల రూపాయలు కొల్లగొట్టారు. డబ్బులు విత్ చేసుకోవాలనుకుంటే ఇంకొంత మొత్తం చెల్లించాలని చెప్పడంతో ఆమె మోసపోయినట్టు గ్రహించి విశాఖ పోలీసులను ఆశ్రయించింది.


బాధితురాలు విశాఖలోని అడవివరంలో ఉంటూ... ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె వాట్సాప్‌కు పార్ట్‌ టైమ్ జాబ్‌ పేరుతో ఒక మెసేజ్‌ వచ్చింది. అందులో టెలీగ్రామ్‌ యాప్‌లో రివ్యూలు రాస్తే డబ్బులు ఇస్తామని ఉంది. డబ్బు వస్తుందని ఆశ పడి ఆమె రివ్యూ రాసేందుకు ఒప్పుకుంది. దీంతో ఆమెకి వాళ్లు కొన్ని టాస్క్‌లు ఇచ్చి ఇచ్చారు. వేలు కట్టి టాస్క్‌ కొని పూర్తిచేస్తే 2వేల 800 వస్తాయని నమ్మించి మోసం చేశారు. యాప్‌లో విత్‌డ్రా ఆప్షన్ పనిచేయకపోవడంతో... కంగారుపడింది. ఇదేమని ప్రశ్నించగా... మరికొన్ని టాస్క్‌లు పూర్తి చేస్తే మొత్తం డబ్బు వస్తుందని నమ్మించారు. అవి కూడా చేసినా... డబ్బు విత్‌డ్రా కాలేదు. ఇంకొన్ని టాస్కులు కొన్నా... అదే పరిస్థితని... మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


కేసు నమోదు పోలీసులు దర్యాప్తు చేశారు. సైబర్‌ నేరగాళ్ల గుట్టు రట్టు చేశారు. ఈ గ్యాంగ్‌పై ఏడాదిలో 72 కేసులు నమోదు అయినట్టు గుర్తించారు. 9 కోట్ల 58లక్షల 83వేల 839 రూపాయలు కొల్లగొట్టినట్టు చెప్పారు. ఇద్దరిని పట్టుకుని విచారణ జరుపుతున్నారు. సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు విశాఖ పోలీసులు.