Couple Forceful Death In Kothagudem District: సింగరేణి సంస్థలో ఉద్యోగాలిప్పిస్తానంటే నమ్మారు. తాము దాచుకున్న డబ్బు సహా అప్పులు చేసి మరీ దళారికి రూ.లక్షలు చెల్లించారు. చివరకు మోసపోయామని గ్రహించి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ తీవ్ర విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడెం జిల్లా (Kothagudem District) జూలూరుపాడు మండలం సాయిరాం తండాకు చెందిన హలావత్ రత్నకుమార్, పార్వతి దంపతులు కొత్తగూడెంలోని ఓ వస్త్రాలయంలో పని చేస్తున్నారు. అయితే, వీరికి సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని హైదరాబాద్‌కు చెందిన ఓ దళారీ నమ్మబలికాడు. అతని మాటలు నమ్మి వీరు దాచుకున్న డబ్బులు సహా అప్పు చేసి మరీ రూ.16 లక్షలు చెల్లించారు. అయితే, ఎప్పటికీ ఉద్యోగాలు రాకపోవడంతో తాము మోసపోయామని గ్రహించారు.


అటు, తీసుకున్న అప్పులకు వడ్డీలు పెరిగి అవి కట్టలేకపోవడంతో రుణం ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై దంపతులు ఇద్దరూ 3 రోజుల క్రిత పురుగుల మందు తాగారు. వీరిని చికిత్స నిమిత్తం బంధువులు హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వీరు మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.


Also Read: DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా