Chittoor News: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇలాకాలో మరో అవినీతి తహసీల్దార్ బాగోతం వెలుగు చూసింది. మొన్న పెనుమూరు ఎమ్మార్వో రమణీ వ్యవహారం, నేడు ఎస్.ఆర్.పురం తహసీల్దార్ అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూసున్నాయి. లంచాలు తీసుకుంటూ గతంలో అనేక మార్లు‌ పట్టుబడినా ఆ తహసీల్దార్ తీరు మాత్రం‌ మార్చుకోలేదు. ఎస్.ఆర్.పురం తహసీల్దార్ షబ్బీర్ భాష వేధింపులు తట్టుకోలేక అధికార పార్టికి చేందిన ఓ సర్పంచ్ ఏకంగా జిల్లా కలెక్టర్ హరి నారాయణకు ఫిర్యాదు చేశాడు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఎస్.ఆర్.పురం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని విచారణ జరిపి జిల్లా కలెక్టర్ హరినారాయణకు నివేదిక పంపారు. అసలు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే వారిపై ఎస్.ఆర్.పురం తహసీల్దార్ షబ్బీర్ భాష ఎలా ప్రవర్తించే వారంటే..?


చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రెవెన్యూ అధికారుల అవినితి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉమ్మడి జిల్లా ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తహసీల్దారు కార్యాలయానికి వచ్చే ప్రజల నుండి నగదు ముట్టనిదే పని చేయని తహసీల్దార్ నగదు ఇవ్వకపోతే కార్యాలయానికి వచ్చిన వారిపై దుర్భాషలాడుతూ రెచ్చిపోయే వారు. అది ప్రజలైనా, అధికార‌ పార్టి నాయకుడైనా ఎవరైనా సరే.. తనకు నగదు మూట చేతిలో పెట్టాల్సిందే. ఇదే ఆ తహసీల్దారు పాలసీ. అయితే ఎస్.ఆర్.పురం మండల‌ కేంద్రంలో తహసీల్దార్ గా భాధ్యతలు చేపట్టిన షబ్బీర్ భాషా మొదట ప్రజలకు సేవలందిస్తూ, ఓ మంచి అధికారిగా ప్రజల నుండి మెప్పు పొందుతూ వచ్చాడు. అదే స్టైల్‌లో అధికార పార్టి నాయకులు సైతం తానొక నిజాయితీ అధికారినంటూ కలరింగ్ ఇచ్చేవాడు. 


సర్పంచి ఢిల్లయ్య ఫిర్యాదుతో వెలుగులోకి..


తన కార్యాలయంలో ఇద్దరు వీఆర్వోలను పక్కన పెట్టుకుని పనికి తగ్గట్టుగా లంచం లాగేవాడు. అంతే కాకుండా ప్రభుత్వ భూములను గుర్తించి నగదు ఇచ్చిన వారికి ఆ భూములను అప్పనంగా కట్ట బెట్టేవాడు. రెవెన్యూ చట్టాలను తనకు అనుకూలంగా మార్చకుని అక్రమాలకు పాల్పడేవాడు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై అసహ్యకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ దూషించేవాడు షబ్బీర్ భాషా. అయితే రోజు రోజుకి మితి మీరుతున్న తహసీల్దార్ షబ్బీర్ భాషా ఆగడాలకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని భావించిన స్ధానిక అధికార పార్టీ సర్పంచ్ ఢిల్లియ్య.. అధికార పార్టీ నాయకులు మూకుమ్మడిగా ఈనెల తొమ్మిదో తారీఖున జిల్లా కలెక్టర్ హరి నారాయణను కలిసి తమ సమస్య వెల్లడించి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. 


దీనిపై సీరియస్ అయిన కలెక్టర్ హరి నారాయణ విచారణ చేపట్టాలని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లలను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో ఎస్.ఆర్.పురం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు కార్యాలయంలోని రికార్డులను‌ పరిశీలించి విచారణ చేపట్టారు. తహసీల్దార్ షబ్బీర్ భాషాతో పాటు మరో ఇద్దరు వీఆర్వోలు అక్రమాలు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది..‌దీంతో షబ్బీర్ భాషాపై ఓ నివేదికను తయారు చేసి జిల్లా కలెక్టర్ హరి నారాయణకు నివేదిక‌ పంపారు. అయితే ఈ నివేదిక పరిశీలించిన తరువాత జిల్లా కలెక్టర్ తహసీల్దార్ షబ్బీర్ భాషాపై శాఖా పరమైన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలోనూ షబ్బీర్ భాషాపై అనేక అవినీతి ఆరోపణను వినిపిస్తూ ఉండడంతో దానిపై కూడా జిల్లా కలెక్టర్ విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. 


డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఎలా స్పందించారంటే...?


తను ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఇలాంటి అవినీతి అధికారులు ఉన్నారంటే నాకే సిగ్గేస్తుందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. మొన్న ఎస్.ఆర్.పురం తహసీల్దార్, నిన్న పెనుమూరు తహసీల్దార్ బాగోతం బయట పడిందని, అవినీతి అనేది క్యాన్సర్ లాంటిది అంటుకుంటే వదలదన్నారు. ఇలా అధికారులు అవినీతికి పాల్పడుతారని జగనన్న పేదల ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేస్తున్నారని, నేను, మంచి తహసీల్దార్ అన్న వారే ఇలా అవినీతికి పాల్పడటం సిగ్గుగా ఉందన్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకుల చేత ప్రతి పనికి లంచం అడగటం పనికి మాలిన తనంమని, అవినీతి అధికారులపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం మంచిదేనన్నారు. అవినీతికి పాల్పడిన ఎస్.ఆర్.పురం తహసీల్దార్ షబ్బీర్ భాషపై విచారణ జరపడంలో అవకతవకలు జరిగినట్లు తేలిందని.. ఇందుకు సంబంధించిన సంబంధిత తహసీల్దార్, వీఆర్వోలపై చర్యలు తీసుకోవాలని  కలెక్టర్ గారికి గట్టిగా చెప్పడం జరిగిందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు.