కర్నూలు నగరంలో కార్తీక దీపాలు వదిలేందుకు వెళ్లిన భార్య భర్తలు కేసీ కాల్వలో గల్లంతయ్యారు. నగరంలోని అబ్బాస్ నగర్ కు చెందిన రాఘవేంద్ర ప్రసాద్, ఇందిరా దంపతులు శుక్రవారం తెల్లవారుజామున వినాయక ఘట్ వద్ద ఉన్న కేసీ కాలువలో కార్తీక దీపాలు వదిలేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఇందిరా కేసీ కాలువలో మునిగి దీపం వదిలేందు ప్రయత్నించగా... ప్రమాదవశాత్తు కాలువలోకి జారిపడిపోయారు. భార్యను కాపాడేందుకు భర్త రాఘవేంద్ర కాలువలోకి దూకాడు. దీంతో భార్యాభర్తలు కాలువలో గల్లంతయ్యారు. పడిదంపాడు వద్ద ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మృతదేహాలను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.


Also Read: దాడి కేసులో స్పందించిన నటి.. షాకింగ్ విషయాలు, అసలు ఆ రోజు కేబీఆర్ పార్క్‌లో ఏం జరిగిందంటే..


కర్నూలులో అగ్ని ప్రమాదం.. రెండు ఇళ్లు దగ్ధం


కర్నూలులోని నంద్యాల చెక్ పోస్టు దగ్గర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు గుడిసెలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. స్థానిక సరస్వతి నగర్​లో శుక్రవారం రాత్రి సురిబాబు అనే వ్యక్తికి చెందిన గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు అంటుకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో రెండు గుడిసెలు పూర్తిగా కాలిపోయినట్లు అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు.


Also Read: ఇప్పటికే ముంచేసిన వాన.. ఇవాళ మళ్లీ భారీ నుంచి అతిభారీ వర్షాలు 


చిత్తూరు జిల్లాలో నలుగురు గల్లంతు


చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం టేకుమందకు చెందిన నలుగురు మహిళలు వరదలో గల్లంతయ్యారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీని ఫుడ్‌పార్కులో పనిచేస్తున్న టేకుమందకు చెందిన లక్ష్మీదేవమ్మ, కస్తూరమ్మ, ఉషారాణి, జయంతి, శిరీష, చిలకమ్మ, శ్రీను పని ముగించుకుని రాత్రి ఆటోలో ఇంటికి బయల్దేరారు. బలిజపల్లి-టేకుమంద వద్దకు రాగానే కాజ్‌వేపై వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో ఆటోను డ్రైవర్‌ నిలిపేసి వెళ్లిపోయాడు. అనంతరం వీరందరూ కాజ్‌వే దాటేందుకు ప్రయత్నించారు. వరద ఉద్ధృతిలో లక్ష్మీదేవమ్మ(40), కస్తూరమ్మ(40), ఉషారాణి (45), జయంతి(45) వాగులో పడి గల్లంతయ్యారు. శ్రీను, శిరీష, చిలకమ్మ ఈదుకుంటూ బయటపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గ్రామస్తుల సాయంతో గాలించారు. చిత్తూరు నుంచి ప్రత్యేక బలగాలు వస్తున్నాయని, గాలింపు ముమ్మరం చేస్తామని ఎస్సై మల్లికార్జునరెడ్డి వివరించారు. 


Also Read: కదిరిలో కూలిన భవనాలు.. ఆరుగురు మృతి.. శిథిలాల్లో మరికొంత మంది


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి