Man Killed His Grandmother Anointed The Sivalinga With Her Blood: శాస్త్ర సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతున్నా ఇంకా కొన్నిచోట్ల మూఢ నమ్మకాలు వీడడం లేదు. కొందరు మూఢ భక్తితో నరబలులు ఇస్తున్నారు. ఇలాంటి దారుణ ఘటనే తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో (Chattisgarh) జరిగింది. ఓ వ్యక్తి త్రిశూలంతో తన నానమ్మను చంపి ఇంటి పక్కనే ఉన్న శివాలయంలో ఆమె రక్తంతో శివలింగానికి అర్పించాడు. అనంతరం తాను అదే త్రిశూలంతో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో నన్‌కట్టి గ్రామానికి చెందిన 30 ఏళ్ల గుల్షన్ గోస్వామి తన నానమ్మ రుక్మిణి గోస్వామి (70)తో కలిసి శివాలయానికి దగ్గరలో ఉన్న ఇంట్లో నివసిస్తున్నాడు. అతను ప్రతిరోజూ శివాలయంలో పూజలు చేసేవాడు.


మూఢ నమ్మకంతో నరబలి


ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం గుల్షన్ తన నానమ్మను త్రిశూలంతో పొడిచి చంపేశాడు. అనంతరం శివాలయానికి వెళ్లి ఆమె రక్తాన్ని శివలింగానికి అర్పించాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చి అదే త్రిశూలంతో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలతో ఉన్న గుల్షన్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి రాయపూర్ ఎయిమ్స్‌కు తరలించారు. వృద్ధురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూఢ నమ్మకాల వల్ల గుల్షన్ తన నానమ్మను నరబలి ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళన నెలకొంది. 


Also Read: Delhi Blast News: ఢిల్లీలో సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడు, ఓ కారు ధ్వంసం - హై అలర్ట్