Stock Market News Today in Telugu: ఆసియా మార్కెట్లలో పెద్దగా ఉత్సాహం లేకపోవడంతో, భారతీయ స్టాక్‌ మార్కెట్లు కూడా ఈ రోజు (సోమవారం, 26 ఫిబ్రవరి 2024) దిగువ స్థాయిలో ప్రారంభమయ్యాయి. ఐటీ, రియాల్టీ స్టాక్స్‌ ఇండెక్స్‌లను కిందకు లాగే పనిలో ఉన్నాయి. 


ఎన్‌విడియా త్రైమాసిక ఫలితాల ఉత్సాహాన్ని టెక్‌ స్టాక్స్‌ ఈ రోజు కూడా కొనసాగించాయి, ఓవరాల్‌ మార్కెట్‌కు దన్నుగా నిలిచాయి.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (శుక్రవారం) 73,143 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 97.98 పాయింట్లు లేదా 0.13 శాతం క్షీణతతో 73,044.81 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. శుక్రవారం 22,213 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 43.50 పాయింట్లు లేదా 0.20 పాయింట్ల పతనంతో 22,169.20 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


విస్తృత మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.2 శాతం & స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.4 శాతం చొప్పున పెరిగాయి.


సెన్సెక్స్ 30 ప్యాక్‌లో.. ఓపెనింగ్‌ టైమ్‌లో 12 స్టాక్స్‌ లాభాల్లో ట్రేడవుతుండగా, 18 స్టాక్స్‌ క్షీణిస్తున్నాయి. లార్సెన్ అండ్ టూబ్రో (L&T) 1.7 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, మహీంద్ర & మహీంద్ర, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్ కూడా లాభపడ్డాయి. మరోవైపు.. ఏషియన్ పెయింట్స్ దాదాపు 4 శాతం పతనమైంది. టెక్‌ మహీంద్ర, టైటన్‌, విప్రో, ఇన్ఫోసిస్‌ లాప్‌ లూజర్స్‌ లిస్ట్‌లో ఉన్నాయి.


నిఫ్టీ 50 ప్యాక్‌లో.. 21 షేర్లు లాభపడగా, 29 షేర్లు రెడ్ జోన్‌లో ఉన్నాయి. ఇక్కడ కూడా లార్సెన్ అండ్ టూబ్రో (L&T) టాప్ గెయినర్‌గా నిలిచింది, పవర్ గ్రిడ్ రెండో స్థానంలో ఉంది. బజాజ్ ఆటో, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లలో బలం కనిపించింది.


చెల్లింపుల్లో ఇబ్బందులు రాకుండా, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లను ఇతర బ్యాంకులకు తరలించే అవకాశాన్ని పరిశీలించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను (NPCI) RBI కోరడంతో పేటీఎం షేర్లు 5% అప్పర్‌ సర్క్యూట్‌లో లాక్‌ అయ్యాయి.


ఈ రోజు ఉదయం 09.50 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 97.16 పాయింట్లు లేదా 0.13% తగ్గి 73,045.63 దగ్గర; NSE నిఫ్టీ 21.60 పాయింట్లు లేదా 0.11% తగ్గి 22,189 వద్ద ట్రేడవుతున్నాయి. 


డిజాస్టర్ రికవరీ సన్నద్ధతతో భాగంగా, ఈ శనివారం (02 మార్చి 2024) నాడు స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్ జరుగుతుంది. శనివారం రోజున రెండు సెషన్లలో.. ఉదయం 09.15 నుంచి 10 గంటల వరకు ఒక సెషన్‌గా, ఆ తర్వాత ఉదయం 11.30 తర్వాత రెండో సెషన్‌గా ట్రేడ్‌ జరుగుతుంది.


గ్లోబల్‌ మార్కెట్లు
ఈ ఉదయం ఆసియా షేర్లు మిశ్రమ ధోరణిని ప్రదర్శించాయి. జపాన్‌కు చెందిన నికాయ్‌ తన రికార్డు రన్‌ను కంటిన్యూ చేసింది, 0.6 శాతం లాభాల్లో ఉంది. తైవాన్ మార్కెట్‌ 0.4 శాతం పెరిగింది. కోస్పి 1.3 శాతం క్షీణించగా, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.5 శాతం పడిపోయింది. గత శుక్రవారం, ఎన్‌విడియా బూస్ట్‌తో US స్టాక్స్ లాభాలతో ముగిశాయి. డౌ జోన్స్‌, S&P 500 కొత్త గరిష్టాలను నమోదు చేశాయి. అయితే, బలమైన ఆర్థిక వృద్ధి నమోదుతో పాటు ద్రవ్యోల్బణం చల్లబడడం వంటి వాటి వల్ల వడ్డీ రేట్ల కోత ఆలస్యం కావచ్చన్న అంచనాల నడుమ లాభాలు తగ్గాయి.


US 10-సంవత్సరాల ట్రెజరీ బాండ్ ఈల్డ్ స్వల్పంగా తగ్గి 4.223 శాతానికి చేరింది బ్రెంట్ క్రూడ్‌ ఆయిల్ బ్యారెల్‌కు $80.50కు పడిపోయింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి