Stock Market Today News in Telugu: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, నిన్న (ఆదివారం) నాలుగు రాష్ట్రాల ఫలితాలు వచ్చాయి. తెలంగాణ మినహా మిగిలిన 3 చోట్లా బీజేపీ సూపర్‌ హిట్‌ రిజల్ట్స్‌ సాధించింది. ఆ ఫలితాల ప్రభావంతో ఈ రోజు (సోమవారం, 04 డిసెంబర్‌ 2023) ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు రాకెట్లలా దూసుకెళ్లాయి. దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఈ విస్ఫోటనం ముందు నుంచీ ఊహించిందే. ఈ రోజు మార్కెట్ బంపర్‌ ఓపెనింగ్‌లోనే సెన్సెక్స్ 950 పాయింట్లకు పైగా, నిఫ్టీ 330 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమయ్యాయి. 


షేర్‌ మార్కెట్‌కు ఇది మరో చారిత్రాత్మక రోజు. BSE సెన్సెక్స్‌, NSE నిఫ్టీ రెండూ మరోమారు 'ఆల్ టైమ్ హై లెవెల్‌'ను (stock market all-time high) చేరుకున్నాయి. 


ఈ ఏడాది సెప్టెంబర్ 15 నాటి నిఫ్టీ ఆల్‌-టైమ్‌ హై రికార్డ్‌, గత సెషన్‌లో (శుక్రవారం, 01 డిసెంబర్‌ 2023) చెరిగిపోతే, ఆ కొత్త రికార్డ్‌ కూడా, కేవలం ఒక్క సెషన్‌ వ్యవధిలోనే, ఈ రోజు తుడిచిపెట్టుకుపోయింది. ఈ రోజు మార్కెట్ ప్రారంభంలోనే నిఫ్టీ చరిత్రాత్మక గరిష్ట స్థాయి 20,602.50 ని (Nifty fresh all-time high)  తాకింది.


సెన్సెక్స్‌ కూడా, మార్కెట్‌ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే కొత్త జీవన కాల గరిష్టం 68,587.82 పాయింట్లను  (Sensex fresh all-time high) టచ్‌ చేసింది.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
శుక్రవారం, 67,481 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 54.16 పాయింట్లు లేదా 1.41 శాతం పెరుగుదలతో 68,435 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. గత సెషన్‌లో 20,268 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 334 పాయింట్లు లేదా 1.65 శాతం భారీ గెయిన్స్‌తో 20,601 వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


విపరీతంగా పెరిగిన బ్యాంక్ నిఫ్టీ
బ్యాంక్ నిఫ్టీలోని మొత్తం 12 షేర్లు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. ఈ ఇండెక్స్‌ ఈ రోజు అత్యధిక స్థాయి 45,821కి చేరుకుంది. ఉదయం 9.45 గంటలకు 954.65 పాయింట్లు లేదా 2.13% లాభంతో 45,768 వద్ద ఉంది. బ్యాంక్ నిఫ్టీ ప్రారంభ ట్రేడింగ్‌లోనే 1000 పాయింట్లకు పైగా దూసుకెళ్లింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ రెండూ 2-2.50% వరకు లాభంతో అద్భుతంగా మెరిశాయి.


కొత్త శిఖరంపై నిఫ్టీ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ (Nifty Midcap Index)
నిఫ్టీ మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ 105.95 పాయింట్లు లేదా 1.08% జంప్‌తో 9,873 స్థాయిలో ఉంది. మిడ్‌ క్యాప్ స్టాక్స్‌ ర్యాలీ చాలా రోజులుగా కొనసాగుతోంది. నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్‌ల్లో... PSU బ్యాంక్‌లు గరిష్టంగా 2.93 శాతం పెరిగాయి. ఆ తర్వాత, చమురు & గ్యాస్ రంగం 2.20 శాతం, నిఫ్టీ బ్యాంక్ 2.07 శాతం పెరిగింది. మీడియా రంగం మినహా మిగిలిన అన్నింటిలో గ్రీన్ మార్క్ కనిపిస్తోంది.


అడ్వాన్స్‌/డిక్లైన్‌ రేషియో
BSEలో, బిజినెస్‌ ప్రారంభంలో 1600 షేర్లు లాభాలతో ఉండగా, 100 షేర్లు మాత్రమే నష్టాలతో ప్రారంభమయ్యాయి. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: చుక్కలు దాటిన గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి