ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌పై ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వార్నర్‌ ఏమైనా హీరోనా అంటూ తీవ్ర విమర్శలు చేశాడు. ఘనంగా వీడ్కోలు పలకడానికి వార్నర్‌ అర్హుడు కాదని జాన్సన్‌  అభిప్రాయపడ్డాడు. సొంతగడ్డపై పాకిస్థాన్‌‌తో జరగనున్న టెస్ట్ సిరీస్ అనంతరం సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు డేవిడ్ వార్నర్ ఇప్పటికే ప్రకటించాడు. పెర్త్ వేదికగా తొలి టెస్ట్‌కు ఆస్ట్రేలియా ఎంపిక చేసిన 14 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో డేవిడ్ వార్నర్‌కు చోటు దక్కింది. ఈ నేపథ్యంలో వార్నర్‌పై మిచెల్‌ జాన్సన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సిడ్నీలో చివరి టెస్టు ఆడాలని ఉందని వార్నర్‌ బహిరంగంగా చెప్పడంపై కూడా మిచెల్‌ జాన్సన్‌ విమర్శలు గుప్పించాడు. 2018లో దక్షిణాఫ్రికాలో ఆస్ట్రేలియా బాల్‌ టాంపరింగ్‌ చేస్తూ దొరికిపోయిన వార్నర్‌కు ఎందుకు ఘనంగా వీడ్కోలు పలకాలని ఆసిస్‌ మాజీ పేసర్‌ ప్రశ్నించాడు. 

 

ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వీడ్కోలు సిరీస్‌ కోసం అంతా సిద్ధమవుతోందని.. కానీ ఇలా ఎందుకు చేస్తున్నారో దయచేసి ఎవరైనా చెప్పగలరా అని జాన్సన్‌ వ్యంగ్యంగా ప్రశ్నించాడు. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న ఓ ఓపెనర్‌ తానే స్వయంగా రిటైర్మెంట్‌ తేదీ ప్రకటించుకునే అవకాశం ఇవ్వడం ఏమిటని ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డును ప్రశ్నించాడు. ఆస్ట్రేలియా క్రికెట్‌ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంలో కేంద్ర బిందువైన ఓ ఆటగాడికి హీరో తరహా వీడ్కోలు ఎందుకంటూ నిలదీశాడు.  బాల్‌టాంపరింగ్‌ వివాదంలో వార్నర్‌తో పాటు ఇతర ఆటగాళ్లూ ఉన్నారని గుర్తు చేశాడు. స్థానిక వార్తా పత్రికకు రాసిన వ్యాసంలో జాన్సన్‌ ఈ వ్యాఖ్యుల చేశాడు. ఈ విమర్శలపై వార్నర్‌ ఇంతవరకూ స్పందించలేదు.

 

చివరి టెస్టు సిరీస్‌

డేవిడ్‌ వార్నర్‌ టెస్టులకు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది. సుదీర్ఘ ఫార్మాట్లో చివరగా పాకిస్థాన్‌తో మూడు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు వార్నర్‌ సిద్ధమయ్యాడు. ఈ నెల 14న పెర్త్‌లో ఆరంభమయ్యే తొలి టెస్టు కోసం ప్రకటించిన 14 మంది ఆటగాళ్ల జట్టులో వార్నర్‌కు చోటు దక్కింది. ఈ నెల 26న మెల్‌బోర్న్‌లో ఆరంభమయ్యే రెండో టెస్టులోనూ వార్నర్‌ ఆడితే.. వచ్చే నెల 3 నుంచి జరిగే సిడ్నీ మ్యాచ్‌తో టెస్టు కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించే అవకాశముంది. సొంతగడ్డ అయిన సిడ్నీలో టెస్టులకు వీడ్కోలు పలకాలనే ఆశను గతంలో వార్నర్‌ వ్యక్తపరిచాడు. 2019లో పాకిస్థాన్‌పై ట్రిపుల్‌ సెంచరీ తర్వాత వార్నర్‌ ఫామ్‌లో లేడు. ఆ తర్వాత ఆడిన టెస్టుల్లో అతను 28 సగటు మాత్రమే. జనవరి 3 నుంచి స్వదేశంలో జరిగే మూడో మ్యాచ్ ద్వారా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని డేవిడ్ వార్నర్ యోచిస్తున్నాడు. దీంతో ఇప్పుడు తొలి టెస్టు మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్‌కు అవకాశం దక్కింది. సిడ్నీ టెస్టులోనూ వార్నర్ కనిపించడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో టెస్టులకు సిడ్నీలో గుడ్‌బై చెప్పాలని 37 ఏళ్ల వార్నర్‌ ఆశపడుతున్నాడు.

 

మరోవైపు పాకిస్థాన్‌తో తొలి టెస్టు మ్యాచ్‌కు ఎంపికైన ఆస్ట్రేలియా జట్టులో బలమైన ఆటగాళ్లు ఉన్నారు. ఆల్‌రౌండర్ పాట్ కమిన్స్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా బరిలోకి దిగనున్నారు. మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, స్కాట్ బోలాండ్ పేసర్లుగా ఉంటే.. నాథన్ లియాన్ స్పిన్నర్‌గా కనిపించాడు. 

 

ఆస్ట్రేలియా జట్టు: కమిన్స్‌ (కెప్టెన్‌), బోలాండ్‌, కేరీ, గ్రీన్‌, హేజిల్‌వుడ్‌, హెడ్‌, ఖవాజా, లబుషేన్‌, లైయన్‌, మిచెల్‌ మార్ష్‌, లాన్స్‌ మోరిస్‌, స్మిత్‌, స్టార్క్‌, వార్నర్‌.