Sugar Stock Performance: గత వారం షుగర్‌ స్టాక్స్‌కు చాలా కఠినంగా గడిచింది. దేశంలో చెరకు సాగు తగ్గడంతో, దేశీయ మార్కెట్‌లో తగినంత చక్కెర అందుబాటులో ఉంచడానికి, ధరలను అదుపులో పెట్టడానికి కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. FY24లో ఇథనాల్ ఉత్పత్తి ‍‌(ethanol production) కోసం షుగర్‌కేన్‌ జ్యూస్‌, షుగర్‌ సిరప్ వాడకాన్ని నిషేధించింది. ఇది, దేశ ప్రజలకు తియ్యటి వార్తే అయినా... చక్కెర కంపెనీలకు చేదు వార్త. ఇథనాల్‌ ఉత్పత్తి కోసం చెరకును మళ్లించకపోతే చక్కెర కంపెనీల ఆదాయానికి గండి పడుతుంది. కాబట్టి, షుగర్‌ స్టాక్స్‌లో బేరిష్‌ సెంటిమెంట్‌ పెరిగింది.


గత వారంలో బలరాంపూర్ చినీ మిల్స్ షేర్‌ ప్రైస్‌ 16.7% పతనమైంది, ఇతర స్టాక్స్‌ది కూడా ఇదే పరిస్థితి. 


గత వారంలో ‍చక్కెర షేర్ల పని తీరు ‍(Performance of Sugar Shares in Last Week): 


బలరాంపూర్ చినీ మిల్స్ --  దాదాపు 17 శాతం డౌన్‌
అవధ్‌ షుగర్స్‌ -- దాదాపు 14 శాతం పతనం
 బజాజ్‌ హిందుస్థాన్‌ షుగర్‌ -- 14 శాతం క్షీణత
దాల్మియా షుగర్‌ -- 15 శాతం తగ్గుదల
DCM శ్రీరామ్‌ -- 8 శాతం డౌన్‌
ధంపూర్‌ షుగర్‌ -- 12 శాతం పతనం
ద్వారికేష్‌ షుగర్‌ -- దాదాపు 8 శాతం క్షీణత 
గాయత్రి షుగర్స్‌ -- 9 శాతం తగ్గుదల
KCP షుగర్స్‌ -- దాదాపు 10 శాతం డౌన్‌
KM షుగర్‌ మిల్స్‌ -- 7 శాతం పతనం
శ్రీ రేణుక షుగర్స్‌ -- దాదాపు 10 శాతం క్షీణత 
త్రివేణి ఇంజినీరింగ్‌ -- దాదాపు 14 శాతం తగ్గుదల


ప్రస్తుత క్రషింగ్ సీజన్‌లో (అక్టోబర్ 2023-సెప్టెంబర్ 2024), దేశంలో చక్కెర ఉత్పత్తి పరిస్థితి ఆశాజనకంగా లేదని JM ఫైనాన్షియల్‌ కూడా గతంలో ఒక రిపోర్ట్ రిలీజ్‌ చేసింది. బ్రోకరేజ్‌ నివేదిక ప్రకారం, ఈ ఏడాది ఆగస్టు నెలలో, ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ISMA), 2023 అక్టోబర్ - 2024 సెప్టెంబర్‌ కాలంలో (SS24) 31.7 మిలియన్‌ టన్నుల చక్కెర ఉత్పత్తిని ప్రాథమికంగా అంచనాను వేసింది. అయితే, ఆగస్టు 2023 దేశవ్యాప్తంగా డ్రై సీజన్‌. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో ఉత్పత్తి అంచనాలను తగ్గించే అవకాశం ఉంది. దేశం మొత్తం చెరకు ఉత్పత్తిలో ఈ రెండు రాష్ట్రాలదే దాదాపు సగం వాటా. కాబట్టి, ఈ రెండు రాష్ట్రాల్లోని వాతావరణ సాగు విస్తీర్ణం, దిగుబడి.. దేశవ్యాప్త ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. 


SS24లో భారతదేశ చక్కెర ఉత్పత్తి 30 మిలియన్‌ టన్నులుగా ఉండొచ్చని JM ఫైనాన్షియల్‌ అంచనా వేసింది. చెరకును ఎక్కువగా సాగు చేసే రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్‌లో దిగుబడిపై పొడి వాతావరణం ప్రభావం ఉండదని భావిస్తోంది. ఆ రాష్ట్ర నదుల్లో పుష్కలంగా నీరు అందుబాటులో ఉండడాన్ని దీనికి కారణంగా చెబుతోంది. 


కేంద్ర ప్రభుత్వ జీవో వల్ల చక్కెర పరిశ్రమపై కమ్ముకున్న మేఘాలు తాత్కాలికమేనని బ్రోకరేజ్‌ చెబుతోంది. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో తక్కువ ఉత్పత్తి అంచనాల వల్లే ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చింది. మంచి వర్షాలు కురిసి ఆ రెండు రాష్ట్రాల్లో నీటి లభ్యత పెరిగితే, ఆ జీవోను రద్దు చేసే అవకాశం ఉందని వెల్లడించింది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.